యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః॥
సృష్టిలోని సమస్త జీవరాశుల్లోనూ లక్ష్మీ రూపంలో కొలువుదీరిన ఆదిశక్తికి నమస్సులు తెలియజేసింది వేదం. శివ సంకల్పమైన శక్తిస్వరూపిణి వరలక్ష్మిగా అనుగ్రహిస్తుంది. ఆవిడే అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. వరలక్ష్మిగా వాయినాలు అందుకుంటున్న శ్రావణ లక్ష్మీ.. శక్తి స్వరూపమే. ఈ అమ్మను కొలిచినా ఆ పెద్దమ్మకే చెల్లుతుంది. ఆ అమ్మను అర్థించినా వరలక్ష్మమ్మ వరాలిస్తుంది.
వ్రత విధానం
వర అంటే శ్రేష్ఠమైనదని అర్థం. శ్రేష్ఠమైన లక్ష్మిని ఆరాధించే విధానమే వరలక్ష్మీ వ్రతం. ప్రాంతాచారాలను బట్టి వ్రత విధానంలో చిన్నచిన్న మార్పులు ఉంటాయి. ఎలా చేసినా తల్లి అనుగ్రహిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనసును, ఇంటిని శుద్ధంగా ఉంచుకోవాలి. వ్రతం రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. కల్లాపి చల్లి ముంగిలిని ముగ్గులతో, గడపను పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. వ్రతసామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత మళ్లీ లేవకుండా అన్ని వస్తువులూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. గణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. పసుపు గణపతిని చేసి తొలి పూజ నిర్వహించాలి. తర్వాత కలశ స్థాపన, పూజ చేయాలి. లక్ష్మీదేవి ప్రతిమను అందంగా అలంకరించుకొని పీటపై ప్రతిష్ఠించుకోవాలి.
షోడషోపచార పూజలు చేయాలి. శ్రీవరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలతో శ్రీదేవిని అర్చించాలి. అనంతరం ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. సర్వోపచారాలు చేసిన తర్వాత తోరాలకు పూజ చేస్తారు. అనంతరం చేతుల్లో అక్షతలు తీసుకొని వరలక్ష్మీ వ్రతకథ (చారుమతి కథ)ను చదవాలి. కథ పూర్తయిన తర్వాత ఆ అక్షతలను శిరసుపై వేసుకోవాలి. మిగిలిన కుటుంబసభ్యుల శిరసులపై కూడా వేయాలి. తర్వాత నీరాజనం సమర్పించాలి. ఇంటికి పిలిచిన ముత్తయిదువులను లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి వాయినాలు ఇచ్చి, ఆశీస్సులు అందుకోవడంతో వ్రతం పూర్తవుతుంది. తెల్లవారి అంటే శనివారం అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. లక్ష్మీదేవిని ప్రతిష్ఠించిన పీటను కొద్దిగా కదిలించాలి. పూజానంతరం పూలు, ఇతర నిర్మాల్యాలను చెరువులోగానీ, ఎవరూ తొక్కని ఆకుపచ్చని చెట్ల పొదల్లోగానీ విడిచిపెట్టాలి.
‘హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ మావహా’
అంటుంది శ్రీ సూక్తం. అరుణోదయ సమయంలో లక్ష్మీదేవికి స్వాగతం పలికిన గృహం పావనం అవుతుంది. ఆ మంత్రోచ్ఛారణతో దుష్ప్రభావం తొలగిపోతుంది. ఆనందార్ణువమైన శుభసంపత్తి అభివృద్ధి అవుతుందని శాస్త్ర వచనం. అనంత శక్తిమయి అయిన అమ్మవారి పేరు పలికితే చాలు సమస్త దుర్గుణాలు తొలగిపోతాయి. ప్రపంచ విధులను నెరవేర్చడానికి సర్వారుణయై అనుగ్రహిస్తుంది అమ్మ. తల్లిగా ప్రేమను పంచుతుంది. బిడ్డల ఆలనా, పాలనా చూస్తుంది. దీక్షా, దక్షతకు అవసరమైన కాఠిన్యాన్నీ చూపుతుంది. వెంటనే క్రమపద్ధతిలో నియంత్రించి మార్గదర్శనం చేస్తుంది. అభివృద్ధికి, చైతన్యానికి, మోక్షానికి ప్రతీక సర్వారుణ. శ్రీమాత పాదాల నుంచి అనంత కిరణాలు ఉత్పన్నం అవుతాయి. వీటిలో 108 అగ్ని కిరణాలు, 116 సూర్య కిరణాలు, 136 చంద్రకిరణాలు ప్రసరిస్తాయి. అన్నీ కలిపితే 360 ముఖ్య కిరణాలు. ఇవి ప్రపంచమంతా వాప్తి చెంది స్వర్ణారుణమయంగా ప్రకాశిస్తుంటాయి. 360 కిరణాల సముదాయమే సంవత్సర కాల పరిణామంగా మార్పు చెందింది అంటారు పెద్దలు.
ఆభరణాలన్నీ అమ్మవే
సప్తకోటి మహామంత్రాలు, వేదాలు, ఉపవేదాలు ఇవన్నీ జగజ్జనని ఆభరణాలుగా ప్రకాశిస్తుంటాయి. విశ్వంలోని అణువు నుంచి అనంతం దాకా ఆ తల్లి ఆభరణాలై శోభిల్లుతుంటాయి. చతుషష్టి ఉపచారాలలో పేర్కొన్న నవమణి మకుటం, చంద్రార్థ శకలం, చింతాకం, మణిమండల యుగం, ఉంగరం, కంకణాలు, భుజకీర్తులు, నాగారం, కటి సూత్రం ఇవన్నీ ధరించి దర్శనమిస్తుంది దేవి. నవరత్న ఖచిత ఆభరణాలు ధరించడమే కాదు.. నవగ్రహాలను శాసించే శక్తిగా సర్వజగత్తునూ తన ఆభరణంగా చేసుకుందామె. తను సృష్టించిన సమస్త పుష్పాలను అలంకరించుకుంటుంది. పండ్లను, కూరగాయలను ఆభరణాలుగా స్వీకరించి శాకంబరిగా అనుగ్రహిస్తుంది. అమ్మకు అలంకారం అంటే ఇష్టం. అందుకే దేవిని ‘అలంకార ప్రియ’ అని స్తుతించారు. లోకంలో ఉన్న స్త్రీలంతా వారివారి అధికారానుసారం, స్థితిని బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి కొన్ని ఆభరణాలు ధరించడం మామూలే! అయితే అదే సంప్రదాయంలో కొన్ని ఆభరణాలను పూజిస్తాం కానీ, ధరించే అధికారం ఉండదు. జగజ్జనని అయిన వరలక్ష్మీదేవికి అన్ని ఆభరణాలు ధరించే సర్వాధికారం ఉంది. అన్నీ సృష్టించింది తనే కాబట్టి, వాటన్నిటినీ అలంకరించుకునే దక్షత కూడా ఆమె సొంతం. అయితే, అమ్మ ఆనందమంతా ఆత్మ స్వరూపంలోనే ఉంది. ఆ ఆత్మ స్వరూపాన్ని దర్శించుకోవడమే అమ్మ అనుగ్రహం పొందామన్నదానికి ప్రతీక.
సౌభాగ్యం కోరుకుందాం
శ్రావణమాసం అనగానే కాంతలు కొత్త కాంతితో మెరిసిపోతారు. నానావిధ ఆభరణాలతో కళకళలాడుతుంటారు. భక్తిప్రపత్తులతో వ్రతాలు నిర్వహిస్తూ లక్ష్మీదేవినీ, మంగళగౌరినీ ఆరాధిస్తారు. ఈ అలంకారాలు రెండు రకాలు. అందాన్ని ఇనుమడింపజేసేవి సౌందర్య హేతువులు. ఇవి వారి వారి ఇష్టాన్ని బట్టి ధరిస్తుంటారు. వీటిని ధరించకున్నా పోయేదేం ఉండదు. మంగళ సూత్రం, గాజులు, మెట్టలు, ముక్కుపుడుక, చెవిదుద్దులు, నుదుటన బొట్టు వీటిని సౌభాగ్య హేతువులు అంటారు. ఇవి అలంకారాలు కావు. సౌభాగ్య సూచకాలు. గుడిలో కొలువుదీరిన అమ్మవారు అన్యాపదేశంగా సౌభాగ్యవతులు ఎలా ఉండాలో తాను అలంకరించుకొని మనకు తెలియజేస్తుంటుంది. మన సంప్రదాయాన్ని గుర్తు చేస్తుంటుంది. శ్రావణ మాసంలో వెల్లువలా వచ్చే వ్రతాలు మన సంప్రదాయాలను మళ్లీ గుర్తు చేస్తాయి.
కొంగు బంగారం
మన పూర్వీకులు నిర్దేశించిన వ్రతాలు, నోముల ఆంతర్యం అనన్య సామాన్యమైనది. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచడానికి, సృష్టి, ప్రకృతి ధర్మాలు పాటిస్తూ సమాజ ఉద్ధరణకు ఆలూమగలను కార్యోన్ముఖులను చేసే పవిత్ర ఉద్దేశంతో వీటిని నిర్దేశించారు మనవాళ్లు. అనుసంధానం మన సంస్కృతికి గుర్తు. విద్య, ఆరోగ్యపరమైన మెట్లు ఎక్కుతూ అభివృద్ధి పథంలో పయనించాలి. ఆధ్యాత్మిక సాధన చేస్తూ హృదయానుభూతి పొందాలి. వరలక్ష్మి ఆరాధనతో మానసిక అనారోగ్యాలను జయించి అఖండమైన ఆనందాన్ని పొందాలి. వరలక్ష్మీ.. మూలాధార చక్రం నుంచి బీజమై, శివ సంకల్పమై సృష్టి క్రమంలో పరిణతి చెందుతూ సర్వసిద్ధిప్రదాచక్రం వరకు ఆజ్ఞాకారిణియై శివశక్తి స్వరూపంగా హృదయంలో కొలువై ఉంటుంది. మంగళ స్వరూపిణిగా పేరున్న వరలక్ష్మి శివశకత్యుక స్వరూపంలో ఆవిర్భవించే శుభ సందర్భంలో ఇంటికి వచ్చిన ముత్తయిదువులను, దంపతులను దేవతలుగా భావించి వారిని ఉచిత రీతిలో సత్కరించాలి. అతిథుల సంతృప్తి.. వరలక్ష్మీ అనుగ్రహమై ఆ ఇల్లాలి కొంగుముడిన బంగారంగా సదా నిలిచి ఉంటుంది.
–సి.విజయలక్ష్మీ రాజం