రంగారెడ్డి, ఏప్రిల్ 19, (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ ధాన్యాన్ని విక్రయించే ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా సీఎం కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాట్లపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాసంగి సీజన్కుగాను 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారన్నారు. వచ్చేనెలా మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో ఈ ఏడాది 28 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వ్యవసాయాధికారులు ఇచ్చే టోకెన్ల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు మంత్రి సూచించారు.
రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు రైతులందరూ వచ్చేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాలని సూచించారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.1888, సాధారణ రకానికి రూ.1868 చొప్పున చెల్లించనున్నామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఆమన్గల్, కడ్తాల్, పడకల్, వెల్టాల్, మంచాల, బొడకొండ, శంకర్పల్లి, షాద్నగర్, కొందుర్గు, మేకగూడ, కందుకూరు, మల్కారం, పాలమాకుల, బండరావిర్యాల, బాచారం, గౌరెల్లి, రాచకొండ, మైలారం, కొత్తపేటలో కొనుగోలు కేంద్రాలను, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, యాచారం, చింతపట్ల, షాబాద్, కొహెడ, నాగిళ్లలో, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో షాద్నగర్, ఆమన్గల్, సర్దార్నగర్, మంచాలలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సమావేశంలో డీసీవో ధాత్రిదేవి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్యామారాణి, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, వ్యవసాయ శాఖ ఏడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి.. ప్రముఖుల ఆకాంక్ష
ఢిల్లీ స్కూల్స్కు రేపటి నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు
కరోనాలో కాసుల కక్కుర్తి.. యూపీలో అంత్యక్రియలకు తడిసిమోపెడు