శిల్పాలను చెక్కేవారిని ‘శిల్పులు’ అంటారు. బంగారం పనిచేసేవారిని ‘కంసాలులు’ అంటారు. ఇత్తడి, కంచు వస్తువులను తయారు చేసేవారిని ‘కంచరి’ వారంటారు. కర్రపని చేసేవారిని ‘వడ్రంగులు’ అంటారు. ఇనుప పనిముట్లను చేసేవారిని ‘కమ్మరులు’ అంటారు. ఈ అయిదు కులాలవారిని కలిపి ఉమ్మడిగా ‘విశ్వబ్రాహ్మణులు’ అంటారు. సజాతీయ ప్రాణి సమూహాన్ని ‘కులం’ అంటారని ‘సూర్యరాయాంధ్ర’ నిఘంటువు చెప్తున్నది. విశ్వబ్రాహ్మణులైన పై అయిదు కులాలవారిలోగల ‘సజాతీయత’ వారి వృత్తి.
‘వర్తతే అనయా వృత్తిః. సీ. వృతువర్తినే. దీనిచేత వర్తించును’ (అమరకోశం). దేనిచేత లోకం నడుస్తుందో అది ‘వృత్తి’. శివునికి అయిదు ముఖాలున్నవి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములన్నవి ఆ ముఖాల పేర్లు. ఈ అయిదు ముఖాలనుండి వరుసగా మనువు (మనో), మయుడు, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞులనే ‘పంచబ్రహ్మలు’ ఉదయించారు. వీరు ‘ఋగ్యజుస్సామ, అధర్వణ, ప్రణవ’ అనబడే అయిదు వేదాలకు ప్రవక్తలు. ‘వర్ణ వ్యవస్థ’ ఏర్పడిన కొంత కాలానికి కర్మ, జన్మ విశేషాలవల్ల ‘బ్రాహ్మణ్యం’లో ‘ఆర్షేయ’మని, ‘పౌరుషేయ’మని రెండు శాఖలు ఏర్పడ్డాయి. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు అన్న ఏడుగురు ‘ఆర్షేయశాఖ’కు ఆద్యులైన మహర్షులు. సానగ, సనాతన, అహభాన, ప్రత్న, సుపర్ణ అన్న పేరుగల మహర్షులు ‘పౌరుషేయ శాఖ’కు ఆద్యులైనారు. ఈ అయిదుగురు మహర్షులు పైన పేర్కొన్న పంచబ్రహ్మల అంశతో జన్మించారని ఐతిహ్యం. వీరి సంతానమే విశ్వబ్రాహ్మణులు. ‘విశ్వజ్ఞ’ లేదా ‘విశ్వకర్మ’ నుండి ‘విశ్వ’ శబ్దాన్ని పంచబ్రహ్మల నుండి ‘బ్రాహ్మణ’ శబ్దాన్ని స్వీకరించిన ఈ పంచబ్రహ్మల సంతానమే ‘విశ్వబ్రాహ్మణులు’గా పేరొందారు.
ఆవాస విద్యాలయాలను ‘గురుకులాలు’ అంటున్నాం. ప్రాచీనకాలంలో విద్య నేర్చుకొనేందుకు వచ్చిన శిష్యులు గురువుగారి ఆశ్రమంలో ఉండేవారు. శిష్యులకు విద్యాబుద్ధులను గరపే బాధ్యత గురువుగారిది. వారి పాలన, పోషణ బాధ్యత గురుపత్నిది. అక్కడున్నంత కాలం విద్యార్థులకు గురువు తండ్రి. గురుపత్ని తల్లి. వారిది గురువుగారి వద్ద విద్యనభ్యసించే విద్యార్థి కులం. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ను ఉపకులపతి అని, ఛాన్సలర్ను ‘కులపతి’ అని సంబోధిస్తున్నాం. నిజానికి వైస్ ఛాన్సలర్ను కులపతి అని, ఛాన్సలర్ను కులాధిపతి అని అనాలి. ‘కుల’ శబ్దం విద్యనుండి అంకురించింది కనుకనే, విశ్వవిద్యాలయాలకు కులపతులు, కులాధిపతులు ఉన్నారు. ఈ లెక్కన విశ్వబ్రాహ్మణ కులాలను ‘వృత్తి విద్యాకులాలు’ అని పిలవాలి. ‘వృత్తి’ అన్నది ‘విద్య’ అవుతుందా! భారతీయ సంప్రదాయంలో ఉద్యోగాలన్నీ వృత్తులే. వృత్తులన్నీ విద్యలే. మోక్షాన్ని పొందడం కోసం అడవికి వెళ్లి, చేసుకొనే తపస్సుకు సైతం ‘ముని వృత్తి’ అన్న పేరు ఉన్నది. విద్యకు సంబంధించిన ‘తొలి గురువు’ తండ్రి. ఉపనయనంలో వటువుకు గాయత్రీ మంత్రోపదేశం చేసే అర్హత తండ్రికే ఉన్నది.
‘వృత్తి విద్యాకులం’ అన్న సమాసంలో ‘వృత్తి విద్యా’ అన్న పదాలు లుప్తమై ‘కులం’ మిగిలింది. ఈ కులాలవారు చేసే వృత్తులు వ్యవహారంలో కులవృత్తులైనవి. వంశపారంపర్యంగా వచ్చే మాన్యాన్ని ‘వృత్తి’ అంటారు. వృత్తి కులాల ఇండ్లలో శిశువు అంబాడటం నేర్చుకొన్న నాటినుండి తండ్రి పనిముట్లతో ఆడుకొంటూంటాడు. వానికి పదిహేనేండ్ల వయస్సు వచ్చేనాటికి వృత్తి నిష్ణాతలో తండ్రితో సమానుడవుతాడు. తండ్రి వయస్సుకు ఎదిగేటప్పటికి అతని వృత్తి విద్యా నైపుణ్యం దిగంతాలకు ఎగబ్రాకుతుంది. ప్రాచీన భారత ఖ్యాతి దశదిశలా వ్యాపించడంలో వృత్తి విద్యాకులాల తోడ్పాటు అపారం. ప్రాచీనకాలపు వృత్తి విద్యాకుల నైపుణ్యానికి ‘మయసభ’, ఆధునిక కాలపు కులవృత్తి విద్యా నైపుణ్యానికి ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయం పరాకాష్ఠగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
శివునికి అయిదు ముఖాలున్నవి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములన్నవి ఆ ముఖాల పేర్లు. ఈ అయిదు ముఖాలనుండి వరుసగా మనువు (మనో), మయుడు, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞులనే ‘పంచబ్రహ్మలు’ ఉదయించారు.
వరిగొండ కాంతారావు
9441886824