కరోనా వ్యాప్తితో ప్రభుత్వ నిర్ణయం.. నేటినుంచే అమల్లోకి
ప్రభుత్వ, ప్రైవేట్ బడులతోపాటు గురుకులాలు, హాస్టళ్లకూ వర్తింపు
ఆన్లైన్ తరగతులు యథాతథం
అసెంబ్లీలో మంత్రి సబిత ప్రకటన
జీవో జారీచేసిన సీఎస్ సోమేశ్
40 రోజులు నడిచిన విద్యాసంస్థలు
పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదా
జేఎన్టీయూ పరీక్షల్లో మార్పుల్లేవ్
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలలన్నింటినీ తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. బుధవారంనుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, గురుకులాలు, వసతి గృహాలన్నింటినీ మూసివేస్తున్నట్టు మంగళవారం శాసనసభలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వైద్య కళాశాలలు మాత్రం పనిచేస్తాయని తెలిపారు. ఆన్లైన్ తరగతులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టంచేశారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకొన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి 9, ఆ పై తరగతులకు బడులు మొదలయ్యాయి. అదే నెల 24 నుంచి 6 నుంచి 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించారు. పాఠశాలల్లో 75%, జూనియర్ కాలేజీల్లో 60%, మిగతా విద్యాసంస్థల్లో 50% చొప్పున విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థులంతా గుమిగూడటం, కరోనా నిబంధనలు పాటించకపోవడంతో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. మంగళవారం వరకు పాఠశాలల్లో 700, జూనియర్ కాలేజీల్లో 150కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే.. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాసంస్థల్లో పరిస్థితులను సమీక్షించారు. విద్య, వైద్యారోగ్యశాఖల నుంచి నివేదికలను తెప్పించుకొన్నారు. మంగళవారం ఉదయం ప్రగతిభవన్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్తో భేటీ అయి తాజా పరిస్థితిని వివరించారు. సీఎం ఆదేశాల మేరకు వి ద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించారు.
తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే
విద్యాసంస్థల మూసివేతపై మంత్రి సబిత శాసనసభలో ఒక ప్రకటన చేశారు. దేశంలో మరోమారు కరోనా విజృంభిస్తున్నదని, పొరుగు రాష్ర్టాల్లో మరీ ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. కరోనా విస్ఫోటనంగా మారే ప్రమాదమున్నదని గ్రహించి, విద్యాసంస్థలను వెంటనే మూసివేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలను మూసివేశాయని పేర్కొన్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తాత్కాలికంగా పాఠశాలలను మూసివేయాలని తల్లిదండ్రులనుంచి విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. పరిస్థితులను సమీక్షించిన మీదట కరోనా వ్యాప్తిని అరికట్టడం, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆరోగ్యం కాపాడటం కోసం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకొన్నామని సబిత చెప్పారు. వైద్య కళాశాలలు మినహా రాష్టంలోని అన్ని గురుకులాలు, వసతిగృహాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటినీ మూసివేస్తున్నామని చెప్పారు. అన్ని స్థాయిల్లో గతంలో మాదిరిగానే ఆన్లైన్ తరగతులు జరుగుతాయని తెలిపారు. ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలంతా విధిగా మాస్క్లు ధరించడంతోపాటు భౌతికదూరాన్ని పాటించాలని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 16,159 విద్యాసంస్థలు మూతబడనున్నాయి.
నడిచింది నలబై రోజులే
లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటినుంచి పాఠశాలలు మొదలయ్యాయి. మొదట 9,10, డిగ్రీ, ఇతర వృత్తివిద్యాకళాశాలలు ప్రారంభమై 40 రోజులు నడిచాయి. సెలవు రోజులను మినహాయిస్తే ఫిబ్రవరిలో 23, మార్చిలో 17 రోజులే తరగతులు నిర్వహించారు. తాజాగా ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని మంత్రి ప్రకటించిన నేపథ్యంలో విద్యాసంవత్సరం కొనసాగినట్లుగానే భావించాలని అధికారులు అంటున్నారు.
పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదా
విద్యాసంస్థల మూసివేత నేపథ్యలో పరీక్షల నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం నుంచి ప్రారంభంకానున్న పాలిటెక్నిక్ పరీక్షలు వాయిదా పడనున్నట్టు అధికారులు తెలిపారు. జేన్టీయూ పరిధిలోని పరీక్షలు యథాతథంగా జరుగుతాయని అధికారులు చెప్తున్నారు. బీటెక్, ఫార్మసీ, సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారమే ప్రారంభమయ్యాయి. పరీక్షలు రాసే విద్యార్థులు తక్కువమంది కావడంతో షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని జేఎన్జీయూ మూల్యాంకన విభా గం డైరెక్టర్ కామాక్షి ప్రసాద్ తెలిపారు. మే, జూన్, జూలై మాసాల్లో కీలకమైన పరీక్షలు జరగనున్నాయి. మేలో ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగాల్సి ఉన్నాయి. వీటితోపాటు ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. అప్పటి పరిస్థితులను బట్టి పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. మరోవైపు, విద్యాసంస్థలన్నింటినీ బుధవారంనుంచి మూసివేస్తూ సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం జీవో విడుదలచేశారు. దీనికి అనుబంధంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన పాఠశాలల మూసివేతకు చర్యలు తీసుకోవాలని ఆర్జేడీలు, డీఈవోల ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
మూతబడనున్న విద్యాసంస్థలివే..
పాఠశాలలు 11,041
జూనియర్ కాలేజీలు 2,462
డిగ్రీ కాలేజీలు 955
ఇంజినీరింగ్ కాలేజీలు 188
బీ ఫార్మసీ కాలేజీలు 124
బీఈడీ కాలేజీలు 222
బీపీఈడీ కాలేజీలు 18
లా కళాశాలలు 21
ఎంసీఏ కళాశాలలు 37
ఎంబీఏ కళాశాలలు 289
పీజీ కాలేజీలు 525
ఎంటెక్ కాలేజీలు 89
ఎంఫార్మసీ కాలేజీలు 109
ఫార్మా -డీ కాలేజీలు 54
ఫార్మా -డీ (పీబీ) 25