హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా కార్యలాపాలు నిర్వహిస్తున్న పెన్నా సిమెంట్ రూ. 1,550 కోట్ల సమీకరణకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) జారీ చేయనున్నది. ఇందుకు సంబంధించిన పత్రాల్ని మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీకి కంపెనీ సమర్పించింది. ఐపీఓ ద్వారా రూ. 1,300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేయనుండగా, ప్రమోటర్లు రూ. 250 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తారు. ఐపీఓలో సమీకరించిన మొత్తంలో రూ. 550 కోట్లను రుణాల చెల్లింపునకు ఉపయోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో కంపెనీ తెలిపింది. రూ. 105 కోట్లు తమ కేపీలైన్ రెండోదశ ప్రాజెక్టుకు వ్యయంగానూ, రూ. 80 కోట్లు తలారిచెరువులో గల సిమెంటు ప్లాంటు, గ్రైడింగ్యూనిట్లను అప్గ్రేడ్ చేసేందుకు వినియోగించనున్నట్లు వివరించింది. తాండూరు, తలారిచెరువుల్లో వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్ల నిర్మాణాలకు రూ. 130 కోట్లు, రూ. 110 కోట్లు ఖర్చుచేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో నాలుగు సిమెంటు ఉత్పత్తి ప్లాంట్లు, రెండు గ్రైడింగ్ యూనిట్లు వున్నాయి. 2021 మార్చితో ముగిసిన సంవత్సరంలో పెన్నా సిమెంట్ రూ. 2,476 కోట్ల ఆదాయంపై రూ. 152 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఐపీఓ జారీకి కంపెనీ చేస్తున్న రెండో ప్రయత్నం ఇది. 2018 నవంబర్లో సెబికి ముసాయిదా పత్రాలు సమర్పించి, అనుమతులు పొందినప్పటికీ, కంపెనీ పబ్లిక్ ఆఫర్ను జారీచేయలేదు.