భారత స్వాతంత్య్ర అమృతోత్సవ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం- తొలి శంఖారావం అప్పుడే విన్పించింది. భారత స్వాతంత్య్రమహోద్యమానికి పదునుపెట్టిన సత్యాగ్రహ సమర శంఖారావాన్ని గాంధీజీ మొదట దక్షిణాఫ్రికాలో వినిపించారు.గాంధీజీ ‘సత్యాగ్రహం’ పదానికి, ఆ అభేద్య అస్ర్తానికి నూటా పదేండ్ల కిందట దక్షిణాఫ్రికాలోనే శ్రీకారం జరుపడం చరిత్రాత్మక విశేషం.
ఈ విశేషాల సంస్మరణ సముచిత రీతిలో ప్రత్యేక సంచికల ప్రచురణతో జరగాలన్న ఆలోచన వచ్చిం ది. అదే సందర్భాన, ఆరేడేండ్ల కిందట, నేను ‘సమరం నుంచి స్వాతంత్య్రానికి’ పుస్తకం రాసి ప్రచురించాను. ప్రత్యేక సంచికల ప్రచురణకు సహకారం అర్థిస్తూ అప్పటి జనగామ శాసనసభ్యుడు కాసాని నారాయణ ప్రోత్సాహంతో కొందరు పెద్దల వద్దకు వెళ్లాం. అప్పుడు చాలా కీలకమైన పదవిలో ఉన్న ఒక ఐఏఎస్ ఉన్నతాధికారి ‘సారీ, నాకు హైదరాబాద్ గురించి, హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం గురించి ఏమీ తెలియదు’ అన్నాడు. నేను, హైదరాబాద్ సాయుధ పోరాటంలో ఉరిశిక్ష పొందిన మాజీ కామ్రేడ్ నారాయణ ఆశ్చర్యపడ్డాం. ఆ రోజుల్లోనే మరో ఆశ్చర్యకరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. కొంతకాలం జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించిన అటల్ బిహారీ వాజపేయి (తర్వాత మూడు పర్యాయాలు ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం జరిపారు) భారత పార్లమెంట్లో ప్రసంగిస్తూ మన ఒక ఐఏఎస్ ఉన్నతాధికారికి స్వామి వివేకానందుని గురించి తెలియదని చెప్పి ఆశ్చర్యం కలిగించారు.
అనేక విజ్ఞాన శాస్ర్తాలు, విషయాలు అపార పరిశోధనలతో విస్తరించిన ఈ ఆధునిక యుగంలో ఎవరూ సర్వజ్ఞులు కాలేరు. సర్వజ్ఞత సాధించడానికి వినయపూర్వకంగా ప్రయత్నించినవారు, నిరంతరంగా శ్రమించినవారు కొందరు లేకపోలేదు. స్వాతంత్య్ర ఉద్యమ ప్రముఖ నాయకుడు, స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని (పదిహేడేండ్లు ఆయన ప్రధాని:1946-64) జవహర్లాల్ నెహ్రూ పదకొండు సంవత్సరాల జైలు జీవితంలో మూడు చారిత్రక ఉద్గ్రంథాలు రచించారు. గ్రంథాలయాలు, రిఫరెన్సు గ్రంథాలు ఏవీ అందుబాటులో లేకుండానే, మౌలానా అబుల్ కలావ్ు ఆజాద్, రంజన్ పండిట్ వంటి మహా మేధావుల, విజ్ఞాన ఖనుల పాండిత్య ప్రకర్ష మీద ఆధారపడుతూ ఆయన ఈ మూడు గ్రంథాలు రాసారు. ఈ మూడు ఉద్గ్రంథాలు నెహ్రూ సర్వజ్ఞతకు అక్షర ప్రతీకలు కావడం విశేషం. స్వాతంత్య్ర పోరాటాలతో పాటు అక్షర కృషికి కూడా అంకితమైన గాంధీజీ, విశ్వకవి రవీంధ్రనాథ్ టాగోర్, చక్రవర్తి రాజగోపాలచారి వంటి మహా మేధావుల సహకారం కూడా అప్పుడప్పుడు జవహర్లాల్ నెహ్రూకు కారాగారాలలో లభిస్తుండేది.
మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ రాజర్షిగా ప్రసిద్ధి పొందారు. మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త. ఆయన కూడా సారస్వత రంగంలో జవహర్లాల్ నెహ్రూ ఉన్నత స్థానాన్ని ఎప్పుడూ గుర్తించేవాడు. కేంద్ర సాహిత్య అకాడమీ స్థాపన జరిగినప్పుడు మొట్టమొదటి అధ్యక్షుడు జవహర్లాల్ అయితే బాగుంటుందని గట్టిగా చెప్పినవాడు సర్వేపల్లి రాధాకృష్ణ. తొమ్మిదవ ప్రధాని పీవీ నరసింహారావు ప్రపంచ ప్రఖ్యాత మేధావి, ఆర్థిక సంస్కర్త. భారత స్వాతంత్య్ర ఉద్యమ సారథి గాంధీజీ, ఆయనకు ప్రేరణ కల్గించిన వివేకానందస్వామి, విశ్వకవి రవీంద్రనాధ్ టాగోర్, స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులూది ప్రాణం పోసిన బాలగంగాధర తిలక్, గోపాల కృష్ణ గోఖలే, దాదాభాయి నౌరోజీ, సరోజనీనాయుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అరవింద ఘోష్, వల్లభ్భాయ్ పటేల్, అంబేద్కర్, మదన్మోహన్ మాలవీయ, ఉరిశిక్ష తప్పదని తెలిసిన తర్వాత గూడ జైలు డైరీ రాసి తన విశ్వాసాలను వివరించిన భగత్సింగ్ వంటి త్యాగధనులు తరతరాలకు స్మరణీయులు. 1757 నుంచి (అవిభక్త బెంగాల్ ఆక్రమణకు ప్లాసీ యుద్ధం నుంచి) 1946 నావికా తిరుగుబాటు సహా దాదాపు రెండు వందల సంవత్సరాల భారత స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది యోధులు స్వాతంత్య్ర పిపాసతో కావించిన త్యాగాలను స్మరించవలసిన సమయం ఇది. ప్రామాణిక స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను రూపొందించవలసిన తరుణం ఇది. స్వా తంత్య్ర ఉద్యమ చరిత్రను విస్మరించడానికి వీల్లేదు. ఇటీవల అస్సాంలో ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రాచీన అస్సాం చరిత్రలోని ఒక రాజును నిన్న మొన్నటి అస్సాం స్వాతంత్య్ర పోరాట యోధుడిగా ప్రస్తావించారట.
ప్రధాని మోదీజీకి ఒక సందర్భాన గాంధీ మహాత్ముని పూర్తి పేరు జ్ఞాపకం లేదట! రాళ్లు రప్పలు రత్నాలుగా కన్పిస్తున్న ఈ రోజుల్లో, జ్ఞాపక శక్తి క్రమంగా తరిగిపోతున్న ఈ కాలంలో సమాచార కోశాలు రూపొందడం చాలా అవసరం. డబ్బు ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో, ప్రజాస్వామ్య భారతదేశంలో, రాజ్యాంగబద్ధమైన మన వ్యవస్థలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నిర్వహించిన పాత్ర ఘనమైనది, గణనీయమైనది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఎంతో దోహదపడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యాధునిక తెలంగాణ నిర్మాణానికి చేతల్లో చూపిస్తున్న కృషి సర్వదా భావితరాలకు మార్గదర్శకమైనది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవ సందర్భాన తెలంగాణ ఉద్యమ పాత్రను కూడా స్మరించక తప్పదు.
దేవులపల్లి ప్రభాకర రావు