పదహారు నామాలు ఉన్నవాడు..ముప్పయ్రెండు రూపాలవాడు..అరవైనాలుగు కళల్లో ఆరితేరిన రేడు… వినాయకుడు.వికట రూపంతో అందరినీ అలరిస్తాడు.యోగ గణపతిగా సాధకుల తోడు నిలుస్తాడు.ఉచ్ఛిష్ట మూర్తిగా కష్టాలను హరిస్తాడు.సంకష్ట మూర్తిగా సంకటాలను దూరం చేస్తాడు. ఘంటం పట్టి భారతం రాసిందీ ఆయనే!ఉద్దండ రూపంతో దుష్టశక్తుల భరతం పట్టేదీ ఆతడే!!గిరితనయ గారాలపట్టిగా.. కరిరాజ ముఖునిగా.. తొలిపూజలు అందుకుంటున్న మహాగణపతిని మనసారా స్మరించుకుందాం. కొండంత దైవం గురించి గోరంత తెలుసుకుందాం.
ఓం గణానాంత్వా గణపతిం హవామహే కవింకవీనా ముపమశ్ర వస్తవమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనఃశృణ్వన్నూతిభిః సీదసాదనమ్
(రుగ్వేదం 2-23-1)
‘సమస్త కర్మలకు పాలకుడవైన ఓ గణాధిపతీ! నువ్వు విద్యాధరాది సమస్త దేవతా గణాలకు నాయకుడివి. త్రికాలజ్ఞుడవు, అమితాన్న దాతవు, సకల దేవతోత్తముడివి, మంత్రాధిపతివి. మేమందరం స్తోత్రపాఠాలు చేస్తూ నిన్ను ఆహ్వానిస్తున్నాం. మా స్తుతిని విని అన్ని విధాలా రక్షించు. మా యజ్ఞశాలలో, మా హృదయ పీఠికపై నిలిచి అనుగ్రహించు’ అంటుంది రుగ్వేదం. గణపతిని 33 కోట్ల దేవతలకు అధినాయకుడిగా వర్ణిస్తుంది వేదం. గణపతి సర్వశక్తి సంపన్నుడు అని కీర్తిస్తుంది. కొందరు గణపతిని యోగమూర్తిగా భావిస్తారు. మరికొందరు వేద గణపతిగా కొలుస్తారు. ప్రణవ నాద సంకేతంగా దర్శిస్తారు. ఎవరేరీతిన కొలిచినా తప్పక అనుగ్రహిస్తాడు వినాయకుడు.
శక్తి పుత్రుడైన గణపతి రూపం అత్యంత శక్తిమంతమైంది. ఆయన రూపాన్ని చూస్తున్నంత సేపూ.. మనలో ధనాత్మక శక్తి ఆవహిస్తుంది. ఓంకారం విన్నప్పుడు పొందే అనుభూతి, గణపతి స్వరూపాన్ని చూసినప్పుడు కలుగుతుంది అంటారు పెద్దలు. దీనికి నిదర్శనంగా విఘ్నేశ్వరుడి రూపం ప్రణవాక్షరంలో ఇమిడిపోతుంది. ప్రణవంలో గుండ్రంగా ఉండే కింది భాగం వినాయకుడి ఉదరాన్ని సూచిస్తుంది. కుడివైపునకు తిరిగి ఉండే కొమ్ము, దానిపై ఉన్న అరసున్నా గణేశుడి తొండానికి ప్రతీక. అర్ధ చంద్రాకారం, అందులోని బిందువులు ఫాలనేత్రానికి గుర్తులు. ప్రణవం మనసుకు ఏకాగ్రతనిస్తుంది. ఇది సాధకులకు ఎంతో అవసరం.
యోగసాధనంతా ఆధ్యాత్మిక విజయం కోసమే! ఆరోగ్యమనేది యోగా వల్ల కలిగే తాత్కాలిక ప్రయోజనం మాత్రమే. యోగ సాధకుల అంతిమ లక్ష్యం ముముక్షత్వమే కావాలి అంటుంది శాస్త్రం. అది సాధ్యం కావాలంటే మానవ శరీరంలోని షట్చక్రాలూ ఉత్తేజితం అవ్వాలి. అప్పుడే శిరస్సుపై ఉండే సహస్రారం ఉత్తేజితమై మోక్షానికి చేరువ అవుతారు. అయితే, ఏ క్రతువు చేసినా తొలిపూజ గణపతికే చెందుతుంది. అలాగే ఈ యోగసాధన సైతం గణపతి అధిష్టానంగా భావించే మూలాధార చక్రంతోనే మొదలవుతుందని యాజ్ఞవల్క్య స్మృతి చెబుతున్నది.
‘త్వం మూలాధారే స్థితోసి నిత్యమ్.. త్వం యోగినో ధ్యాయంతి నిత్యమ్’ అంటుంది గణపతి అథర్వశీర్షం. మానవ శరీరంలోని మూలాధార స్థానంలో ఉండే దైవానివి నీవే… యోగులందరూ ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారని భావం. యోగశాస్త్రంలో గణపతిని మూలాధార చక్రానికి అధిష్టాన దేవతగా భావిస్తారు. మూలాధారం ఉత్తేజితమైనప్పుడు అక్కడి నుంచి పైన ఉండే సుషుమ్న మేల్కొంటుంది. తద్వారా సాధన క్రమంలో మిగతా ఐదు చక్రాలూ ఉత్తేజితం అవుతాయి. సుషుమ్నకు ఇరుపక్కల ఉండే ఇడ, పింగళ నాడులు ప్రధానమైనవి. ‘ఇడ’ బుద్ధికి, ‘పింగళ’ సిద్ధికి సంకేతంగా భావిస్తారు. సుషుమ్న ఎప్పుడూ ఈ రెండు నాడులతోనే కలిసి ఉంటుంది. మూలాధారం గణపతి అయితే, ఇడ, పింగళ… సిద్ధి, బుద్ధి అన్నమాట. యోగసాధనతో శరీరం, మనసు పవిత్రం అయినప్పుడు బుద్ధి వికసిస్తుంది. ఫలితంగా సిద్ధి కలుగుతుంది.
జగద్గురువు ఆదిశంకరులు ప్రారంభించిన షణ్మతాల్లో (ఉపాసన క్రమాల్లో) గణపతి ఉపాసన ఒకటి. దానినే గాణాపత్యం అని పిలుస్తారు. ఈ విధానాన్ని అనుసరించే సాధకులు గణపతిని ప్రధాన దైవంగా భావించి పూజిస్తారు.
విఘ్నేశ్వరుడిని లింగ రూపంలో, సాలిగ్రామ, యంత్ర, కలశ, విగ్రహ రూపాల్లోనూ పూజిస్తారు. అలాగే గణాపత్యంలో ఆరు విధాలుగా స్వామిని పూజిస్తుంటారు. మహాగణపతి, హరిద్రా గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, స్వర్ణ గణపతి, నవనీత గణపతి, సంతాన గణపతి ఈ ఆరు విధాలైన వినాయకులను మంత్రోపదేశం చేసిన గురువు ఆజ్ఞను అనుసరించి ఉపాసిస్తారు. దక్షిణావనిలో తక్కువే కానీ, ఉత్తర భారతంలో గాణాపత్య ఉపాసన విశేష ప్రాచుర్యంలో ఉంది. మధ్యప్రదేశ్, బీహార్ రాష్ర్టాల్లో గణపతి ఉపాసకులు ఎక్కువగా కనిపిస్తుంటారు.
నిషు సీద గణపతే గణేషు త్వామాహుర్విప్ర తమంకవీనామ్
న రుతే త్వత్ క్రియతే కించనారే మహా మర్కంమఘవన్ చిత్ర మర్చ॥
(రుగ్వేదం 10-112-9)
‘హే! గణపతీ! నువ్వు అనేకానేక దేవతల సమూహంలో విరాజమానుడవై ఉన్నావు. విద్వజ్జనులు నిన్ను బుద్ధి శాలురందరిలో శ్రేష్ఠునిగా నిర్వచిస్తున్నారు. చిన్నదైనా, ఎంత పెద్దదైనా, సమీపంలోనిదైనా, ఎంతో దూరాన కష్టతరమైనదైనా నీ అనుగ్రహం లేక ఏ కార్యమునూ.. ఎవరూ జయప్రదంగా పూర్తి చేయలేరు. మేం చేసే సత్కార్యాలనీ నిర్విఘ్నంగా పరిపూర్ణం అయ్యేలా కరుణించు’ అని చెబుతుంది పైన పేర్కొన్న మంత్రం.
‘గణపత్యథర్వ శీర్షోపనిషత్’ గణేశ స్వామికి హృదయం లాంటిది. గణేశార్చనలో అనేక సందర్భాలలో దీనిని పఠిస్తుంటారు. సర్వఫలప్రదం. అనేక విభిన్న నామాలతో విఘ్నేశ్వరుడికి నమస్కారాలను ఇందులో పేర్కొన్నారు. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదీయ మైత్రాయణీ సంహిత, కణ్వ సంహితలలో ‘గణపతయే స్వాహా’ అని, ‘గణానాంత్వా..’ మంత్రం గణపతి నిమిత్తమై ఆహుతి ప్రక్రియ పేర్కొన్నారు. ఇలా మంత్ర స్వరూపుడైన వినాయకుడి ఆరాధనలో వివిధ వేద మంత్రాలు అనునిత్యం వినిపిస్తూ ఉంటాయి.
గంగవరం ఆంజనేయశర్మ
94404 62545