నగరం ఎటువైపు చూసినా కాంక్రీట్ జంగిల్లా కనిపిస్తోంది. నగరంలో నోరున్న జీవులమైన మనకు తాగునీరు ఎలాగోలా లభిస్తుంది. కాని, ఇది అసలే వేసవి కాలం.. ఈ కాలంలో నోరులేని జీవులైన పక్షులు, కుక్కలు, చిరుప్రాణులు మొదలైన వాటి సంగతేంటి? వాటి దాహార్తిని ఎవరు తీర్చాలి? ఈ గజిబిజి నగరంలో నోరులేని జీవాలను పట్టించుకునే సమయం ఎవరికైనా ఉంటుందా? వాటి గురించి ఆలోచించే సాహసం ఎవరైనా చేస్తారా? అనే ఆలోచన మానవత్వం గల మనుషులకు ప్రతి వంద మందిలో ఎవరో ఒకరికి.. ఎప్పుడో ఒకసారి ఆకాశంలో మెరుపులా వస్తుంది.. కాని, అది ఎక్కువ సేపు ఉండదు. అయితే, మణికొండ పరిధిలోని “అరుణాచల శివ సేవా సత్సంగ్ సేవా సమితి, అల్కాపూర్ టౌన్షిప్ కాలనీ ప్రతినిధుల”కు ఆ ఆలోచన వచ్చింది.. ఆ మూగ జీవాల దాహార్తిని తీర్చేందుకు అది కార్యరూపం దాల్చింది. ఆ కథేంటో చూద్దాం..!!
మణికొండ, ఏప్రిల్ 23: కాలం వేగంగా కదులుతోంది. ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి కాలం విపత్కర కాలం. గొంతులు ఎండే కాలం. నోరున్న జీవులతో పాటు నోరులేని జీవాలు కనుమరుగవుతున్నాయి. తాగునీరు లేక తహతహలాడుతూ ప్రాణాలను విడిచిపెడుతున్నాయి. ఈ క్రమంలో మణికొండ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ కాలనీవాసులు మూగజీవాల పక్షాన నిలుస్తూ, తమ సేవాతత్పరతను చాటుతున్నారు. మూగ జీవాలైన వీధి కుక్కలు, పిట్టలు, ఇతర జాతి పక్షుల దాహార్తి తీర్చేందుకు కాలనీ ప్రధాన రహదారుల వెంట, వీధుల్లో నీటి తొట్లను ఏర్పాటు చేసి అక్కడ నీటిని రోజు విడిచి రోజు పోస్తున్నారు. ఫలితంగా మూగ జీవాలు అక్కడకు వచ్చి తమ దాహార్తిని తీర్చుకుని ఉపశమనం పొందుతున్నాయి. అల్కాపూర్ టౌన్షిప్ పరిధిలోని రోడ్డు నంబరు 22, 29 తదితర ప్రాంతాలలో పలు అపార్టుమెంట్లల్లో నివాసముంటున్న ప్రజలు స్వచ్ఛందంగా తొట్లను ఏర్పాటు చేసి అక్కడ నీటి వసతులను ఏర్పాటు చేస్తున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. దీంతో ప్రజలు భోజనం కన్నా చల్లటి పానియాలనే అధికంగా సేవిస్తున్నారు. గంటకోసారి దాహం వేస్తే చల్లటి నీటిని సేవించి దాహం తీర్చుకుంటున్నాం. కాని, మూగ జీవాలు తాగునీటి కోసం పడే ఇబ్బందులను గుర్తించిన “అరుణాచల శివ సేవా సత్సంగ్ సేవా సమితి, కాలనీల ప్రతినిధులు” ఈ నిర్ణయం తీసుకుని ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.