శ్రీశైలం : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇల కైలాసాన్ని తలపిస్తున్నాయి. ఆరో రోజు మంగళవారం ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. భ్రామరి సమేతుడైన శ్రీశైలేశుడు సర్వాలంకరణ భూషితుడై పుష్పపల్లకిలో విహరించారు. ఉదయం ఆలయంలో చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు కార్యనిర్వాహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. సాయంకాలార్చనలు, హోమాల అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు.
అనంతరం ఎర్రబంతి, పచ్చబంతి, చామమంతి, కనకంబరాలు, డచ్ రోస్ అశోకపత్రాల మాలలు, నందివర్ధనం, గరుడ వర్ధనం, కాగడాలు, అస్సెర్ గ్రాస్, గ్లాడియేలస్ మొదలగు పుష్పాలతో అలంకరించిన పుష్పపల్లకిలో బ్రామరీ సమేత మల్లికార్జునుడు భక్తులను కనువిందు చేశారు. మంగళవాయిద్యాల నడుమ గంగాధర మండపం మొదలుకొని నందిమండపం వరకు.. నందిమండపం నుంచి క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రుడి ఆలయం వరకు పురవీధుల్లో ఊరేగించారు. గ్రామోత్సవంలో ఈఓ కేఎస్ రామారావు తో పాటు ఈఈ మురళీ బాలకృష్ణ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహ్మరెడ్డి, పౌరసంభందాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు కృష్ణారెడ్డి, మల్లయ్య, హరిదాస్, డీఈ నర్సింహారెడ్డి, సంపాదకుడు అనీల్ కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, సూపరింటెండెంట్ అయ్యన్న అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆలయంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. నిత్యకళారాధన, ఆలయ పుష్కరిణీ, శివదీక్ష శిబిరాల వద్ద కళాకారులతో భరతనాట్యం, భక్తరంజనీ, మృత్యుంజయ విజయం, శివమహిమ ప్రవచనం, సంప్రదాయ నృత్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ముందుగా జరిగే పాగాలంకరణ కోసం వడికిన పాగ ఇవాళ మల్లన్న సన్నిధికి చేరుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారు ప్రతిరోజు మూర చొప్పున నియమనిష్టలతో వడికి మల్లన్న కళ్యాణం నాటికి పాగ సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ఆలయ ప్రధాన గోపురాన్ని కలుపుకుంటూ నందీశ్వరులకు చుట్టే కమనీయ ఘట్టాన్ని పాగాలంకరణగా పిలుస్తారు.