భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తిశ్వరాలయంలో శ్రావణ శోభ నెలకొన్నది. శ్రావణ మాసం మొదటి రోజు కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
‘అభిషేక ప్రియః శివః’ అన్నారు పెద్దలు. నిండు మనసుతో నాలుగు చెంబుల నీళ్లు పోసినా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. శక్తి ఉన్నవాళ్లు నిత్యం సకృద్రుద్రాభిషేకం గానీ, అతి రుద్రాభిషేకం గానీ, మహా రుద్రాభిషేకంతో గానీ ఈశ్వరుడిని అభిషేకిస్తే మేలు కలుగుతుంది. శక్తి మేరకు దానధర్మాలు చేస్తూ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలి. అంతేకాదు, తనకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని గానీ, ఇష్టమైన వస్తువును గానీ దానమిచ్చి వదిలిపెట్టే సంప్రదాయమూ ఉంది. ఈ విధంగా నెలంతా శివారాధనలో గడిపితే ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని పొందుతారని స్కాంద పురాణం చెబుతున్నది. తమతమ కోరికలు తీర్చుకోవడానికి లక్షపూజా విధానాన్ని ఈ శ్రావణంలో ఆచరిస్తుంటారు.