శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు, పూష్పార్చనలు ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో శాస్రోక్తంగా జరిగాయి. శనివారం ఉభయ దేవాలయాలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేషార్చనలు, అభిషేకాలు నిర్వహించి పరివార దేవతామూర్తులకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం ప్రదోషకాల పౌర్ణమి గడియల్లో శ్రీ భ్రమరాంబ దేవికి లక్షకుంకుమార్చన మరియు ఊయల సేవను జరిపించారు. అమ్మవారి ఆలయ ప్రాకారమంతా ప్రత్యేక పుష్పాలంకరణతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. ఊయలలో ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు అర్చక వేదపండితులు షోడశోపచార క్రతువులు జరిపి లలితా సహస్త్రనామ పఠనంతో కుంకుమార్చన చేశారు.
లోకకళ్యాణార్థం ప్రతి పౌర్ణమి రోజున మాత్రమే అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన పూజావిధిలో భక్తులు కూడా పరోక్షసేవ ద్వారా పాల్గొనే అవకాశం కల్పించగా వివిధ ప్రాంతాల నుండి ఈ సేవలో భాగస్థులైన సేవాకర్తల గొత్రనామాలను అర్చకులు పఠించారు. దేశ విదేశాలలో ఉండే భక్తుల అభ్యర్థన మేరకు అమ్మవారికి జరిగే పౌర్ణమి ప్రదోషకాల పూజల్లో పరోక్షంగా పాల్గొనే అవకాశం కల్పించిన దేవస్థానం నిర్ణయానికి పలువురు దాతలు హర్షం వ్యక్తం చేసినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. పూజా కార్యక్రమంలో వేదపండితుడు గంటి రాధాకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు విజయ్కుమార్, మణిస్వామి, శాస్త్రి, ఫని, పవన్, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్కుమార్, ఏఈవో హరిదాసు పాల్గొన్నారు.