శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మల్లన్న ఆలయంలో శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి శాకంబరీ ఉత్సవం వైభవంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఏటా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవస్థాన
కార్యనిర్వాహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు.
శనివారం ఆషాఢ పౌర్ణమి రోజున సుమారు 4 వేల కేజీలకు పైగా 40 రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో అమ్మవారి గర్భాలయము, దేవాలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ముఖ్యంగా వంకాయ, బెండ, దొండ, కాకర, బీర, సొర, చిక్కుడు, గోరుచిక్కుడు, ముల్లంగి, కందదుంప, గుమ్మడి, బంగాళదుంప, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజి, క్యాలిఫ్లవర్, అరటి, నిమ్మ, టమాట, పచిమిర్చి, మునగ, పచ్చి బఠాని, దోస, కీరాదోసకాయలతో పాటు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, చుక్కకూర, తొటకూర, పాలకూర, చామకూర, పొన్నగంటి, మెంతి వంటి పలు రకాల ఆకు కూరలు, ఆపిల్, ఆరెంజ్, బత్తాయి, నారింజ, దానిమ్మ, మొక్కజొన్న, పనస, ద్రాక్ష, చెర్రీ, అలనేరేడు, బొప్పాయి, అరటి, పైనాపిల్ వంటి పండ్లతోపాటు నిమ్మకాయలు, బాదంకాయలతో మాలలుగా చేసి ప్రత్యేకంగా అలంకరించారు.
ఉత్సవంలో భాగంగా సప్తమాత్రికలకు, రాజరాజేశ్వరి అమ్మవారితో పాటు గ్రామ దేవత అంకాళమ్మకు కూడా ప్రత్యేక అలంకరణ చేసి పూజలు అభిషేకాలు చేస్తారు. శాకంభరీగా దర్శనమిచ్చే
అమ్మవారిని కొలవడంతో కరువు కాటకాలు నివారించబడుతాయని పురాణాలలో లిఖించినట్లు వేదపండితులు, అర్చకులు తెలిపారు. పౌర్ణమి రోజున ఉత్సవాన్ని ముగించుకుని మరుసటి రోజు
కూరగాయలను పండ్లను కదంబ ప్రసాదంగా భక్తులకు పంచడం ఆనవాయితీగా వస్తున్నది.