అహం క్రతురహం యజ్ఞః స్వధాహమ హమౌషధమ్
మంత్రో హమహమేవాజ్యం అహమగ్నిరహం హుతమ్
-భగవద్గీత (9.16)
‘నేనే క్రతువును. యజ్ఞాన్ని, పితరులకు ఒసగే ఆహుతిని, స్వస్థతను చేకూర్చే ఔషధాన్ని. దివ్యమంత్రాన్నీ నేనే. నేనే నెయ్యిని, అగ్నిని, ఆహుతిని’. ‘భగవద్గీత’లోని 9వ అధ్యాయంలోని ‘పరమ రహస్యజ్ఞానం’ ఇది. అందుకే, ఇది ‘రాజవిద్య రాజగుహ్య యోగం’గా ప్రసిద్ధి చెందింది. ఇందులోని విషయాలు విద్యలలోకెల్లా రాజు వంటివి, రహస్యాలలోకెల్లా పరమ రహస్యమైనటువంటివి. ‘స్వస్థతను చేకూర్చే ఔషధాన్ని తానేనని’ శ్రీకృష్ణభగవానుడు పై శ్లోకంలో స్పష్టం చేశాడు.
ఈ ప్రపంచంలో మనిషిని మూడు రకాల తాపాలు పీడిస్తుంటాయి. వాటినే ‘తాపత్రయాలు’ అని అంటారు. ‘తాపం’ అంటే మనలను తపింపజేసేది, ఉక్కిరిబిక్కిరి చేసేది. ఆ మూడింటిలో మొదటిది మనస్సు, శరీరం ద్వారా కలిగే తాపం. అదే ‘అధ్యాత్మిక తాపం’. ఇతర జీవులవల్ల కలిగే తాపం రెండవది. ఇది ‘అధిభౌతిక తాపం’. ఇతర మానవులు, జంతువులద్వారా కలిగే తాపాలు, కష్టాలు అన్నీ దీనికిందికే వస్తాయి. ఈ రెండు తాపాలు వ్యక్తిగతంగానే కలుగుతుంటాయి. మూడవది ‘అధిదైవిక తాపం’. ఇది ఒక్కసారిగా అధికసంఖ్యలో మానవులను చుట్టుముట్టి తపింపజేస్తుంది. ఉదాహరణకు అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, మహమ్మారి, ఉప్పెన వంటివి. గత కొన్నాళ్లుగా ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని పట్టి పీడిస్తూ, ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ‘కరోనా’ మహమ్మారి కూడా ఇలాంటిదే. దీనితో లక్షలు, కోట్లాది జనులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర తాపానికి గురవుతున్నారు. ఈ ‘అధిదైవిక తాపాని’కి అద్భుత ఔషధం ‘గీతా పారాయణం’.
‘భగవద్గీతను పారాయణ చేయడమంటే నేరుగా శ్రీకృష్ణుడిని పూజించడమే’ అని భగవద్గీతయే స్పష్టంచేసింది. కనుక, పైన పేర్కొన్న పరమ రహస్యమైన శ్లోకాన్ని 40 రోజులపాటు, ప్రతీ రోజు 108 పర్యాయాల చొప్పున చిత్తశుద్ధి, భక్తిశ్రద్ధలతో పారాయణ చేయండి. లేదా కనీసం రోజుకు 11 సార్లు అయినా రెండు పూటలా మనసులో చదువుకోండి. ఈ ‘గీతాపారాయణం’ ద్వారా శ్రీకృష్ణుని అర్చనా ఫలం లభిస్తుంది. శ్రద్ధాళువులందరు వ్యక్తిగతంగా లేదా సామూహికంగా ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా శ్రీకృష్ణ శరణాగతితో ఆ దేవదేవుని ఆశీర్వాదాన్ని పొందగలరు. దీనితోపాటుగా గీతాచార్యుడు పలికిన ఆరోగ్య సందేశాన్ని కూడా ఆచరణలో పెట్టండి.
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు
యుక్తస్వప్నా వబోధస్య యోగో భవతి దుఃఖహా॥
-భగవద్గీత (6.17)
ఆహారం, నిద్ర, పనుల అలవాట్లను క్రమపరచగలిగిన వాడు యోగసాధన ద్వారా సమస్త భౌతిక క్లేశాలను తగ్గించుకోగలుగుతాడు. యుక్తాహారం (సాత్త్విక శాఖాహారం) ద్వారా శారీరక స్వస్థత, విహారం ద్వారా మానసికోల్లాసం, యుక్తచేష్టలద్వారా బుద్ధి చురుకుదనం, తగినంత నిద్రద్వారా శారీరక శక్తి చక్కగా సమకూరుతాయి. అందుకే, పైన పేర్కొన్న మొదటి శ్లోకాన్ని పారాయణ చేస్తూ, రెండో శ్లోకాన్ని ఆచరణలో పెట్టండి. ఈ రకంగా ‘కరోనా మహమ్మారి’ అనే ‘అధిదైవిక తాపం’లోంచి అతిశీఘ్రంగా బయట పడగలుగుతాం, సుఖభాగులమవుతాం. శుభమస్తు, ఆరోగ్యమస్తు!
డాక్టర్ వైష్ణవాంఘ్రి
సేవక దాస్
98219 14642