సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది.. హాయ్ అంటూ పలకరించి.. అందంగా మాట్లాడి నిండా ముంచేస్తున్నారు.. ఇలా అమాయకులను బురిడీ కొట్టించేందుకు ఇప్పుడు సైబర్ దొంగలు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. మొదట వాట్సాప్ కాల్లో నగ్నంగా మాట్లాడి.. ఆ తర్వాత మరో వ్యక్తి లాగా బాధితుడికి ఫోన్చేసి.. ఫలానా యువతితో నగ్నంగా మాట్లాడావు అంటూ.. ఆ తర్వాత నగ్నంగా మాట్లాడిన యువతే.. ఆ నగ్న దృశ్యాలను చూపించి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు.. ఇలా ముగ్గురి పాత్ర పోషిస్తూ అమాయకులను బెదిరించి డబ్బులు వసూ లు చేస్తున్నారు. ఇందులో కొందరు డబ్బులు పోగొట్టుకోవడంతోపాటు పరువు పోతుందనే భయంతో మానసిక వేదనకు గురవుతున్నారు. మరికొందరు ధైర్యంచేసి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పలుకుబడి ఉన్నవారు ఉన్నతాధికారులకు ఫోన్లు చేయించుకుని వారి వీడియోలను సోషల్ మీడియా వేదిక నుంచి తొలిగించుకుంటున్నారు. ఇంకొందరు సున్నిత మనస్సులవారు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు.. ఇటీవల నిజామాబాద్లో ఇలాంటి సైబర్ జాదుగాళ్లకు చిక్కి ఓ వ్యక్తి ప్రాణం పోగొట్టుకున్నాడు.
హాయ్.. అంటూ గుర్తు తెలియని యువతి వాట్సాప్ కాల్లో పలకరిస్తుంది. ఆ తర్వాత మాటల మాయలో పడేస్తుంది. శృంగార భరితమైన మాటలతో రెచ్చగొడుతుంది. ముందుగా ఒక్కొక్క బట్టను తొలిగించుకుంటూ వివస్త్రను చేసుకుంటుంది. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడే వ్యక్తితో బట్టలను విప్పిస్తుంది. అలా.. 20 నిమిషాలు మాట్లాడుతుంది.
గుర్తు తెలియని వ్యక్తి బాధితుడికి ఫోన్ చేసి.. అమ్మాయితో నగ్నంగా వీడియోలో మాట్లాడినట్టున్నావ్ అన్నాడు.. బాధితుడు నీకేలా తెలుసు అనగానే.. నేను ఇప్పుడే సోషల్ మీడియాలో చూశానని చెప్పుతాడు. అంతే… బాధితుడి ఒంట్లో టెన్షన్ మొదలవుతుంది. వెంటనే.. ఆ గుర్తు తెలియని వ్యక్తిని సహాయం చేయమని అడుగుతాడు. నాకు డబ్బులు ఇస్తే చేస్తానని నమ్మించి.. లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తాడు.. లేదంటే ఇది వైరల్ అవుతుందని హెచ్చరిస్తాడు. బాధితుడి నుంచి లక్ష నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తాడు.
నగ్నంగా వీడియో కాల్లో మాట్లాడిన యువతి.. నేరుగా అప్పుడు మాట్లాడిన సమయంలో రికార్డు చేసిన దృశ్యాలను పంపిస్తుంది. వీటిని డిలీట్ చేయాలంటే డబ్బు కావాలని డిమాండ్ చేస్తుంది. ఇంకా.. కొందరైతే నీవు డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాతో పాటు ఫేస్బుక్ కాంటాక్ట్స్ ద్వారా మీ కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులకు పంపిస్తానని భయపెడుతుంది. చివరకు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుంది. అలాగే పోలీసు ఫిర్యాదు చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు.. ఇలా.. త్రిపాత్రాభినయాన్ని పోషిస్తున్న రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్తో పాటు ఉత్తరాది రాష్ర్టాల్లో ఉన్న సైబర్ ముఠాలు.. ఈ నేర ప్రక్రియకు పాల్పడి లక్షలు గుంజుతున్నారు. ఇక ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే వాటిని కట్ చేయాలని.. వారితో మాట్లాడొద్దని.. సైబర్ నేరగాళ్ల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసులుసూచిస్తున్నారు.