చాతుర్మాస కాలం ‘ఆషాఢశుక్ల (జూన్ లేదా జులై) ఏకాదశి (శయన) నుండి ప్రారంభమై కార్తీకశుక్ల (అక్టోబర్ లేదా నవంబర్) ఏకాదశి (ఉత్థాన) తిథివరకు కొనసాగుతుంది. చాంద్రమాన కాలగమనానికి చెందిన ఈ నాలుగు నెలలనే ‘చాతుర్మాసాలు’ అంటారు. ఈ నాలుగు మాసాలూ వర్షకాలం కావటం గమనార్హం.
యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనమ్
నాయం లోకో స్త్యయజ్ఞస్య కుతో న్యః కురుసత్తమ॥
‘ఓ కురువంశ శ్రేష్ఠుడా! ఏ విధమైన యజ్ఞం చేయనివారు ఈ లోకంలోగాని, పరలోకంలోగాని ఎలాంటి సుఖాన్నీ పొందజాలరు’. జీవితంలో ఉన్నతమైన సుఖసంతోషాలను, పురోగతిని సాధించేందుకు మానవులు కొన్ని సౌకర్యాలను త్యాగం చేయాలని ‘శ్రీమద్భగవద్గీత’ సూచిస్తున్నది. ఆధ్యాత్మిక పురోగతికి ప్రతి ఒక్కరికోసం వైదికశాస్ర్తాలు నిర్దేశిస్తున్న పలు పద్ధతుల్లో ‘చాతుర్మాస వ్రతాచరణ’ ఒకటి.
ఈ నాలుగు నెలల్లో తప్పకుండా ఆచరించాల్సిన కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలను శాస్త్రం తెలిపింది. ఈ కాలంలో విష్ణు మందిరాన్ని కనీసం నాలుగు సార్లయినా (నెలకొకసారి చొప్పున) ప్రదక్షిణ చేయాలి. అలా చేసిన వారికి సమస్త విశ్వానికి ప్రదక్షిణం ఆచరించిన పుణ్యం లభిస్తుందని ‘స్కాంద పురాణం’ వివరిస్తున్నది. అంతేకాదు, ‘ఈ ప్రదక్షిణలతో విశ్వంలోని సమస్త గంగానదీ తీర్థాలను సందర్శించినట్టేనని కూడా’ ఈ పురాణం స్పష్టం చేసింది. అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ‘చాతుర్మాస’ దీక్షను ఆచరించటం వల్ల విష్ణుమూర్తికి భక్తియుత సేవలు ఆచరించే స్థాయికి సాధకులు పురోగమించగలరని ‘భక్తి రసామృత సింధు’ వెల్లడిస్తున్నది.
శారీరక అవసరాలను తగ్గించుకోవటం వల్ల ఆదా చేసుకొన్న సమయాన్ని ఈ కింద వివరించిన అత్యంత ముఖ్యమైన యుగధర్మాన్ని ఆచరించేందుకు ఉపయోగించుకోవాలి. బృందావనంలోని మహాభాగవతులైన షడ్గోస్వాములలో ఒకరైన శ్రీల జీవగోస్వాములవారు ‘స్కాంద పురాణం’లోని ‘చాతుర్మాస్య మహాత్మ్యం’లో హరినామ సంకీర్తన ప్రాధాన్యాన్ని ఇలా తెలియజేశారు-
తథా చైవోత్తమమ్ లోకే తతః శ్రీహరి కీర్తనం
కలౌ యుగే విశేషేణ విష్ణుప్రీత్యే సమాచరేత్
‘ఈ లోకంలో ఆచరింపదగిన అత్యంత శ్రేష్ఠమైన వ్రతం శ్రీహరి నామ సంకీర్తనమే. ముఖ్యంగా, ప్రస్తుత కలియుగంలో ఆ దేవదేవుడైన శ్రీవిష్ణువును సంకీర్తనలతోనే సంతృప్తి పరచగలం. కనుక, ప్రతి ఒక్కరూ ఈ చాతుర్మాస నియమాలను ఆచరిస్తూనే పవిత్రమైన విష్ణునామాలను జపించాలి. అందుకు, అత్యంత సరళమైంది ‘హరే కృష్ణ’ మహామంత్రం.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
మనం చేసే ఈ జపం మనం వినగలిగేటంత మంద్రంగా వుండాలి. ప్రతి రోజూ కనీసం 108 సార్లు (ఒక్క మాల) జపించాలి. జీవన సాఫల్యాన్ని పొందేందుకు ఈ చాతుర్మాసంలో అందరూ ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు జపించాలని ఆచార్యులవారి నిర్దేశం. హరే కృష్ణ!
‘హరేకృష్ణ ఉద్యమ’ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు ఈ చాతుర్మాస వేళ ప్రతి ఒక్కరూ సులభంగా ఆచరింప దగిన నియమాలలో కొన్నిటిని వివరించారు. అవి:
‘చాతుర్మాస వ్రతాన్ని’ సమాజంలోని సకల వర్ణాశ్రమాల వారు తప్పక ఆచరించాలి. గృహస్థుడు, సన్న్యాసి అన్న భేదభావం లేదు.
నాలుగు మాసాలపాటు చేసే ఈ వ్రతాచరణలోని ముఖ్యోద్దేశం ‘ఇంద్రియ భోగప్రవృత్తిని తగ్గించుకోవటమే’. నిష్ఠాగరిష్ఠులకు ఇది అంత కష్టమేమీ కాదు.
శ్రావణంలో ఆకుకూరలు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వీయుజంలో పాలను సేవించకూడదు.
కార్తీకమాసంలో మాంసం, మాంసకృత్తులు సమృద్ధిగా వుండే మినుపపప్పు, మసూర్ దాల్ వంటివి భుజించరాదు.
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984