అన్ని లోకాలలో వ్యాపించి ఉన్నవాడు పరమాత్ముడే. అతడు సృష్టికర్త, పోషణకర్త, లయకారుడు కూడా. అందుకే, అతడు అన్ని లోకాలలో ఓతప్రోతమై ఉన్నాడని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ‘అణోరణీయాన్ మహతో మహీయాన్’ అన్న ‘కఠోపనిషత్తు’ వాక్యాన్ని అనుసరించి అణువుకంటే సూక్ష్మమైనవాడు. ఈ స్థూలప్రపంచాన్ని మించి ఉన్నవాడు పరమాత్మనే అన్నది స్పష్టం.
యస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షం ఓతం మనః సహప్రాణైశ్చ సర్వైః
‘ఎవనిలో ద్యులోకం, భూలోకం, అంతరిక్ష లోకం, ప్రాణికోటితో కూడి ఉన్నవో అతడే పరమాత్ముడు’ అని ‘ముండకోపనిషత్తు’ తెలుపుతున్నది. ఇంకా ఈ ఉపనిషత్తు ‘అమృత స్తైష సేతుః (2-2-5)’ అన్నది. సృష్టి స్థితి లయకారుడు, సర్వవ్యాపకుడు అయిన పరమాత్ముడే అమృతత్వానికి వారధి. ‘అమృతం’ అంటే ‘మోక్షమని’ స్థూలార్థం. దీనిని ఇచ్చేవాడు పరమాత్ముడేనని తెలుస్తున్నది.
‘మోక్షం’ అంటే దుఃఖాలనుంచి శాశ్వతంగా వైదొలగడం అని అర్థం. ‘ముక్తి’ అని దానికి పేరు. అయితే, ఇది జీవన్ముక్తులకే సాధ్యమవుతుందని, యోగులే జీవన్ముకులని ‘వేదాంత దర్శనం’ అభివర్ణిస్తుంది. ‘ముక్తోపసృప్య వ్యవపదేశాచ్చ (1-3-2)’. ఆత్మసాక్షాత్కారం లభించినవారే యోగులు, జీవన్ముక్తులని, అందుకుగాను సంపూర్ణంగా వారి హృదయగ్రంథులు విడివడి పోవాలని ఉపనిషత్తులు సూచిస్తున్నాయి. ‘భిద్యతే హృదయగ్రంథిః / ఛిద్యంతే సర్వసంశయాః’ (ముండక: 2-2-8). హృదయగ్రంథులు విడిపోతే అన్ని సంశయాలూ తొలగిపోతాయి. సంశయాలు లేనప్పుడే పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అందువల్ల, యోగి పాపపుణ్యాలనుండి విడిపోయి పరమాత్మతో సామ్యం పొందుతాడని కూడా ‘ముండకోపనిషత్తు’ చెబుతున్నది.
పరమాత్మ ఉన్నాడనే నమ్మకంతోపాటు అతడు సర్వవ్యాపకుడు అనికూడా తెలుసుకోవాలి. అలా పాపపుణ్యాలకు అతీతంగా వ్యవహరించినప్పుడే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. మరి, ‘అంతటా వున్న పరమాత్మ సాక్షాత్కారం ఎట్లా లభిస్తుంది?’ అన్న ప్రశ్నకు సమాధానం ‘కఠోపనిషత్తు’ ఇచ్చింది.
అంగుష్ఠ మాత్రః పురుషః అన్తరాత్మా
సదాజనానాం హృదయ సన్నివిష్టః ॥
-కఠోపనిషత్తు (6-17)
పరమాత్మ అంగుష్ఠ మాత్రుడు. అంటే, ‘బొటన వేలంత ఉంటాడని’ అర్థం కాదు. బొటన వేలంత వున్న హృదయాకాశంలో ఉంటాడని అర్థం. యోగులు అంతర్ముఖులై పరమాత్మను హృదయాకాశంలోనే దర్శిస్తారు. అంటే, ఎవడు అమృతానికి సేతువో అతణ్ణి మనం మన హృదయంలోనే దర్శించవచ్చునన్నమాట. మానవ శరీరానికి ‘బ్రహ్మపురి’ అని పేరు. ఇందులో చిన్న ‘హృదయ కమలం’ అనే గృహంలో ఉన్న సూక్ష్మమైన ఆకాశమే దహరాకాశం. దీనిని అన్వేషించగలిగిన ధీరులు యోగులే. అక్కడ పరమాత్మను దర్శించుకొంటేనే అతడు సంసార సాగరాన్ని దాటగలడు.
ఈ విశ్వమంతా ఒక పరమాత్మకే వశమై ఉన్నది. అతడు అన్ని ప్రాణులలో అంతరాత్మ రూపంలో ఉన్నాడు. సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతోకూడి ప్రళయకాలంలో ఒకటిగా, సూక్ష్మరూపంలో ఉన్న ప్రకృతిని అనేక రూపాలు కలిగిన దానిగా ఆ పరమాత్మనే చేస్తున్నాడు. అటువంటివాణ్ణి మానవులు తమ హృదయ కమలంలోనే తప్పక దర్శించాలి. అట్లా దర్శించిన ధీరులకే శాశ్వతమైన సుఖం (మోక్షం) లభిస్తుంది. ఎవరైనా తమలో కాకుండా ఇతరత్రా పరమాత్మను దర్శించడానికి ప్రయత్నించినట్లయితే వారికి మోక్షం లభించదని మమాచార్యుడు చెప్పిన మాటలు యథార్థమైనవి. సామాన్యులు శరీరానికి బయట పరమాత్మను దర్శించడానికి ప్రయత్నిస్తారు. కానీ, యోగులు ఆత్మసాక్షాత్కారానికి హృదయ కమలమే అనువైందిగా లెక్కిస్తారు, జీవన్ముక్తులవుతారు.
ఆచార్య
మసన చెన్నప్ప
98856 54381