శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నాల్గొవ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో బారులుదీరారు. నేటి ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుండి రుద్ర హోమం, చండి హోమం, శివపంచాక్షరి, జపానుస్టాన, రుద్రపారాయనలు శాస్త్రోక్తంగా చేపట్టారు. శ్రీశైల ఆది దంపతులకు కాణిపాకం స్వయంభువు శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఈవో కేఎస్ రామారావు చెప్పారు.
శ్రీశైల క్షేత్రానికి వచ్చిన భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం తమతమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళాలని ఈవో కేఎస్ రామారావు భక్తులను కోరారు. వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వస్తున్న భక్తులందరూ నిలిచిపోవడంతో రాత్రి వేళలో వసతి సదుపాయానికి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. అదే విధంగా ఆలయ పరిసరాల్లో వాహనాలు నిలిపివేస్తూ పాదచారులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు.