24న గురుపూర్ణిమ
ఆచార్యులందరికీ మూలవిరాట్టూ, ఆదిగురువూ అయిన వ్యాస భగవానుని పుట్టినరోజునే మనం ‘గురుపూర్ణిమ’గా జరుపుకొంటున్నాం.
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః
వ్యాసమహర్షి వైశిష్ట్యాన్ని, ఔన్నత్యాన్నీ తెలిపే శ్లోకమిది. ‘బ్రహ్మవిద్యలకు మూలమైన విష్ణుమూర్తి స్వరూపుడు, వసిష్ఠ మహర్షి మనవడైన వ్యాస మహర్షికి నమస్కరిస్తున్నాను’. ప్రతి రోజూ ఉదయాన్నే గురువులకు గురువైన వ్యాసునికి నమస్కరించాకే చదువుకోవడం మన సనాతన సంప్రదాయం. వ్యాస మహర్షి సంస్కృతంలో ‘మహాభారత భాగవతాల’ను రచించాడు. ‘అష్టాదశ మహాపురాణాల’ను మనకందించాడు. ‘బ్రహ్మసూత్రాల’ను బోధించాడు. శ్రీకృష్ణుని బోధామృతమైన ‘శ్రీమద్భగవద్గీత’ ద్వారా మానవాళి కోసం ‘కర్మ-జ్ఞాన-భక్తి మార్గాల’ను పటిష్ఠం చేశాడు.
మానవునిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే గురుపరంపరను, గురుపీఠాన్ని, గురువునూ వేదవ్యాసునిపైన ఉన్న గౌరవంతో సృష్టి స్థితి లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా మన సనాతన ధర్మం పేర్కొన్నది. భారతీయ ఐతిహాసిక సాహిత్యంలో మొదటిది రామాయణమైతే, రెండవది మహాభారతం. మానవ జీవితమంతా అవరించి ఉండేవి ‘ధర్మ-అర్థ-కామాలు’. ఈ మూడింటి ద్వారానే అంతిమంగా సంక్రమించేది మోక్షం. ‘ఈ నాల్గింటికి అనుబంధంగా ఉండే సంఘటనలు ఏవైతే ఈ ‘మహాభారతం’లో ఉంటాయో అవే ఈ సృష్టిలో జరుగుతుంటాయి. ఇందులో ఏవైతే ఉండవో అవి ఇంకెక్కడా ఉండవు’ (మహాభారతం, ఆదిపర్వం: 62-53) అని గ్రంథ ప్రారంభంలోనే నిక్కచ్చిగా చాటిచెప్పిన విశ్వశాసనుడు వ్యాస మహర్షి. మునీనా మప్యహం వ్యాసః (భగవద్గీత-10-37). ‘ముని శ్రేష్ఠుడైన వ్యాసుణ్ని నేనే’ అన్నాడు గీతాచార్యుడు.
సప్తచిరంజీవులలో ఒకరైన ఈ మహర్షి అసలు పేరు ‘కృష్ణద్వైపాయనుడు’. ఇతడు దాశరాజు పెంపుడు కూతురైన సత్యవతికి- పరాశర మహర్షివల్ల కలిగిన సంతానం. కృష్ణద్వీపంలో పుట్టడం వల్ల ‘కృష్ణద్వైపాయనుడు’ అనే పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు ప్రసాదించిన వేదాలు మొదట్లో ఏక (ఒకే) రూపంగా ఉండేవి. వాటిని ‘ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు’ (నాలుగు)గా విభజించాడు. కనుకనే, ఈ ఋషిశ్రేష్ఠునికి ‘వేదవ్యాసుడు’ అనే పేరు వచ్చింది. వ్యాస భగవానుడంటే నాలుగు ముఖాలు కాకుండా ఒకే ముఖం ఉన్న బ్రహ్మదేవుడు. నాలుగు చేతులకు బదులుగా రెండే చేతులు ధరించిన విష్ణుమూర్తి. నొసటిపైన మూడవ కన్ను లేని శంకరుడు. బాదరాయణుడైన ఈ వ్యాసమహర్షి ‘త్రిమూర్త్యాత్మకుడు’. అంటే, ‘బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుల స్వరూపమైన భగవంతుడే’ అని శ్రీ యోగానంద సరస్వతీ స్వామి తన ‘శ్రీవేదవ్యాస అష్టోత్తర శతనామ స్తోత్రం’లో ప్రస్తుతించాడు.
డా॥ శాస్త్రుల రఘుపతి
73867 58370