శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ బుధవారం ప్రత్యేక పూజలు జరిపించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. బుధవారం ఉదయం సాక్షి గణపతి స్వామివారికి అభిషేకాలు పుష్పార్చనలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని జ్వాలావీరభద్రస్వామివారికి షోడశోపచార క్రతువులు శాస్ర్తోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం మూలా నక్షత్రం సందర్బంగా శ్రీభ్రమరాంబదేవి అమ్మవారికి పూజలు నిర్వహించి ఊయల సేవలో ఆదిదంపతులను అధిష్టింపజేసి భక్తులకు దర్శనాలు కల్పించారు. కోవిడ్ ఛాయలు పూర్తిగా తొలిగిపోయేలా అర్చక వేదపండితులు మహా సంకల్పాన్ని పఠించారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవలలో పాల్గొనేందుకు బారులుదీరారు. ప్రధానంగా ఒకటిన్నర సంవత్సర కాలం తరువాత స్వామివారి గర్బాలయ స్పర్శ దర్శనాలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. ప్రత్యక్ష ఆర్జిత సేవలైన సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలలో పాల్గొనే సేవాకర్తలు సాంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అధికారులు సూచించారు.