‘సురవర వర్షిణి దుర్ధర ధర్షిణి
దుర్ముఖ మర్షిణి హర్షరతే
త్రిభువన పోషిణి శంకర తోషిణి
కల్మష మోషిణి ఘోరరతే
దనుజ నిరోషిణి దితిసుత రోషిణి దుర్మద శోషిణి సింధుసుతే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే.’
ఈ భూమిపై వచ్చే వేర్వేరు విపత్తులకు ఎన్నో సూక్ష్మజీవులు కారణమవుతున్నాయి. దైవం కనిపించకుండా ఎలా కాపాడుతున్నాడో, కొన్ని సూక్ష్మజీవులూ కనిపించకుండా పలు వినాశనాలకు పాల్పడుతున్నాయి. ఈ ప్రకృతిలో రాక్షసశక్తి పెరుగుతున్నప్పుడు దైవశక్తిని ఆవాహన చేయాల్సిన అవసరం ఉంటుంది. అది వ్యతిరేక శక్తులను అధిగమించడం అవసరం. రక్షణలు తీసుకోవడమంటే ఇదే. శరన్నవరాత్రులలో మొదటిరోజు బాలా త్రిపుర సుందరినుండి 10వ రోజు రాజరాజేశ్వరీ అమ్మవారి ఆరాధన వరకూ మనం ప్రకృతి శక్తులను ఆరాధిస్తాం. సూర్యకిరణాలను గమనిస్తే, ఉదయించే సూర్యుడు బాలాకిరణమైతే, నిట్టనిలువుగా నడినెత్తిమీద పడే సూర్యకిరణం రాజరాజేశ్వరి అవుతుంది. ఇవి ప్రకృతిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రకృతి శ్రీమాత అయితే, మనకు ఆశ్రయమిచ్చింది భూమాత. సూర్యుడిని విష్ణువుగా భావించినపుడు ఆయనకు భార్యలుగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను నిర్ణయించడంలోని ఆంతర్యం ఇదే. మహిషాసుర మర్దిని నవరాత్రులలో తొమ్మిదవ రోజు పూజలందుకుంటుంది.
ప్రస్తుత సూక్ష్మక్రిమి (కరోనా)కి కొమ్ములున్నట్లే అప్పట్లో కొన్ని సూక్ష్మజీవులకూ కొమ్ములుండేవి. వాటినే మన పురాణాదులు ‘మహిషములు’ (దున్నపోతు కొమ్ములున్న జీవి)గా గుర్తించి, వాటిని అధిగమించే శక్తిగా అమ్మవారిని ఆరాధించారు. అంతేకాక, ‘చండీ సప్తశతి’లో ధూమ్రలోచన, రక్తబీజ, శుంభ నిశుంభ, చండ, ముండ మొదలైన రాక్షసులందరూ ఇటువంటి సూక్ష్మజీవుల ప్రతీకలే. పొగకళ్ళు కలిగిన జీవి ధూమ్రలోచనుడు. భూమిమీదకు చేరిన వెంటనే విస్తరించే జీవి రక్తబీజుడు. ఇలా అన్ని సూక్ష్మజీవులను మహిషాసుర మర్దిని నాశనం చేయగలదు. ఇందుకు ఆమె స్తోత్రాన్ని పారాయణం చేయడమే శరణ్యం. ఆమెను ఆహ్వానించడానికి ‘ఓం హ్రీం మహా మహిషాసుర మర్దిని స్వాహా’ అనే మంత్రాన్ని ఎవరికి వాళ్లు తమ శక్తిమేరకు చదువుకోవాలి.
సాగి ,కమలాకరశర్మ