శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ మంగళవారం పరివార దేవుళ్లకు ప్రత్యేక పూజాధికాలను నిర్వహించినట్లు ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న కుమారస్వామికి ఉదయం షోడషోపచార పూజాది క్రతువులు చేశారు. అదే విధంగా బయలు వీరభద్రునికి సాయంకాలం ప్రదోషకాల పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. ఆరుబయట ఆలయంలో క్షేత్రపాలకుడిగా భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చనానంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు.
అనంతరం సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహించారు. కోవిడ్ ప్రభావం పూర్తిగా తొలిగిపోవాలని.. సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉంగడాలని వేదపండితులు, అర్చకులు మహా సంకల్పాన్ని పఠించి అభిషేకానంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింపజేసి పంచసూక్తం, వృషభసూక్తం పఠించారు. నూతన వస్ర్తాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు.