నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు తప్పనిసరిగా కడుక్కోవాలా? అలాగే దేవాలయంలో ప్రధాన దైవం, ఇతర ఉపాలయాలు దర్శించుకున్న తర్వాతే చివరగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలని చెబుతారు ఎందుకు?
నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లు కడుక్కోవాలని ఏ ధర్మ శాస్త్రమూ చెప్పలేదు. అదొక మూఢ నమ్మకం మాత్రమే. మామూలుగా గ్రహ పీడా నివారణ కోసం చేసేదే నవగ్రహ ఆరాధన. పీడను వదిలించుకోవడానికే ప్రదక్షిణలు. విధి విధానంగా చేసే ఆ ఆరాధన వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్మకం.
“ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః”
ఈ స్తోత్రాన్ని గానీ, నవగ్రహ స్తోత్రాలను గానీ పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. దేవాలయానికి వెళ్లిరావడం వల్ల పొందే పవిత్రతను నిలుపుకొనే ప్రయత్నం చేయాలి. దైవ దర్శనం చేసుకొన్న తర్వాత కాళ్లు కడుక్కోకూడదు.
ఆలయానికి వెళ్లినప్పుడు ముందుగా అక్కడి ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాతే ఉపాలయాలలో ఉండే దేవతలనూ, అనంతరం నవగ్రహాలను దర్శించుకోవాలి. ఆలయంలో సుప్రతిష్ఠితమైన ప్రధాన దైవాన్నీ, ఉపాలయాలలో ఉండే దేవతలనూ అనుగ్రహం కోసం వేడుకోవాలి. తర్వాత దోష పరిహారం కోసం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అయితే, గ్రహపీడా శాంతి కోసం మాత్రమే గుడికి వెళ్తున్నట్లయితే ముందుగా నవగ్రహాలను దర్శించుకోవచ్చు. లేని పక్షంలో ఆలయ ప్రధాన దైవాన్ని దర్శించుకున్న తర్వాతే మిగతావి.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370