పురుష దేవుళ్లు స్త్రీరూపం దాల్చినట్టుగా పురాణ కథల్లో కనిపిస్తుంది. వినాయకుడు కూడా స్త్రీశక్తిగా అవతరించాడని చెబుతారు. గజానని, వినాయకి, విఘ్నేశ్వరిగా ఆ మూర్తిని కొలుస్తారు. ఇందుకు నిదర్శనంగా తమిళనాడులోని పలు ఆలయాల కుడ్యాలపై స్త్రీమూర్తిగా ఉన్న గణపతి మూర్తులు దర్శనమిస్తాయి. ఆ రాష్ట్రంలోని సుచీంద్రం ఆలయంలో వినాయకి విగ్రహం చూడొచ్చు. పురాణాల్లోనూ వినాయకి ప్రస్తావన కనిపిస్తుంది. పరమేశ్వరుడు అంధకాసురుడిని వధించే సమయంలో ఆ అసురుడి రక్తబిందువులు దేవతలపై పడి, ఆయా పురుష దేవతల నుంచి స్త్రీ రూపాలు ఉద్భవించాయట. అలా వినాయకుడి నుంచి వినాయకి వచ్చిందని చెబుతారు. స్త్రీరూప వినాయకుడు 64 మంది యోగినులలో ఒకరని కూడా చెబుతారు.