కష్టానికి ప్రతిఫలం లక్ష్మి. సంతోషాలకు ఆధారం ఆ శ్రీదేవే! సంతృప్తికి మూలం ఆవిడే!! మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురు చూస్తుంటుంది. అష్టలక్ష్ముల చూపుతో.. అష్టదరిద్రాలూ తీరిపోతాయని తహతహలాడుతుంటా రు జనులు. ఆ తల్లి కరుణ అణువంత ప్రసరిస్తే చాలని ఆకాంక్షిస్తుంటారు. శ్రీహరి గుండెలపై కొలువై ఉన్న సంపదల సీమంతిని మన నడత సక్రమంగా ఉంటే తప్పక అనుగ్రహిస్తుంది.
లక్ష్మి అంటే ‘శుభలక్షణ లక్షిత’ అని అర్థం ఉంది. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా, గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనలోని శుభ లక్షణాల కలబోతే లక్ష్మి. ధైర్యం, వీర్యం, ఆరోగ్యం, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తుంటాం. పవిత్రంగా, ప్రశాంతంగా ఉండే ఇండ్లలో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవే ప్రకటించింది.
‘శుద్ధ (సిద్ధ)లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ
శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా॥’ అన్నారు పెద్దలు. శుద్ధలక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది. ఇంటినీ, తమ ఒంటినీ శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది. శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు, అంతర్ శుద్ధి కూడా. సర్వకాలాల్లో బాహ్యంగా, మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. బూజు కొట్టుకుపోయిన పైకప్పు, మురికి పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం నిలువదు. తిట్లు, శాపనార్థాలు, పరనింద చేసే మనుషులున్న ఇంటి వైపు కన్నెత్తి చూడదు. నిరంతరం శుభాన్ని కోరేవారు, శాంత స్వభావులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, పరులకు సాయం చేసేవారు, అతిథులను గౌరవించేవారు, కాలం వృథా చేయనివారు, కృతజ్ఞత చూపేవారు, సమర్థంగా పనిచేసేవారు.. ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పిందని పురాణ గాథ. శ్రమైక జీవన సౌందర్యమే లక్ష్మి. కష్టపడేవారిని సదా అనుగ్రహిస్తుందామె. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవడం కాదు. డబ్బు మాత్రమే కాదు.. జ్ఞానం, సంతృప్తి, ప్రశాంతత, ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే.
మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవికి ప్రతిరూపమే. ఆ తల్లిని ‘ప్రకృత్యై నమః’ అని స్తుతించారు. ప్రకృతిలోని ప్రతి సంపదా తనే. పాం చభౌతిక శక్తులైన భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశాలను సమన్వయపరిచి పుడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మి. పంటపొలాల్లోనే కాదు, పచ్చని చెట్లలోనూ ఆమె నివసిస్తుంది. ముఖ్యంగా బిల్వ వృక్షాలు లక్ష్మీ నివాసాలని శ్రీ సూక్తం చెబుతున్నది. చెట్లు నాటేవారిని ఆమె అనుగ్రహిస్తుందట. తొలి సంధ్య కిరణాల్లోని లక్ష్మీ శక్తి భూమిలో ఖనిజాలను సృష్టిస్తుందని వేదమంత్రాలు చెబుతున్నాయి.
వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషోజహి॥
లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే వర్షం కురుస్తుందని శాస్త్ర వచనం. ఆ వర్షం కారణంగానే నేల మీద విత్తనాలు మొలకెత్తి సమస్త జీవులకు ఆహారం అందుతున్నది. అంతేకాదు, ఆ తల్లి మనలో జ్ఞాన బీజాన్ని మొలకెత్తించి విజ్ఞాన ఐశ్వర్యాన్ని సిద్ధింపజేస్తుంది. లక్ష్మీ కటాక్షం సంతోషాలకు మూల కారణం. అయితే, ఆ ఆనందాల్లోనే తేలిపోతూ మనలోని సద్గుణాలను విడిచిపెట్టిన క్షణం నుంచి పతనం మొదలవుతుంది. శ్రీదేవి కరుణను తాత్కాలికమైన లౌకిక సుఖాలకు పరిమితం చేయడం అజ్ఞానమే అవుతుంది. ఆపదలు తీరి అన్నింటా సంతోషం కలిగినప్పుడు విచక్షణ కోల్పోకుండా, వివేచనతో మెలగాలి. జ్ఞాన తృష్ణను తీర్చుకుంటూ ధార్మికతవైపు పయనించాలి. కలిగిన దాంట్లో నలుగురికీ సాయం చేస్తూ పునీతులం కావాలి. అప్పుడే లక్ష్మీ అనుగ్రహానికి సార్థ కత ఏర్పడుతుంది. మోక్షానికి మార్గం సుగమం అవుతుంది.
–డాక్టర్ పార్నంది రామకృష్ణ
94920 07002