శ్రీశైలం : నవంబర్ 5వ తేదీ నుంచి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో కార్తీక మాసోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో వివిధ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఆలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులతో సన్నాహక నిర్వహించారు.
కొవిడ్ నిబంధనలు, భక్తుల వసతి, మంచినీటి సరఫరా, దర్శనం, స్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవలు, పారిశుధ్యం, పార్కింగ్, పర్వదినాల్లో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీక పౌర్ణమి రోజున జాల్వాతోరణం, నదీ హారతి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్తీకమాసం సందర్భంగా స్పర్శ దర్శనాలు నిలిపివేశారు. భక్తులకు కేవలం అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఈవో తెలిపారు. ఉదయం 3.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలకు భక్తులకు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిత్యం నాలుగు విడుతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నదానభవనంలో ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు వరకు అన్న ప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. కాంప్లెక్స్లో దర్శనం కోసం బారులు తీరిన భక్తులకు మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం అందించనున్నట్లు చెప్పారు.
కార్తీక మాసం సందర్భంగా అఖండ శివచతుస్సప్తాహ భజన కార్యక్రమ నిర్వహణ, నిరంతరంగా శివభజనలు, పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి, కార్తీక దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధి, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. పౌర్ణమి రోజున పాతాళగంగ వద్ద కృష్ణవేణి నదీ తల్లికి పుణ్యహారతి, గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం, ఆలయ నిత్య కళావేదికతో పాటు హారతి రోజుల్లో పుష్కరిణి వద్ద ప్రతి రోజు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు.