తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల (Tirumal) శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జ్యేష్ఠాభిషేకం కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా ఆలయంలో ఈ నెల 22 నుంచి 24 వరకు మూడురోజుల పాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తున్నారు. రెండో రోజైన నేడు మలయప్ప స్వామికి ముత్యపు కవచంతో అలంకరణ చేశారు. తర్వాత స్వామివారిని ఊరేగించనున్నారు.
తరతరాలుగా చేస్తున్న అభిషేకాలతో.. అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఏటా ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు. మొదటిరోజు మలయప్ప స్వామికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం వజ్రకవచం అలంకరించి మాడవీధుల్లో ఊరేగించారు. రెండోరోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగింపు నిర్వహిస్తారు. చివరిరోజైన రేపు తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగించనున్నారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే యేడాది జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో గురువారం వర్చువల్ ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయ సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘అభిద్యేయక అభిషేకం’ అని వ్యవహరిస్తారు.