జిల్లాలో పెండింగ్ దరఖాస్తులకు మోక్షం
మండలాల వారీగా వివరాల సేకరణ
15 రోజుల్లోగా పూర్తి కానున్న కార్డుల జారీ ప్రక్రియ
సీఎం కేసీఆర్ సహృదయతను కొనియాడుతున్న ప్రజానీకం
యాదాద్రి భువనగిరి, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో 2,13,807 రేషన్ కార్డులు ఉండగా.. వీటిలో ఆహార భద్రత కార్డులు 2,00,102, అంత్యోదయ కార్డులు 13,705 ఉన్నాయి. మొత్తం 6,65,357 యూనిట్లకుగాను నెలనెలా 4,251.083 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం 481 చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది. గత రెండేండ్లలో చాలామంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా.. వివిధ కారణాలతో ప్రభుత్వం కార్డులను మంజూ రు చేయలేదు. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు మోక్షం కల్పించి రేషన్ కార్డులను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వివిధ మండలాల నుంచి పెండింగ్ దరఖాస్తుల లెక్కలు తీసే పనిలో పౌరసరఫరాలశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
కొత్త రేషన్ కార్డులు 8,322
జిల్లా ఏర్పాటు నుంచి నేటి వరకు కొత్త రేషన్ కార్డుల కోసం 11,062 దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నవారు.. కొత్తగా పెండ్లి చేసుకున్నవారు.. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్, ముంబయి తదితర ప్రాంతాలకు వలసవెళ్లి సొంతూళ్లకు వచ్చిన వారు సైతం గత రెండేండ్లలో పెద్ద ఎత్తున కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు సందర్భంగా జారీ చేసిన 2,408 కార్డులు మినహా.. గడచిన రెండేండ్లలో వివిధ కారణాలతో కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టలేదు. ప్రస్తుతం ఆర్ఐ లాగిన్లో 4,416 దరఖాస్తులు, తహసీల్దార్ లాగిన్లో 763 దరఖాస్తులు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి లాగిన్లో 3,143 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి 15 రోజుల్లోనే క్లియరెన్స్ లభించి రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. 15 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తికానుండడంతో లాక్డౌన్లో పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత బియ్యం కొత్త రేషన్ కార్డుదారులకు సైతం అందనున్నది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం
కొత్త రేషన్ కార్డులు అందజేసేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లాలో 2,13,807 కార్డులకు రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నాం. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో ఈ సంఖ్య 2,22,129కి పెరగనున్నది. డీఎస్వో, తహసీల్దార్, ఆర్ఐల లాగిన్లలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తాం.
బ్రహ్మారావు, జిల్లా పౌరసరఫరాల అధికారి,
యాదాద్రి భువనగిరి జిల్లా