బృందావనమది అందరిదే! గోవిందుడు అందరివాడే!! కానీ, గోవిందునికి మాత్రమేచెందినవి కొన్ని ఉన్నాయి. ఏ జన్మ పుణ్యఫలమో గోపాలుని చెంత చింతలేకుండా కలకాలం ఉండిపోయాయి. వాటిని ఏదో భూషణాలుగా ధరించి ఊరుకోలేదు ఆ నందలాల. తన ఆశ్చర్య లీలలకు భాషణంగా ప్రకటించాడు. ఇష్టసఖికి ఇవ్వని అందలాన్ని నెమలి పింఛానికిచ్చి నెత్తిన పెట్టుకున్నాడు. మురళితో అష్టాక్షరిని పలికించాడు. పాంచజన్య శంఖారావంతో ధర్మ సంస్థాపనకు నాంది పలికాడు. దుష్టసంహారానికి సుదర్శనం ప్రయోగించాడు. వీటిలో దేని ప్రత్యేకత దానిదే! ఆ విశేషాలివి..
జోహారు శిఖి ‘పింఛ’ మౌళి
భగవానుడి సృష్టిలో ప్రతిదీ అద్భుతమే. వాటిలో అత్యద్భుతాలు కొన్ని. నెమలి ఆ కోవకే చెందుతుంది. కేకి కేకలు విసుగు తెప్పించినా.. అల్లంత దూరాన నెమలి కనిపిస్తే చాలు ఇట్టే చూస్తూ ఉండిపోతాం. కారుమబ్బులు కమ్మినప్పుడు పరవశంతో పురివిప్పి నర్తించే నెమలిని చూసి తన్మయులవుతాం. నీలి కంఠంతో, మేలి పింఛంతో వయ్యారాలు పోయే మయూరం అంటే గోపాలునికీ ఇష్టమే! అందుకే దాని పింఛానికి తన శిఖలో చోటిచ్చాడు. అంతేకాదు, సమస్త సృష్టిలో సంగమించకుండా రమించే ఏకైక ప్రాణి నెమలి. అమలిన శృంగారానికి ప్రతీకగా చెబుతారు. పదహారు వేలమంది గోపికల హృదయ సామ్రాజ్యాలను ఏలిన చక్రవర్తి అయిన కృష్ణుడూ అలాంటి వాడే! ఒకేసారి అందరి గృహాల్లో కనిపించినా, అందరితో ప్రణయసీమలో ఓలలాడినా కిట్టయ్యది అమలిన శృంగారమే! దీనికి ప్రతీకగానే నెమలి పింఛం ధరించాడని చెబుతారు.
వేణుగాన సమ్మోహనం
కుదురులేని గాలిని ఒడిసిపట్టి.. మధుర రాగాలను వినిపిస్తుంది మురళి. ఒళ్లంతా గాయాలు చేసుకున్న వెదురు.. ఎదురులేని కీర్తిని గడించింది నల్లనయ్య చేతుల్లోకి చేరాకే! నిరంతరం కన్నయ్యను అంటిపెట్టుకుని ఉన్న వేణువును చూసి గోపికలు ఈర్ష్యపడేవారట. ఓసారి కృష్ణుడు నిద్రించిన సమయంలో గోపికలంతా వేణువును సమీపించి ‘నీవంటే గోపాలునికి ఎందుకంత ప్రీతి?’ అని అడిగారట. అప్పుడు వేణువు ‘నన్ను తేరిపారా చూడండి. నా అంతరంగం అంతా శూన్యమే. నిష్కామంతో స్వామిని ఆశ్రయించాను. అందుకే ఆయన నన్ను అంతగా ఆదరించాడు’ అందట. మనసులో ఏ కోరిక, ఏ మలినమూ లేకుండా తనను ఆరాధించిన భక్తులకు భగవానుడు తన హృదయంలో చోటిస్తాడు అనడానికి మురళి అదృష్టమే ఉదాహరణ.
సు‘దర్శనం’
ప్రతిభట శ్రేణి భీషణ! వరగుణ స్తోమ భూషణ!!
జనిభయ స్థాన తారణ! జగదవస్థాన కారణ!!
నిఖిల దుష్కర్మ కర్షణ! నిగమ సద్ధర్మ దర్శన!!
జయ జయ శ్రీసుదర్శన! జయ జయ శ్రీసుదర్శన!!
అని సుదర్శన చక్రరాజాన్ని కీర్తించారు మునులు. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అవసరమైనప్పుడు తాను అవతరిస్తానని స్వయంగా కృష్ణుడే చెప్పాడు. మరి దుష్ట సంహారానికి ఆయుధం కావాలి కదా! అదే సుదర్శనం. చక్రి ఆనతి అందుకోవడమే తరువాయి సుదర్శనం అమలుచేస్తుంది. గిరిధరుడు ప్రయోగించిన మరుక్షణం గిరిగిర తిరుగుతూ, చురచుర నిప్పులు కక్కుతూ దుష్ట సంహారం చేసి తిరిగి స్వామిలో అంతర్ధానం అవుతుంది. సుదర్శనుని ధరించిన వాడు కాబట్టి చక్రి అయ్యాడు. స్వామిని నమ్ముకున్నవారికి సుదర్శనం అభయమిచ్చే నిదర్శనం.
పవిత్రం ‘పాంచజన్యం’
సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటారు బలరామకృష్ణులు. గురువు కోరిక మేరకు గురుపుత్రుడిని తీసుకువచ్చేందుకు బయల్దేరుతారు. ప్రభాస తీర్థంలో సముద్రంలో దాగి ఉన్న పంచజనుడు అనే రాక్షసుడు గురుపుత్రుడిని అపహరించాడని తెలుసుకుంటారు. సముద్ర గర్భంలోకి వెళ్లి పంచజనుడి పొట్టను చీల్చి సంహరిస్తాడు కృష్ణుడు. అప్పుడు ఆ రాక్షసుని పొట్టలో నుంచి శంఖం బయటపడుతుంది. దానిని జ్ఞాపికగా గ్రహిస్తాడు కృష్ణుడు. పంచజనుడి కడుపులో దొరికింది కాబట్టి దానికి పాంచజన్యం అని పేరు. నాటి నుంచి పాంచజన్యం కృష్ణుడి మృదుమధుర అధర స్పర్శను అనుభవిస్తూనే ఉంది. సమస్తలోకాలకు ప్రాణాధారుడి నుంచి ప్రాణవాయువు గ్రహించి విజయ నాదాన్ని వినిపిస్తూనే ఉంది.
డా॥ పార్నంది రామకృష్ణ
94920 07002