సంసార సుఖ సంప్రాప్తి సన్ముఖస్య విశేషతః
బహిర్ముఖస్య సతతం శ్రీకృష్ణశ్శరణం మమ.
‘శ్రీకృష్ణ’ శబ్దంలోనే ఆకర్షణ ఉంది. ‘కృష్ణ’ అంటే ‘నలుపు’ అని అర్థం. శూన్యప్రదేశమంతా నలుపులోనే కనిపిస్తుంది. వెలుగుకు వెనుక చీకటి ఉంటుంది. ఆకాశంలోనూ మనకు కృష్ణబిలాలు ఉంటాయి. అవి తీవ్ర ఆకర్షణతోకూడిన అతిశక్తి కేంద్రాలు. పోతన ‘భాగవతం’లోని ‘గజేంద్రమోక్షం’లో పేర్కొన్న ‘పెంజీకటి’కూడా కృష్ణమయమే. ఇటువంటి కృష్ణతత్త్వానికి ప్రతీక మన భాగవత శ్రీకృష్ణుడు. అందరినీ ఆకర్షింపజేసేవాడు, అందరి కష్టాలను తొలగించేవాడు, అందరి తలలో నాలుకలాంటివాడు. సాధువులకు, సాధకులకు మోక్షప్రదాత. ఎదిరించిన వానికికూడా జ్ఞానప్రదాత. అజ్ఞానంతో లోకాన్ని, తనను ఇబ్బందులకు గురిచేసేవారినీ ఆదుకొన్నవాడు. సాధుత్వ రక్షణ, దుష్టత్వ శిక్షణకు ఆవిర్భవించిందే ‘శ్రీకృష్ణావతారం’.
శరణు కోరడానికి కొన్ని నియమాలుంటాయి. ముందుగా భగవంతుడు మనకు ఇచ్చిన దానిని అంగీకరించాలి. ఈ రూపం, ధనం, స్థితి అన్నిటినీ! వాటిని నిర్వహించలేని పరిస్థితుల్లో నిర్వహణాశక్తిని ఇవ్వమని అడగాలి. తన శక్తి సరిపోవడం లేదని ఆర్తితో అడిగితేనే ‘అనుగ్రహ వర్షం’ కురుస్తుంది. ప్రభుత్వాదులకు మనం పెట్టుకునే ఆర్జీలాగా! ఆ ఆర్తి కేవలం పెదాలతో మాత్రమే కాదు, కృష్ణమయమైన మూలతత్త్వాన్ని తెలుసుకొని, దాని మహత్తును అంగీకరిస్తూ దానితో ఎక్కువసేపు కలిసి ఉండి, తన కోర్కెను చెప్పుకోవాలి. తన కర్మలద్వారా సంప్రాప్తమైన ఈ దేహాదుల స్థాయిని పెంచి, లోకధర్మ వ్యవహార నిర్వహణకు సహకరించమని అడగాలి. ఆ సమయంలో కుచేలులైనా కుబేరులు కాగలరు. అదీ అనుగ్రహ వర్షం! అది నిరంతరం మనపై కురిసి, అన్ని కష్టాలూ తొలగి, సకల జనాకర్షణ మనలోనూ పెరిగి, లోకానికి మనమూ ఉపకరించే శక్తిగా మారాలంటే ప్రతి రోజూ కనీసం రెండు గంటలపాటు ‘శ్రీకృష్ణశ్శరణం మమ’ మంత్రాన్ని జపించాలి.
సాగి కమలాకరశర్మ