‘మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్ యత్కృపా తమహం వందే పరమానంద మాధవమ్’ ఏ మహా మహిముని మహత్ కృప మూగవానిని వాచాలునిగా (మహావక్తగా), కుంటివానిని కొండలెక్కి దూకేవాని గాను మార్చివేస్తుందో, అట్టి పరమ ఆనంద స్వరూపుడైన మాధవస్వామికి వందన చందనాలు.
ధ్రువుడు భక్తితో సర్వశక్తిధరుని ఇలా స్తుతించాడు. ‘దేవా! నీవు అఖిలశక్తి సంపన్నుడవు. అనంత జీవుల స్వాంతా (హృదయా)లలో సదా సంచరించే వాడవు. మహానుభావా! స్తంభించిన నా వాక్కును, ప్రాణాలను, కరచరణ శ్రవణాది ఇంద్రియాలను నీ చిచ్ఛక్తిచే జాగృతం చేసిన జీవ జగదీశ్వరుడవు. పరమ పురుషుడవైన నీకు ప్రణామాలు’
ఇక్కడ మూగవాడనగా శాస్ర్తాభ్యాస రహితుడు. దృష్టాంతం ధ్రువుడు. పంగు అనగా పాదరహితుడు (కాళ్లులేనివాడు). దీనికి దృష్టాంతం గరుడ ఆళ్వారుల అగ్రజుడు (అన్నగారైన) ఆదిత్య (సూర్య) రథసారథి అనూరుడు.
మైత్రేయ ఉవాచ- విదురా! ధ్రువుడు తదేక చిత్తంతో తన ప్రాణవాయువును (స ఉ ప్రాణస్య ప్రాణః) సర్వప్రాణుల ప్రాణానికి ప్రాణమైన పరమేశ్వరునికి పణంగా పెట్టాడు. ఇలా శ్వాసను నిలపడం వలన ఈశు (విష్ణువు)నితోపాటు లోకాలన్నీ కంపించాయి. ఊపిరి సలపడం దుర్భరమై దిగీశులు (దిక్కులకు అధిపతులు) కూడా ఉక్కిరి బిక్కిరై దిక్కులేని వారయ్యారు. ఈ సందర్భమందు అమాత్యుడు పోతన ఒక అందమైన కంద పద్యాన్ని పొందుపరచాడు.
ఆలోకించడానికి (చూడడానికి) కూడా అలవికాని, ఆ లోకాలకు వాటిల్లిన అతి భీకరమైన ఆపద అనే దుర్దశను ఆలోకించి (చూచి) అష్ట దిక్పాలకులు మొదలుగా లోకపాలకులంతా (దేవతలంతా) లోకరక్షకుడైన లోహితాక్షుని-శోకనాశకుని ‘పాహి పాహి’ అంటూ ప్రపత్తి (శరణాగతి) చేశారు. ఈ కందంలోని అర్థంలో ఏ విశేషార్థం లేపోయినా వర్ణాల (అక్షరాల) కూర్పు వలన, ప్రధానంగా ప్రాస స్థానంలో ‘లోక’ పదం నాలుగు పాదాలలో పదేపదే రావడం వల్ల పద్యం పఠిస్తుంటే పాఠకుడు పొందే ‘నాద-బ్రహ్మ’ ఆనందం అభిజ్ఞులైన రసజ్ఞులకు అనుభవైక వేద్యం! పోతన అమాత్యుని కైతకు అబ్బిన ఈ అనన్య అసాధారణ ఖ్యాతికి ఏతమెత్తిన అనేక కారణాలలో ఈ అక్షర రమ్యతకు అగ్రతాంబూలం!
ఆపన్నులైన దేవతలు ఆదిదేవుని దర్శించి, అంజలి ఘటించి, సన్నుతి గావించి ఆర్తితో ఇలా విన్నవించుకున్నారు… ‘ఓ పన్నగశాయీ! మునుపెన్నడూ ఇట్టి ప్రాణ నిరోధం కన్నదీ లేదు విన్నదీ లేదు. ఆపన్న శరణ్యా! మమ్ము కాపాడు. విబుధుల విన్నపం విన్న మహావిష్ణువు ‘దేవతలారా! (‘విశ్వం విష్ణుః’) విశ్వరూపుడనైన నాయందు మనస్సును సంధాన (ఐక్య)పరచి నా భక్తుడు ధ్రువుడు చేస్తున్న తపస్సే దీనికి కారణం. వానిని తపస్సు నుంచి విరమింపజేస్తాను. వెరవు మాని మీ మీ విడుదులకు (గృహాలకు) వెళ్లండ’ని అమరులను ఆశ్వాసించి (ఓదార్చి) పంపించాడు.
వెనువెంటనే భక్త వత్సలుడు గోవిందుడు గరుడారూఢుడై భృత్య (దాస) దర్శనానికి ఉత్సహిస్తూ (ఉవ్విళ్లూరుతూ) మధువనానికి విచ్చేశాడు. అంతరంగంలో అంతర్యామి అంబుజాక్షుని అవలోకిస్తూ (దర్శిస్తూ) అంతర్ముఖుడై ఉన్న ధ్రువుడు బయట ఉన్న శంఖ చక్ర గదా పద్మధారిని, చతుర్భుజ దేవుని దర్శించలేకపోయాడు. ఇంతలోనే అతని మనస్సులో తనను ఇంతవరకు మరులు (ప్రేమానురాగాలు) గొల్పిన దివ్య మాధవమూర్తి మాయమైపోయింది. ధ్యానం చెదిరిపోగా ధ్రువుడు చప్పున కండ్లు తెరిచి తన ముందు కంజాక్షుని ఆ కమనీయ రూపమే కనువిందు చెయ్యడం కనుగొన్నాడు. తొట్రుపాటు కలిగింది. చెక్కిళ్లపై ఆనందాశ్రువులు జాలువారినాయి. తోయజాక్షుని తిలకించి పులకించాడు. నేత్ర పాత్రలతో స్వామి సౌందర్య సుధనుపానం చేస్తున్నట్లు, తన ముఖంతో ముకుందుని ముద్దాడుతున్నట్లు, తన కరము (చేతు)లతో కమలేశుని కౌగిలించుకున్నట్లు దివ్య అనుభూతి పొందుతూ స్వామికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. అంజలి ఘటించి అబ్జనాభుని, అనాది నిధనుని, ఆర్తత్రాణ పరాయణుని ప్రస్తుతించడానికి పూనుకున్నాడు. కానీ, స్తుతించే తీరు తెలియక తికమకపడ్డాడు. సర్వజీవ హృదయ కమలాలలో వసించే వాసుదేవుడు ధ్రువుని తలంపు, తడబాటు తెలుసుకొని వేదమయము, శ్రీదమూ (కళ్యాణ ప్రదము) అయిన శంఖంతో పసివాని పాలబుగ్గను ప్రేమతో స్పృశించాడు. ఆ ప్రభావంతో పిల్లవానిలో సుప్తమై (నిద్రించి) ఉన్న ప్రజ్ఞావాణి ప్రబుద్ధమయింది. పరమేశ్వరానుగ్రహంతో ప్రాప్తమైన అద్భుత వాగ్వైఖరులతో, శబ్ద ఝరులతో ద్వాదశ సూర్యులవలె ప్రకాశించే ద్వాదశ శ్లోకాలతో ధ్రువుడు భక్తితో సర్వశక్తిధరుని ఇలా స్తుతించాడు. ‘దేవా! నీవు అఖిలశక్తి సంపన్నుడవు. అనంత జీవుల స్వాంతా (హృదయా)లలో సదా సంచరించే వాడవు. మహానుభావా! స్తంభించిన నా వాక్కును, ప్రాణాలను, కరచరణ శ్రవణాది ఇంద్రియాలను నీ చిచ్ఛక్తిచే జాగృతం చేసిన జీవ జగదీశ్వరుడవు. పరమ పురుషుడవైన నీకు ప్రణామాలు’ మూల స్తోత్రంలోని ‘యోంతః ప్రవిశ్య మను వాచ మిమాం ప్రసుప్తాం..’ అనే మొదటి శ్లోకం గాయత్రీ మంత్ర సమాన మహాశక్తిమంతమైనది. బిందువులో సింధువు వలె ‘కేనోపనిషత్తు’ సారమంతా తనలో ఇమడ్చుకున్న సుశ్లోకమిది. అమాత్యుడు దీనిని గద్యరూపంలోనే అనువదించాడు.
(సశేషం)
క॥ ఆలోక భయంకరమగు
నా లోకమహా విపద్దశాలోకనులై
యా లోకపాలురందరు
నాలోక శరణ్యు గాన నరిగిరి భీతిన్
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006