Ganesh chaturthi | గణపతి తత్వం ప్రతి మనిషికీ ఆదర్శం కావాలి. వినాయక చవితి సందర్భంగా ఆయనకు చేసే ఆరాధనలో అంశాలన్నీ మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి, మన శక్తియుక్తులను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతాయి.
బంకమట్టితో గణపతి విగ్రహాన్ని తయారుచేయడం మంచిది. తొమ్మిది రోజులు ఉత్సవాలు నిర్వహించి నిమజ్జనం చేస్తాం. అప్పుడు మట్టి నుంచి వచ్చిన వినాయకుడు మట్టిలో కలిసిపోతాడు. ఈ మధ్య జరిగే గణపతి ఆరాధనలు మనల్ని ఎంతో కొంత మార్చకపోతే ఉత్సవాన్ని నిర్వహించిన ఫలితం ఏమీ ఉండదు! వినాయక నవరాత్రులు జరిగే తొమ్మిది రోజులు గణపతి తప్ప మరేదీ పట్టదు చాలామందికి. ఆయనకు ఇష్టమైనదే తింటారు. ఆయనకు నచ్చినవే చేస్తుంటారు. అనుక్షణం ఆయన గురించే ఆలోచన. కానీ, నిమజ్జనం ముగిసిన తర్వాత అంతా ముగిసిపోతుంది. మళ్లీ మామూలుగా కాలం గడిపేస్తుంటారు. వినాయకుడి రూపం, ఆయన గుణగణాల నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు.
గణపతి తెలివితేటలకు ప్రతీక. వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని రాసింది ఆయనే. భారతం రాయడానికి వ్యాసుడికి ఓ లేఖకుడి అవసరం ఏర్పడింది. గణేశుని కన్నా సమర్థుడైన లేఖకుడు ఆయనకు కనిపించలేదు. తాను చెప్తుంటే భారతం రాసి పెట్టాల్సిందిగా కోరాడు వ్యాసుడు. అయితే గణపతి ఓ పరీక్ష పెట్టాలనుకున్నాడు. ‘మహర్షి నిజంగా తన హృదయాంతరాల్లో నుంచి పెల్లుబుకేది చెబుతారా? పాండిత్య ప్రదర్శన చేస్తారా?’ అని తెలుసుకోవడానికి ‘మీరు ఆపకుండా చెప్తేనే రాస్తాను. ఎక్కడైనా ఆపితే నేను కలం పక్కన పెట్టేస్తాను, మళ్లీ ముట్టుకోను’ అని సవాలు చేశాడు గణపతి. అందుకు అంగీకరించిన వ్యాసమహర్షి భారతమంతా ఆపకుండా చెప్పాడు. గణేశుడు ఒక్క అక్షరం పొల్లు పోకుండా, ఆగకుండా రాశాడు. అంతటి మేధాసంపత్తి గణపతి సొంతం.
మనలో నిక్షిప్తమై ఉన్న తెలివితేటలను గుర్తించడం మన పనే. వాటిని సరిగ్గా ఉపయోగించగలిగితే ఈ ప్రపంచాన్ని కరిగించవచ్చు. నిమజ్జనం ద్వారా గణపతి విగ్రహాన్ని కరిగించేయడం దానికి ప్రతీక. మన ఊహతో ప్రపంచాన్ని కరిగించగలగాలి. శక్తిమంతమైన ఊహతో ఈ విశ్వాన్ని అనుభూతిలో లేకుండా చేయవచ్చు. ఊహలను ఎరుకతో పెంపొదిస్తే వాటిని ఆపేయడం కూడా సులభమే! అయితే సాధారణంగా ఊహలన్నీ తాత్కాలికంగా వచ్చిపోతుండటం వల్ల వాటిని నియంత్రించడం అసంభవం అనిపిస్తుంటుంది. కానీ, ఎరుకతో ఇదంతా చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి. గణేశ్ చతుర్థి సందర్భంగా ఊరూరా, వాడవాడలా గణపతి విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తారు. కానీ, సమయం రాగానే ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. మనిషి తన బుద్ధిని, ఊహలను కూడా ఇలా నియంత్రించగలగాలి. బుర్రలో ఎప్పుడూ ఏదో ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. వాటిని సరైన సమయంలో నియంత్రించడం చాలా అవసరం.
ఈ పండుగ సందర్భంగా ముఖ్యమైన విషయం ప్రాకృతికమైన పదార్థాలతో చేసిన గణేశుని ప్రతిమలనే ప్రతిష్ఠించాలి. మట్టి, కొన్నిరకాల పిండి, పసుపు ఇలా రకరకాల పదార్థాలతో వినాయకుడి విగ్రహాలు తయారుచేయవచ్చు. అంతేకానీ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో విగ్రహాన్ని తయారుచేయకూడదు. ఎందుకంటే అవి నీటిలో కరగవు. పైగా రసాయన రంగులు, ప్లాస్టిక్ నీటిని కలుషితం చేసి పర్యావరణానికి నష్టం చేస్తాయి. దేవుణ్ని స్వయంగా తయారుచేసుకొని, మనసారా ప్రతిష్ఠించి కొలుచుకునే అద్భుతమైన వెసులుబాటు కల్పించింది ఈ పండుగ. మరే ఇతర సంప్రదాయం ఇవ్వని గొప్ప విశేషాధికారం మనకు దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మట్టి, పిండి, పసుపు లాంటి నీటిలో కరిగిపోయే పదార్థాలతో గణేశుని ప్రతిమను తయారుచేయండి. రంగులు వాడాలనుకుంటే ప్రకృతి సిద్ధమైన రంగులనే వాడండి. అవి గణపతిని అందంగా తీర్చిదిద్దడంతోపాటు పర్యావరణానికీ ప్రయోజనం చేకూరుస్తాయి.
ప్రేమాశీస్సులతో ..
సద్గురు ఈషా ఫౌండేషన్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ganesh chaturthi | గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారు?
వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడొద్దు? దోష పరిహారం ఎలా చేసుకోవాలి?
ganesh chaturthi | కాణిపాకానికి ఆ పేరెలా వచ్చింది? స్థల పురాణమేంటి?
వినాయక చవితి రోజు మాత్రమే గణపతికి తులసిదళం ఎందుకు సమర్పించాలి?
Ganesh Chaturthi 2021 : గణపతి పూజ ఎలా చేయాలి? కావాల్సిన సామగ్రి ఏంటంటే..