‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణ లోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్..’
‘శ్రీరాముడి కీర్తనం ఎక్కడ వీనులవిందుగా వినిపిస్తుందో.. అక్కడ తలవంచి, జోడించిన చేతులు తలమీద ఉంచి, ఆనందబాష్పాలు చిందిస్తూ ఉండే, రాక్షసాంతకుడైన మారుతికి నమస్కరిస్తున్నాను’ అని దీని భావం. ఆంజనేయు డు రామనామ చింతనా స్వాంతుడు. రామ పాదారవింద సేవా భాగ్యవంతుడు. ఏ చిత్రపటంలో చూసినా రాముని పాదాల చెంత ముకుళిత కరకమలాలతో కూర్చొని దర్శనమిస్తూ ఉంటాడు.
ఆ మహాత్ముడు రక్తిని కోరలేదు. విరక్తినీ కోరలేదు. భక్తినీ కోరలేదు. ముక్తినీ కోరలేదు. నిరంతరం రామసేవలో తరించాడు. సేవ.. సేవ.. సేవ.. అంతే! ‘ఈ రోజు ఏం తిథి?’ అని హనుమను ఎవరో అడిగితే ‘తిథులు, వారాలు నాకు తెలియవు. రామనామం ఒక్కటే తెలుసు’ అన్నాడట. ఆ రామనామ స్మరణతోనే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. వానరులలో ఎవ్వరూ కనుక్కోలేని సీతామాత జాడను తెలుసుకొని లోకోత్తర కార్యాన్ని సాధించగలిగాడు. అదీ భగవత్ సేవ అంటే! అందుకే రామానుగ్రహం పొంది భవిష్యత్ విధాత అయ్యే అవకాశానికి నోచుకున్నాడు ఆంజనేయుడు.
పరాక్రమంలో హనుమకు సాటి వచ్చే వారు లేరు. ‘న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్’ అంటాడు హనుమ. అంటే వేయి మంది రావణులైనా తనకు ఎదురు నిలబడలేరని అర్థం. తాను ఎంతటి శక్తిమంతుడైనా, దానికంత టికీ కారణం రామనామ మహిమే అని తీర్మానించాడు. నిరంతరం రామనా మాన్ని చాటడమే హనుమ అభిమతం. అందుకోసమే యయాతికి ఆశ్రయమిచ్చి రామబాణం కన్నా రామనామమే గొప్పదని లోకానికి తెలియజేశాడు.
తానే దేవుడై ఉండి ఆంజనేయుడు ఒక సాధకుని అవతారం ఎత్తి, సాధకుడైన వాడు కార్యాన్ని ఎలా సాధించాలో, భక్తుడైనవాడు భగవంతుని సేవకు జీవితాన్ని ఎలా సంపూర్ణంగా, నిస్వార్థంగా సమర్పించాలో లోకానికి చాటిచెప్పా డు పవన సుతుడు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు గోవర్ధన గిరి ఎత్తాడు. త్రేతాయుగంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తాడు. ద్వాపరంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపాడు. ద్రౌపది కోరిక మేరకు సౌగంధి క పుష్పాన్ని తీసుకువచ్చే సందర్భంలో భీమసేనుడికి.. హనుమంతుడు కూడా విశ్వరూప సందర్శన భాగ్యాన్ని కల్పించాడు. తానెవరో తెలిపి, భీముడికి ధర్మోపదేశం చేసి.. కురు, పాండవ యుద్ధంలో అర్జునుడి రథ ధ్వజంపై ఉంటానని, పాండవుల విజయానికి సహకరిస్తానని వరం అనుగ్రహించాడు.
‘ఒకరకంగా త్రేతాయుగంలో దేవుడు హనుమంతుడే!’ అని కొందరు అభివర్ణి స్తారు. రామాయణంలో.. రాముణ్ని ఆదర్శ మానవుడిగా చిత్రీకరించిన వాల్మీకి ఆంజనేయుడిని మాత్రం కేవలం వానరునిగా చూపలేదు. సర్వశక్తిమంతుడిగా అభివర్ణించాడు. ఇంతటి బలవంతుడైన హనుమంతుడు ఎన్నడూ ‘అహం బ్రహ్మాస్మి’ (నేను దేవుణ్ని) అని గానీ, ‘రామోహం’ అని గానీ ఒక్కసారైనా అనలేదు. రుద్రాంశ సంభూతుడైనా ‘శివోహం’ అనీ అనలేదు. పైగా ‘దాసోహం కోసలేంద్రస్య’ (కోసలేంద్రుడైన రాముడికి నేను దాసుణ్ని) అన్నాడు. తాను దాసుణ్నని ప్రకటించుకున్నా.. హనుమ వైభవం తగ్గింది లేదు. బంగారానికి తావి అద్దినట్లు.. పవనసుతుడి పరాక్రమానికి, వినయం ఆభరణమైంది.
కానీ, ఆధునిక యుగంలో కొందరు ‘నేనే దేవుణ్ని’ అని బాహాటంగా ప్రకటించు కుంటున్నారు. ఆధ్యాత్మిక సాధకులు, కాషాయధారులు పలువురు తాము దైవాంశ సంభూతులమని ప్రకటించుకుంటూ, లోకాన్ని తప్పుదోవ పట్టిస్తుం డటం బాధాకరం. ఇలాంటి రోజు వస్తుందని ముందే ఊహించాడో ఏమో హనుమ ‘దాసోహం కోసలేంద్రస్య’ అని ప్రకటించుకున్నాడు. ఆంజనేయుడం తటి వాడే తాను రామదూతను అని పేర్కొంటే.. ఆయన అనుగ్రహం కోసం ఎదురుచూసే మనం హనుమ బంటులం అనుకోవడంలో ఉన్న సంతృప్తి, ‘అహం బ్రహ్మాస్మి’ అంటే కలుగుతుందా?!
డాక్టర్ వెలుదండ
సత్యనారాయణ