దూషణ భూషణాలు, నిందా స్తుతులు, తిరస్కార పురస్కారాలు- ఈ ద్వంద్వాలన్నీ దేహానికి సంబంధించినవే కాని ఆత్మకు అనుబంధాలు- సంబంధాలు కావు.
దేహం వేరు, ఆత్మ వేరు. దేహం ప్రకృతి అంశం, జడం. జీవాత్మ పరమాత్మ అంశం, చేతనం. ఈ రెండూ ఒక్కటే అనుకోవడమే అజ్ఞానం. ఈ ఆత్మ-అనాత్మల, పురుష- ప్రకృతుల స్వరూపం తెలియనప్పుడే నిందా-స్తుతులు వందల విధాల డెందాన్ని దూషితం చేస్తాయి. ‘దేహమే నేను’ అన్న దేహాత్మ బుద్ధి ఉన్న వ్యక్తినే ఇవి బాధిస్తాయి.
అమనస్కుడు, అద్వితీయుడు కాన జీవులకు వలె ఈశ్వరునికి ఈ అభిమానం ఉండదు.
మన దేహాన్ని దూషించే వారు మనకు దేహం మీది మోహాన్ని తొలగించి వైరాగ్యాన్ని బోధించే శిక్షకులు, సహాయకులు. మన ఆత్మను నిందించే వారు తమను తామే తూలనాడుకొనే (ఆత్మ నిందకులు) వారవుతున్నారు. ఎందుకని? ఉభయులలో ఉన్న ఆత్మ ఒకటే కనుక. లోకంలో తల్లిని మించిన దైవం లేదంటారు. కాని, దుష్టుడు- దూషణశీలుడు తల్లి కంటె ఘనుడు. పిల్లల మలాన్ని తల్లి చేతులతో కడిగి శుభ్రం చేస్తుంది. నిందకుడు మన పాపమనే మలాన్ని తన నాలుకతో నాకి మరీ నశింప జేస్తున్నాడు గదా!
దక్షుడు క్రియాదక్షుడు, కర్మిష్ఠి- కర్మలయందు ఆసక్తుడు. ఫాలాక్షుడు (ముక్కంటి) బ్రహ్మిష్ఠుడు- బ్రహ్మ నిష్ఠుడు, అవధూత. కర్మిష్ఠులకు అవధూతలంటే అసహ్యం- ఏవగింపు, అనాదరణ. దైవ దర్శనంలో దేహాభిమానం చాలా ప్రబలమైన ప్రతిబంధకం, అవరోధం- అడ్డంకి. దక్షుడు విరించి (బ్రహ్మ) విష్ణువులను కూడా విశ్వానికి ఈశ్వరునిగా అంగీకరించనివాడు. విరించిని తండ్రిగాను, విష్ణువును తాతగాను మాత్రమే తలచే వాడు.
మీనకేతనుని (శివుని) వలన సభలో తనకు మానభంగం జరిగిందని భావించాడు దక్షుడు. ఆవేశం ముదిరింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కంటికొనల నుండి మంటలు కక్కుతూ ముక్కంటిని చూపుతూ కోపం కుమ్మరించాడు. అందరి ముందు ఇందుశేఖరుని- శివుని, ముందు వెనుకలు చూడక ఇలా నిందించాడు-
‘సభికులారా! సర్వులూ సద్దు చేయక వినండి. నా మాటలు మోహం- అజ్ఞానంతోనో, మాత్సర్యం- అసూయతోనో పలికేవి కావు. ఈ కపర్ది (శివుడు) క్రియా శూన్యుడు. ఇతనివల్ల ఆచారం అడుగంటింది. సంప్రదాయం సన్నగిల్లింది. ధర్మమార్గం దుర్మార్గమయింది. ఉగ్రుడైన ఈ భర్గుడు (శంకరుడు) సిగ్గు- ఎగ్గు లేనివాడు. సావిత్రి లాంటి సాధ్వీమతల్లి, అన్నుల మిన్న అయిన నా కన్నకూతురు సతీదేవిని, మీన లోచనను, విశాలాక్షిని ఈ మర్కట నేత్రుడు- కోతి కన్నుల వాడు, ఈ విరూపాక్షుడు- ఎగుడు, దిగుడు కళ్లవాడు పెద్దల సమక్షంలో ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు. అల్లుడుగా నాకు అంతేవాసి-శిష్యుడయ్యాడు. అందుచేతనే అందలమెక్కి అందరిలో ఆఢ్యు (గొప్పవా) డయ్యాడు. నన్ను చూసి కూడా లేవకుండా కుదురుగా కూర్చున్నాడు. నాకు ఎదురు వచ్చి నమస్కరించకపోతే పోనీయండి, ‘పదుగురిలో’ పలకరిస్తే నోటి ముత్యాలు ఒలికి పోతాయా?
ఈ ప్రసంగంలో మహాకవి పోతన తన కాలంలో ప్రసిద్ధమై ప్రచలితంగా ఉన్న లోకోక్తి (సామెత)ని- ‘నోరి మాటకు దన కేమి గోరువోయె’ (వచనే కా దరిద్రతా)- ‘నోటి మాటకు కూడా దరిద్ర మొచ్చిందా?’- దక్షునిద్వారా సందర్భ శుద్ధిగా సంధించి అర్థపుష్టిని సాధించాడు. దక్షుని ‘శివనిందా’ పరములైన నాలుగు సంస్కృత శ్లోకాలను అమాత్యుడు ఒకే సీస పద్యంలో శ్రీధర స్వామి వ్యాఖ్యను సంభావిస్తూ అనింద్యంగా- నిందన వచనాలు వందన చందనాలై గుబాళించే విధంగా, అత్యద్భుతంగా ఆంధ్రీకరించాడు-‘ఈ వామదేవుడు వేద విహితమైన విధులు- కర్మలు, వదిలేసిన వాడు. ఈ మదన హరుడు మానహీనుడు. వీనికి మట్టు మర్యాదలు తెలియవు. మత్తులో మదించి మసలుతూ ఉంటాడు. పిచ్చివారికి ప్రియమైనవాడు. ఈ చిదంబరుడు దిగంబరుడు- దిసమొలవాడు. తమకు దశ-యోగం, కొద్దీ దొరికాడని భూత, ప్రేత, పిశాచాలు వీనిని నల్దిసలా పరివేష్టించి- చుట్టుముట్టి పూజిస్తుంటాయి. ఈ త్రిపురాంతకుడు తమోగుణ ప్రధానమైన ప్రమథగణాలకు ప్రభువు. ఈ అభవునికి చితాభస్మమే- ఒలుకుల బూడిదే అంగరాగం- ఒడలిపూత. అస్థిమాలికలు- పునుకుల పేరులే (ఎముకల దండలే) పలక సరులు. ఫణిహారాలే మణిహారాలు. ముండమాలలే (ప్రేతల పుఱ్రెలే) ముత్యాలసరాలు. ఈ మారవైరి (కామశత్రువు) మలిన మనస్కుడు. శుచి- శుభ్రత తెలియని ఈ పశుపతి మతిహీనులందరికీ గతి. అంగహీనులకు- వికలాంగులకు అధిపతి. శంకరుడు అతి భయంకరుడు. వీడికి వల్లకాడే (ని) వాసభూమి. వెంట్రుకలు విరబోసుకొని విహరిస్తూ ఉంటాడు. ఇంతటి అశివునికి-అపవిత్రుడు, అశుభునికి ‘శివుడు’- మంగళకరుడు, అనే అంతటి పవిత్రమైన పేరు ఎవరు పెట్టారు? శూద్రునికి వేదాన్ని ప్రదానం చేసినట్లు తెలిసి తెలిసి నా తండ్రి ప్రోద్బలంతో ఈ తమోగుణికి, ఈ అమంగళునికి నా సర్వమంగళను (సతీదేవిని) సమర్పించాను.’
ఈ విధంగా దక్షుడు నిటలాక్షుని (శివుని) నిందించి రోషావేశంతో- ‘ఈ శివుడు ఇంద్రుడు, ఉపేంద్రుడు (విష్ణుమూర్తి) మొదలైన దేవతలతోపాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండు గాక’ అని శర్వుని- శంకరుని శపించాడు-
ప్రజాపతి దక్షుడు ఇలా రెచ్చిపోయి పశుపతి- దక్షిణామూర్తి (శివుని అవతారం)ని దూషించి శపించినా ఆయన (శంకరుడు) మాత్రం దోషబుద్ధితో ఏ మాత్రం నొచ్చుకొనకుండా సంతోషంతో తన తన్మయత్వంలో- సమాధిలో తాను ఉన్నాడు. ‘శాంతం పద్మాసనస్థం’- శిరస్సుమీద జ్ఞాన-గంగను ధరించిన నీలకంధరుని (శివుని) ప్రశాంతతని ఈ రాగద్వేషాలు భంగ పరచలేవు కదా! ‘మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్తం’- దక్షిణామూర్తి అయిన దాక్షాయణీపతి మౌనభాషలోనే తన పరబ్రహ్మ స్వరూపాన్నీ, స్వభావాన్నీ బ్రహ్మవాదుల సత్రయజ్ఞ సభలో వ్యాఖ్యానించి వ్యక్తీకరించాడు- ‘మౌనేన కలహో నాస్తి!’
అభవుడు ఆత్మారాముడు కనుక ఆయనకు హితాహితాలు- మంచి చెడు రెండూ సమానమే. మేను (ఒంటి) మీద పారాడే పాపరేని (నాగేంద్రుని) విషమంటే భీతి లేదు. తల యందు కనువిందు చేస్తున్న ఇందు (చంద్ర) రేఖనుండి జాలువారే పీయూషం (అమృతం) పట్ల ప్రీతీ లేదు. కంఠంలో వ్రేలాడే కపాల మాల వలన ఆయనకు అంటుకొనే అశౌచం- అపవిత్రత లేదు- ‘నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ’. నెత్తిన నిత్యం నృత్యం చేస్తూ గంగ సుళ్లు తిరుగుతున్నా శౌచం- పవిత్రతా భావమూ లేదు. ఒంటినిండా చితాభస్మం పులుముకున్నా చింత- దుఃఖం లేదు. అహర్నిశం-రేయి పగలు, అంటి పెట్టుకొని ఉండే అంబికా స్తనాలింగనం వలన సుఖానుభవమూ లేదు. ‘స్వస్మిన్ తిష్ఠతీతి స్వస్థః’- ‘స్వస్థత’ తనలో తానుండుట (అంతర్ముఖత్వం) అనే ధనపతి అయిన నిధనపతి- కాలకాలుడు, మృత్యుంజయుడే సర్వప్రాణులను స్వస్థపరచి సంరక్షింప సమర్థుడు- దక్షుడు దక్షిణామూర్తే!
(సశేషం)
సీ. అనయంబు లుప్త క్రియా కలాపుడు
మాన హీనుడు మర్యాద లేనివాడు
మత్త ప్రచారు డున్మత్త ప్రియుడు దిగం
బరుడు భూతప్రేత పరివృతుండు
దామస ప్రమథ భూతములకు నాథుండు
భూతలిప్తుం డస్థి భూషణుండు
నష్ట శౌచుండు నున్మద నాథుడును దుష్ట
హృదయు డుగ్రుడును బరేత భూ ని
తే. కేతనుడు వితత స్రస్త కేశు డ శుచి
యయిన యితనికి శివనాముడను ప్రవాద
మెటులు గలిగె? నశివుడగు నితని నెఱిగి
యెఱిగి వేదంబు శూద్రున కిచ్చి నటులు.
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006