ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహమ్
విష్ణు సంబంధమైన అవతారాల్లో హిరణ్యకశిపుని నుండి ప్రహ్లాదుని రక్షించిన నరసింహస్వామి, గిరిజనులనుండి పురజనులవరకు అందరికీ ఆరాధ్యనీయ దైవం. మంత్రశాస్త్ర రీత్యాకూడా అన్ని మంత్రాలకన్నా నరసింహస్వామి మంత్రం చాలా విశిష్టమైంది, పూర్ణమైంది కూడా. నరసింహ స్వరూపాలు ఎన్నో ఉన్నాయి. తెలుగుప్రాంతాల్లో నరసింహ స్వామివారి ఆలయాలు అనేకం. చిన్నచిన్న గుట్టలపైనా స్వామివారి దేవాలయాలు కనిపిస్తాయి.
భూమిని రక్షించడానికి చుట్టూ ‘ఓజోన్ పొర’ ఉంటుంది. దీనిని వైదిక వాఙ్మయంలో ‘హిరణ్య ప్రాకారం’ అన్నారు. ఈ పొరను కలిగి ఉన్న శక్తియే ‘హిరణ్మయి’. ఈ పొరకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఇబ్బంది పడేది భూమి, దానిమీద ఉండే జీవరాశులు. దీనికి ఒకానొక సందర్భంలో ఏర్పడిన ఇబ్బందిని తెలియజేసే పురాణగాథలే వరాహ, నరసింహస్వామి ఆవిర్భావ గాథలు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు ఈ హిరణ్య ప్రాకారానికి ఇబ్బందులు పెట్టి ‘భూమి’ అనే ‘ప్రహ్లాదుని’ అతలాకుతలం చేసే ప్రయత్నం చేసినవారు. అయితే, భూమి అనే ప్రహ్లాదుడు మూలశక్తి అయిన సూర్యుని శక్తిని ఉపాసించడం ద్వారా రక్షణ పొంది, తనను ఇబ్బంది పెట్టిన రాక్షసులను శక్తి సహకారంతో పారద్రోలి తాను ప్రశాంతంగా ఉండగలిగాడు.
ఒక రకంగా సూర్యుడే నరసింహ స్వామి. నరసింహునిలోని ‘నరత్వం’ భూమి అయితే, ‘సింహత్వం’ సూర్యునిది. సింహం జూలు వంటివే సూర్యకిరణాలు. నరసింహస్వామి అష్టోత్తర నామాలు చదివితే ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. సూర్యతత్త్వం నరసింహ తత్త్వం సమానంగా ఉంటుంది. అందుకే, అనేక రూపాల్లో నరసింహస్వామి సూర్యప్రతీకగా కనిపిస్తాడు. జ్వాలా నరసింహ, యోగ నరసింహ, గండభేరుండ నరసింహ, వైద్య నరసింహ, లక్ష్మీ నారసింహ వంటి పేర్లన్నీ సూర్య సంబంధ అధ్యయనంలో తెలుస్తాయి. సూర్యకిరణాలు భూమిని చేరి, ఓజోన్ పొరను రక్షించే తత్త్వం నరసింహ తత్వం. వ్యతిరేకతలన్నింటినీ ఉక్కుపాదంతో, వజ్రనఖాలతో తొలగించే తత్వం అది. అటువంటి రక్షణ మనకూ ఏర్పడి, మన చుట్టూ ఉన్న అన్ని రకాల భయాలు, ఒత్తిడులు తగ్గాలంటే మనం రోజూ 1,108 సార్లు తప్పనిసరిగా ‘ఓం శ్రీం ప్రహ్లాద వరద నరసింహాయ నమః’ అనే జపం చేసుకోవాల్సిందే. ఇది లక్ష్మీప్రదం, రక్షణ కవచం.
సాగి కమలాకరశర్మ