చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే
చదివినవి గలవు పెక్కులు..
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!
‘భగవత్ సంకీర్తనం వల్ల ఏమొస్తుంది?’ అనుకుంటే, ఏమీ రాదు. సందేహంతోనే ఈ మాట మొదలైంది కదా. ‘సంశయాత్మా వినశ్యతి’ అన్నారు. అంటే, ‘సంశయాత్ము డెప్పుడూ చెడిపోతాడు’ అని అర్థం. ‘ఏమీ రాదు’ అని ముందే నిర్ణయించేసుకున్న వాళ్లకు ‘విశ్వాసం లేదన్న’ విషయమే తెలియదు. వారిలోని విషయం వారికే తెలియనప్పుడు భగవంతుని గురించి ఏం తెలుస్తుంది? ‘విశ్వాసం లేకపోతే’ దానిని పెంచుకోవాలి. అందుకు ‘నవవిధ భక్తిమార్గాలు’ ఉన్నాయి. ఒక మార్గంలో విసుగనిపిస్తే మరొక మార్గం అవలంబించవచ్చు. మరి, ‘భగవత్ సంకీర్తనం వల్ల రానిదేముంది?’ అనుకుంటే, ‘భగవంతుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు’. ఈ మాట లోకంలో ఉన్నదే. ‘మనకన్నీ దేవుడే ఎప్పటికప్పుడు ఇస్తున్నాడు’ అనుకుంటే, క్రమంగా అదే యథార్థమవుతుంది. ఇదీ లోకంలో ఉన్న ఏర్పాటు.
ఎలా అనుకుంటామన్నది మన ఇష్టం. భగవంతుని అభీష్టం కాదు. ‘భగవంతుడు ఇస్తాడు’ అనుకుంటే ‘దాన్ని నిజం చేస్తాడు’. ‘ఇవ్వడనుకుంటే’ దాన్నీ నిజం చేస్తాడు. దేవుడు దేన్ని నిజం చేయాలో నిర్ణయించుకోవలసింది నిజానికి మనమే. ఎవరికైనా ‘పూర్ణ విశ్వాసం’ లేనందువల్లే భక్తి ఫలవంతం కాకుండా నడుమనే నీరు కారిపోతుంటుంది. అం తేకాదు, అది అనేక అపోహలకూ ఆలవాలమవుతుంది. ‘మామిడికా య ఎప్పటికీ కాయగానే ఉంటే’ మాధుర్యాన్ని అనుభవించేదెలా?
డాక్టర్ వెలుదండ
సత్యనారాయణ
94411 62863