సంస్కారవంతుడైన ఒకానొక సాధకుడు ‘నేనే పరబ్రహ్మనవుతాను’ అని సంకల్పిస్తాడు. అంటే.. ముందుముందు ‘పరబ్రహ్మ’ అవుతానని కదా అర్థం. అలాగైతే ఇప్పుడా సాధకుడు ‘పరబ్రహ్మం’ కాదా! కానీ, ఈ సృష్టిలోని ప్రతి జీవుడూ ఎప్పుడూ పరబ్రహ్మమే! ఈ విషయాన్ని గుర్తించలేక ఆ సాధకుడు ‘నేను పరబ్రహ్మనవుతాను’ అని సంకల్పించుకొని, అందుకు నడుం బిగించాడు.
ఇక్కడ దేవుని మీద ఆధారపడ్డాడు అనుకోవడానికి అవకాశం లేదు. ఆధారపడ దగిన దేవుడు, ఆధారపడుతున్న జీవుడు- ఇద్దరున్నారు. ఇది ద్వైతం అవుతుంది.. కాబట్టి ‘ఏకమేవాద్వితీయం బ్రహ్మ’ అని విశ్వసిస్తున్న అతనికి ఇది నచ్చదు. మూడోది ‘ఆధారపడటం’ అనే పని కూడా ఉన్నది. అదెలా కుదురుతుంది? మరి దేని మీద ఆధారపడ్డాడనుకోవాలి? పురుషకారం మీద. ఆ సాధకుడు ప్రయాణం మొదలుపెట్టాడు. అహంకారం కాచుకు కూర్చుంది. ఎప్పుడో ఒకప్పుడు అతణ్ని పట్టుకుందామని. క్రమంగా ఒకదాని వెంబడి మరొకటి విజయాలు రాకుండా పోవు. ఎప్పుడో ఒకప్పుడు ఏమరుపాటు లేకుండా ఉండదు. అటువంటప్పుడు సమయం చూసి అది ఆ జీవుణ్ని గబుక్కున పట్టుకొని తీరుతుంది. అహంకారం పట్టుకుందన్న సంగతి కూడా అతడికి తెలియదు. తిరోగమనం మాత్రం మొదలవుతుంది. కానీ, ఆ సంగతి ఎంతో కాలానికి గానీ తెలిసిరాదు సాధకునికి. ‘ఇలా జరిగిందేమిటి? తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందే’ అనుకొని కంగుతింటాడు. ఇక్కడ ఆశ్చర్యమేమం టే పురుషకారమే అహంకారంగా వేషం మార్చుకొని రావడం.
తానే దేవుడు కావాలనుకునే వాడు దేవుని మీద ఆధారపడటం విడ్డూరమే అవుతుంది. ప్రధాని కావాలనుకునే వ్యక్తి ప్రధానిపై ఆధారపడతాడా? పురాణాలు పరికిస్తే.. ఎందరో రాక్షసులు ఇంద్రపదవిపై మోజుపడ్డారు. ఇంద్ర పదవిని ఆశించిన రాక్షసులు ఇంద్రుడిపై ఆధారపడ్డ దాఖలాలు కనిపించవు. అలాంటి అవకాశమే ఉండదు.
పురుషకారం అవలంబించడం తప్పుకాదు. ‘ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః’- పురుష ప్రయత్నం వల్లే పనులు నెరవేరుతాయి. కానీ, కేవలం కోరికల వల్ల కాదు అని భావం. కానీ, పురుష ప్రయత్నం ఎప్పుడో ఒకప్పుడు అహంకారంగా పరిణమించక తప్పదని సంప్రదాయవేత్తల అభిప్రాయం. కాబట్టి, అలా పరిణమించకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన మరో బాధ్యత సాధకుని నెత్తిన పడినట్లే అవుతుంది. ఎప్పుడు సాధకునికి ఏమరుపాటు కలుగుతుందో అంటే తమోగుణం కమ్ముకొస్తుందో అప్పుడే పురుషకారం పడగ విప్పుతుంది. అహంకారం వచ్చిపడ్డాక దాన్ని జయించవలసిన అవసరాన్ని గుర్తించడం ఒకటి, జయించడం మరొకటి. రెండు బాధ్యతల కర్తవ్యాలు సాధకుని భుజస్కంధాల మీద పడ్డాయని భావించాలి. అది గుర్తించలేకపోతే ‘నన్ను మించిన మొనగాడు లేడు’ అనుకుంటూ కూర్చోవడం మొదలవుతుంది. అడుగు ముందుకు పడదు. కాలక్షేపం మాత్రం జరుగుతుంది. అంటే కాలం అలాంటి వాణ్ని కబళించడానికి పావులు కదపటం మొదలుపెడుతుంది.
దేవుని మీద ఆధారపడేవాని లక్షణం వేరు. అలాంటివాళ్లు పొరపాటున కూడా తానే దేవుడు కావాలనుకోరు. శరణాగతి భావాన్ని ఆశ్రయిస్తారు.
‘అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ (భగవద్గీత 9-22)
‘ఎవరైతే అనన్యంగా నన్ను చింతిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను’ అని కదా గీతాచార్యుని హామీ. ‘నన్ను నమ్మినవారిని సదా కనిపెట్టుకొని ఉంటాను. ఇంకా గాభరా ఎందుకు? నిశ్చింతగా ఉండు’ అని శ్రీకృష్ణుడు తిరుగులేని వాగ్దానం చేసినట్టే అయింది. కానీ, పురుషకారం వద్దనలేదు. శరణాగతి భావంలో ఇదివరకే స్థిరపడిన ఈ సాధకునికి అహంకారం తలకెక్కే ప్రసక్తి ఉండదు. భగవానుని పర్యవేక్షణలో అడుగు ముందుకే కదులుతుంది.
వెలుదండ
సత్యనారాయణ