భాద్రపద మాసం కృష్ణ పక్ష పాఢ్యమి మొదలు అమావాస్య వరకు ఉన్న కాలాన్ని (సుమారు 15 రోజులు) మహాలయ పక్షంగా నిర్వహించడం భారతీయ సంప్రదాయం. వర్షాలు కురిసిన తర్వాత భూమిలో నుంచి అనేక సూక్ష్మజీవుల ఉత్పాదన జరుగుతుంది. ఆ క్రిములు వ్యవసాయాదులకు ఉపయోగపడేవి కొన్నయితే, మానవాళిని ఇబ్బందిని పెట్టేవి కొన్ని ఉంటాయి. ఈ వ్యతిరేకతల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి భారతీయ ధర్మశాస్త్రం అనేక రకాలైన జాగ్రత్తలను సూచించింది. పలు వ్రత ధర్మాలను నిర్వహించడం కూడా వర్షకాలంలో కనిపిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సూక్ష్మజీవుల ప్రభావం కారణంగా ఈ మాసాల్లో ఎక్కువ మరణాలు జరుగుతుంటాయి.
భాద్రపద మాసంతో వర్ష రుతువు పరిసమాప్తమవుతుంది. సూక్ష్మజీవి ప్రభావాల వల్ల కలిగే రోగాలు, మరణాలకు దాదాపు అడ్డుకట్ట పడుతుంది. క్రమంగా చలికాలం మొదలవుతుంది. ఆశ్వీయుజ మాసం దసరా నుంచి మళ్లీ యథావిధిగా కార్యక్రమాల్లో లోకం నిమగ్నమవుతుంది. అయితే, ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నవాళ్లు, వయస్సు పైబడిన పెద్దలు ఎక్కువగా లయం అయ్యే పక్షం ఇది కాబట్టి ఈ కాలాన్ని మహా‘లయం’ అన్నారు. లయకారకుడైన శివునిలో (భూమిలో) అందరూ లయం అయ్యే సమయంగా ఈ పక్షాన్ని గుర్తిస్తున్నారు.
సమాజంలో ఎక్కువ మంది కుటుంబాల్లో అనారోగ్యాలు, కొన్నిచోట్ల మరణాలు ఉంటున్న ఈ సమయంలో మిగిలినవారు ఎటువంటి శుభకార్యాలు జరుపుకోవడానికి అవకాశం ఉండదు. ఆయా వ్యక్తులు మనకు హితులో, సన్నిహితులో, స్నేహితులో, బంధువులో, మన ఇంటివారో ఉంటారు కాబట్టి, మనవారంతా బాధల్లో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండలేం. అందువల్ల అన్నిరకాల శుభకార్యక్రమాలకు ఇది నిషిద్ధం. కేవలం ధ్యానాదులతో కూడుకున్న, ఆధ్యాత్మికశక్తిని పెంచుకునే వ్యవహారాలు మాత్రమే ఈ సమయంలో చేయాల్సి ఉంటుంది.
మహాలయ పక్షంలో పితృకార్యాలు చేసి మన సన్నిహితులను, రక్త సంబంధీకులను గుర్తుచేసుకోవడం ఒక సంప్రదాయం. ఇది అవసరం కూడా. మనవారిని మనం ఏడాదికి ఒకసారైనా తలచుకోవడం ఇందులో జరుగుతుంది. బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఉపకరించని వారికి, మరణించిన తర్వాత పితృకార్యాలు సరైనవిధంగా ఆచరించని వారికి పితృదోషాలు ఏర్పడుతాయని, వారి అనుకూల ఆశీర్వచనాలు లభించవని ధర్మశాస్త్రం చెప్తున్నది. అందరూ అన్ని పనులూ చేయడానికి అశక్తులుగా ఉంటారు కాబట్టి, కనీసం ఈ మహాలయ పక్షంలోనైనా పితృకార్యాలను నిర్వహించడం పూర్వం నుంచి సంప్రదాయంగా వస్తున్నది.
తండ్రి జీవించి ఉండి తల్లి మరణించినవారు బహుళ నవమి నాడు పితృకార్యాలను నిర్వహించడం ఒక సంప్రదాయం. తల్లిదండ్రులు మరణించినవారు, తమ రక్తసంబంధీక బంధువులందరికీ పిండప్రదానాలు చేసి, వారిని గుర్తుచేసుకొని, ఆ రోజున శక్తిమేరకు అన్నదానం నిర్వహిస్తారు. కేవలం మన బంధువర్గానికే కాకుండా అవసరార్థులకు ఎందరికో అన్నదానం చేయడం వల్ల పితృ దేవతలకు ప్రీతి కలుగుతుంది. సాధారణంగా తండ్రి మరణించిన తిథి ఈ పక్షంలో ఏ రోజున వస్తుందో ఆ రోజున పితృపక్షం నిర్వహిస్తారు. పిండ ప్రదానాదులు సాధ్యం కాకపోతే తర్పణాదులు, అవీ సాధ్యం కానట్లయితే కనీసం అన్నదానం చేయాలని సంప్రదాయం. అది కేవలం స్వయంపాకం వరకు మాత్రమే మారిపోయింది. ఈ పక్షంలో ఎంత అన్నదానం జరిగితే (అనాథాశ్రమాలు, అన్నదాన సత్రాల్లో) అంతగా పితృదేవతల ఆశీస్సులు పొందే అవకాశం ఉంటుంది.
పితృపక్షంలో లోక క్షేమం కోసం శివారాధనలను నిర్వహించడం, గృహ పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రతను పాటించడం, ధ్యానాదుల ద్వారా, యోగసాధనల ద్వారా మానసిక, శారీరకశక్తులను పెంచుకోవడం తప్పనిసరి అవసరం. అన్నిటికన్నా దానాలు చేయడం ద్వారా పితృదేవతల పూర్ణాశీస్సులు మానవాళిపై ఉంటాయన్నది మహాలయ పక్షం మనకు ఇచ్చే సందేశం.
సాగి కమలాకర శర్మ