యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్తా ధనంజయ
సిధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే॥
(భగవద్గీత 2-48)
ఓ ధనంజయ! యోగస్థితుడై ఆసక్తిని వీడి, సిద్ధి (పొందుట), అసిద్ధి (పొందకపోవటం) పట్ల సమత్వ భావం కలిగి ఉండి నీ కర్తవ్య కర్మలను కొనసాగించు. ఈ సమత్వ భావమునే యోగం అంటారు.
గీతాచార్యుడు.. అర్జునుడికి ఉపదేశించిన ఈ సమత్వ భావన అందరికీ వర్తిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం అనేక పర్వతాలు, వనాలు, జంతుజాలంతో నిండి ఉంది. ప్రాంతాలకు అనుగుణంగా లోకంలో అనేక భేదభావాలు కనిపిస్తుంటాయి. ఈ సృష్టిలోని ప్రతి వస్తువూ, ప్రతి జీవీ ఒక ప్రత్యేకతను, ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి. ప్రపంచ మనుగడలో వీటన్నిటికీ తగు ప్రాధాన్యం ఉంది. కానీ, ఆ విషయాన్ని తెలుసుకోలేక, వివిధ ప్రమాణాలతో కొలుస్తూ ఒకదానిని గొప్పదానిగా, మరొకదానిని హేయమైనదిగా భావిస్తున్నాం. గొప్పగా భావించిన దానిని అభిమానిస్తూ, హేయమనుకున్న వాటిని ద్వేషిస్తున్నాం. ఈ రాగద్వేషాలతో వివిధ కర్మలను ఆచరిస్తూ వాటి ఫలితాలను సుఖదుఃఖాల రూపంలో అనుభవిస్తున్నాం.
సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాత్ముడున్నాడన్న సత్యాన్ని గుర్తించలేక ప్రతి వ్యక్తినీ, వస్తువునూ వేరుగా భావిస్తున్నాం. ఈ వేరొకటి అనే భావనే భయానికి హేతువు అవుతుంది. ‘ద్వితీయావై భయం భవతి’ అన్నారు. రెండోది ఉండటం అనే భావనతో భయం కలుగుతుందని శాస్త్ర వచనం. వాస్తవానికి ఉన్నది తాను ఒకటే, మరొకటి లేదు అన్న సత్యాన్ని గుర్తించకపోవడమే రాగద్వేషాలకు కారణం. ఒక వస్తువును ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించకుండా మనస్సులో ఏర్పడిన వికారభావాల వల్ల ఈ భేదాలు ఏర్పడుతున్నాయి. మనం చూస్తున్నవి అన్ని ప్రతిబింబాలే, వాస్తవాలు కావు. నీటిలో మన ప్రతిబింబాన్ని చూసి వేరొకరు ఉన్నట్లుగా భ్రమించడం వంటిదే! ఆకారాన్ని బట్టి, నిర్మాణశైలిని బట్టి ఆభరణాలు వేర్వేరుగా కనిపించవచ్చు! కానీ, మూలం బంగారం ఒకటే. అలాగే అన్ని జీవరాశుల్లో, ప్రతి వస్తువులో ఉన్నది పరమాత్మ తప్ప మరొకరు కాదు. ఈ సత్యం మనసులో స్థిరంగా ఏర్పడినప్పుడే ‘సమదృష్టి’ ఏర్పడుతుంది. అప్పుడు వస్తువులపై, ఇతర మనుషులపై భేదభావం తొలగిపోతుంది. ఈ సమత్వ భావన పొందడాన్నే యోగం అంటుంది భగవద్గీత.
ఎలాంటి వికారాలు లేకుండా మనసు నిర్మలమై సమత్వ భావం పొందినప్పుడు రాగద్వేషాలు తొలగిపోతాయి. అప్పుడు సిద్ధి, అసిద్ధిపై సమత్వం ఏర్పడుతుంది. తద్వారా కర్మలపై ఆసక్తి నశిస్తుంది. ఫలితంగా మోహం ఏర్పడదు. అప్పుడు కర్మలు ఆచరిస్తున్నా.. కర్మఫలాన్ని పొందడం ఉండదు. ఈ స్థితికి చేరినవాడే నిజమైన యోగి. తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా.. ఇంద్రియ భోగాలపై ఆసక్తిని వదిలిపెట్టినవాడే యోగాన్ని సాధించగలడు. అన్ని దిశల నుంచి వచ్చి చేరే నదులు సముద్రాన్ని ఎలాగైతే చలింపజాలవో, అలాగే ఇంద్రియ నిగ్రహం సాధించిన యోగిని భోగాలు ప్రభావితం చేయలేవు. ఈ స్థితిని పొందిన సాధకులు జ్ఞానులను, అజ్ఞానులను, సమస్త జంతుజాలాన్నీ, మానవాళినీ సమంగా చూస్తారు. ‘పండితా సమదర్శినః’ అని భగవద్గీత పేర్కొన్నది. ఈ సమత్వాన్ని సాధించినవారు మట్టిని, రాయిని, బంగారాన్నీ ఒకేలా చూస్తారు. అలాంటి యోగి సర్వశ్రేష్ఠుడు అని చెప్పింది గీత. వేదాల కన్నా యజ్ఞాలు శ్రేష్ఠం. వాటికన్నా జపం, దానికన్నా జ్ఞానం, దీనికన్నా ఆసక్తి, అనురాగాలు లేని ధ్యానం శ్రేష్ఠమైనది. అలాంటి ధ్యానం సాధించిన యోగికి పరమాత్మ లభిస్తాడు. మనసు, ఇంద్రియాలను జయించి ప్రశాంతుడై సమత్వబుద్ధిని పొందిన యోగి అంతటా పరమాత్మను దర్శిస్తూ జీవన్ముక్తుడవుతాడు.
దోర్బల కుమారస్వామి