‘యజ్ఞం, దానం, తపస్సు (ధ్యానం)’.. ఈ మూడు దివ్య గుణాలు ప్రతి మనిషికీ ఆధ్యాత్మిక సాధనలో అత్యవసరం. ‘వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని’ వేద విజ్ఞానులు చెప్తారు. ‘యజ్ఞం’ వివిధ సందర్భాల్లో (గృహప్రవేశం, ఇతరేతర శుభకార్యాలు) చేస్తారు. ‘యజ్ఞం’ ఇచ్చే ఫలం అనంతమైంది. యజ్ఞాల ద్వారా ఎన్నో కార్యాలు విజయవంతమవుతాయని వేదాలు ఘోషిస్తున్నాయి. అజ్ఞానంతో కొందరు ‘యజ్ఞకర్మలను దోషం వలె వదిలివేయడమే మంచిది’ అని అనుకుంటారు. ఇది చాలా తప్పు. నిష్కామకర్మలను ఆచరించే మనఃస్థితి ఎలాగూ లేదు. ‘కామ్యకర్మలు ఉత్తరజన్మలకు కారణమవుతాయి. కనుక, అసలు కర్మలు మానేస్తే పోలా?’ అని కొందరికి అనిపిస్తుంది. ఇది ఆచరణాత్మకం కాదని ధర్మశాస్ర్తాలు చెప్తున్నాయి. ‘..యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే’ (భగవద్గీత 18:3) అని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే బోధించాడు. యజ్ఞం చేయడమంటే కేవలం అగ్నిని హోమగుండంలోకి ఆహ్వానించి నెయ్యి పోయడం మాత్రమే కాదు. నిస్వార్థంగా, పరోపకార సహితంగా, భగవదర్పితంగా చేయవలసిన ప్రతి కర్మ ‘యజ్ఞం’గానే పిలువబడుతుంది. భారతీయ సనాతన ధర్మంలో యజ్ఞానికి ఇంతటి ఉత్తమోత్తమమైన స్థానం ఉంది.
‘దానగుణం’ కూడా అత్యంత విశిష్టమైంది. ఒకరు మరొకరికి ఇష్టపూర్వకం (ప్రేమతో)గా దేనినైనా సమర్పించుకోవడం. అయితే, అర్హమైన వస్తువు, అర్హమైన సమయంలో, అర్హమైన వ్యక్తి నుంచి అర్హమైన వ్యక్తికి అందడం ముఖ్యం. సంపద ఒక్కచోటే ఉండకుండా కలిగిన వారి నుంచి లేనివారికి అందడమే ఇందులోని ‘లౌకిక ప్రయోజనం’. ఫలితంగా దానం చేసే వ్యక్తికి హృదయ వైశాల్యం, ఉదారత పెరుగుతాయి. మనసు శాంతితో పరిశుద్ధమవుతుంది. ఆత్మ జ్ఞాన సముపార్జనకూ మార్గం సుగమమవుతుంది. మనం విదేశాలకు వెళ్లినప్పుడు ఇక్కడి కరెన్సీ అక్కడ చెల్లదు కదా? కనుక, ఆ దేశపు కరెన్సీ కిందికి మార్చుకొని వెళ్తాం. అలాగే, ఈ జన్మలో కూడబెట్టిన ధనం, ధాన్యం, పసిడి వంటి సంపదలు ఏవీ కూడా వచ్చే జన్మకు పనికిరావు. మనం దేనినైతే దానం చేస్తామో ఆ పుణ్యఫలం మాత్రమే వచ్చే జన్మలోకి బదిలీ అవుతుంది. అందుకే, ఈ జన్మలో మనకు భగవంతుడు ఇచ్చిన దానిలోంచి కొంతైనా దానధర్మాల ద్వారా బీద సాదల రూపంలోని భగవంతునికి తిరిగి సమర్పించుకోవాలి. లేకపోతే మన పిల్లలు, దాయాదులు వాటిని పంచుకుంటారు. ఇంకా అవసరమైతే, వాటికోసం తగవులూ పడతారు. ఉత్తమమైన దానగుణాన్ని మన పెద్దలు పర్వదినాలు, ఉత్సవాలు, తీర్థాల పేరిట మనకు అలవాటు చేశారు. అయినా, చాలామంది ఆస్తిపాస్తులు కలిగి ఉండికూడా వాటిలోంచి ఇసుమంతైనా లేనివారి కోసం వదులుకోవడానికి సిద్ధం కారు. ఇదే పెద్ద అపరాధం.
మూడో దివ్యగుణమైన ‘తపస్సు’ (ధ్యానం) అంటే ‘ప్రాచీనకాలంలో ఋషులు చేసినటువంటిది’ కాదు. ఏవో శీర్షాసనాలు వేస్తూ, తిండితిప్పలు లేకుండా మాడిచావమనీ కాదు. ‘భగవంతుని కోసం మనస్ఫూర్తిగా తపించడం’. మనమందరం అనునిత్యం తపిస్తూనే ఉంటాం. కానీ, ఏవేవో లౌకిక కోర్కెల సాధన కోసం! భగవంతుని కోసమే త్రికరణశుద్ధిగా తపిస్తే అలాంటి భక్తులకు తాను తప్పక దొరుకుతాడు. లక్ష్యశుద్ధితో ఇలా ‘తపస్సు’ (ధ్యానం) చేస్తే భగవంతుడు తప్పక మన వశమవుతాడు. భారతీయులే కాదు, మానవునిగా పుట్టిన ప్రతివారు ఈ మూడూ (యజ్ఞం, దానం, తపస్సు) ఆచరించవలసిందే. స్వచ్ఛ హృదయంతో వీటిని ఆచరణలో పెడితే ఏకాగ్రత అలవడుతుంది. మనసు కుదుటపడి, కోరికలు నశ్వరమవుతాయి. జీవితంలో ధర్మబద్ధమైన విజయం లభిస్తుంది. అంతేకాక, మనసు యోగానుకూలమై ఆధ్యాత్మిక సాధనలో ఒక మెట్టు ఎదిగినవారమవుతాం.
కనుమ ఎల్లారెడ్డి
93915 23027