వేద ప్రతిపాదిత దైవం ఒక్కడే. అతనినే ‘పరమాత్మ’, ‘పరమేశ్వరుడు’, ‘పరబ్రహ్మ’ అని వివిధ రకాలుగా పిలుస్తాం.వేదం సత్యవిద్యల గ్రంథం. అది అన్ని ధర్మాలకు పరమ ప్రమాణం. ఏ సందేహాల నివృత్తికైనా దానిని ఆశ్రయిస్తే సరి.భౌతిక ప్రపంచంలో నివసిస్తున్న మనకు ఆధ్యాత్మికంగా చక్కని మార్గాన్ని చూపగలిగింది ఒక్క వేదమే.
సాధారణంగా మనకు కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. ‘దేవుడొక్కడే ఉన్నాడా? ఈ సృష్టి ఎట్లేర్పడింది? సృష్టికి, దేవునికిగల సంబంధమేమిటి? సృష్టికి మూల కారణం ఏమిటి? దేనినుంచి ఈ జడజగత్తు వచ్చింది? పరమ చైతన్యం (జ్ఞానం) నుంచి జగత్తు (జడరూపం) ఎట్లా వస్తుంది? చివరికి, ఈ జడజగత్తు ఎందులో లీనమవుతుంది? ఇలాంటి సందేహాలకు ‘ఋగ్వేదం’లోని ‘నాసదీయ సూక్తం’ (129వ)లో సమాధానాలు లభిస్తాయి. ఈ సూక్తంలో ‘త్రైతవాదం’ ఉంది. జడజగత్తుకు మూలకారణం, సృష్టి ప్రాథమిక స్థితి నిరూపితమైనాయి. సృష్టికి ‘ఉపాదాన’ కారణం జడప్రకృతి. అది అవ్యక్తంగా సృష్టికి ముందున్నట్లు తెలుస్తున్నది. సృష్టి జరిగిన తర్వాత కనిపించే జీవాత్మలు, ముక్తాత్మల ప్రసక్తికూడా ఇందులో కనిపిస్తుంది. ‘సృష్టికి పూర్వం ఒక్క పరమేశ్వరుడు తప్ప, ఈ జగత్తు ఉందనిగాని, లేదనిగాని చెప్పలేమని’ ఈ సూక్తం చెప్తుంది. ‘లోకాలుగాని, లోకాంతరాలుకాని, అంతరిక్షం గాని ఏవీ లేవని, కేవలం అంధకారం మాత్రమే అంతటా వ్యాపించి ఉందనికూడా’ ఇది పేర్కొన్నది.
సృష్టి ఆవిర్భావానికి ముందు మృత్యువు లేదు. కాలం లేదు. ప్రాణశక్తి ప్రసారమూ లేదు. ఇంకా చెప్పాలంటే, రాత్రి, పగలూ వీటి గుర్తులేవీ లేవు. కానీ, ఒక్క పరమేశ్వరుడు మాత్రమే చలనం లేనివాడై, చైతన్య స్వరూపుడై ప్రకృతితో కూడి చేతనత్వ వ్యవహారాలు నడుపుతుంటాడు. ఆ దేవుణ్ని మించిన వారుగాని, అతనితో సమానమైన వారుగాని ఎవరూ లేరని ఈ సూక్తం చెప్తున్నది.
“ఆనీదవాతం స్వధయాతదేకం
తస్మాద్ధా న్యన్నపరః కించనాస”
స్వయంప్రకాశ శక్తిగల పరమేశ్వరుడు ఒక్కడే ఈ అద్భుతమైన సృష్టికి కర్త. ఐతే, ‘ఈ సృష్టి ఎలా రూపు దాల్చింది?’ అనేది ఆ పరమేశ్వరునికి మాత్రమే తెలుసు. ఒకవేళ సృష్టికంటే ముందు దానికి సంబంధించిన రచన ఎట్లా జరిగిందంటే, ‘తెలుసుకోదగిన విద్వాంసులుకూడా అప్పుడు లేరుకదా’ అంటున్నది ‘నాసదీయ సూక్తం’. ‘వివిధ రీతులలో జీవుల కర్మఫలాలకు అనుగుణంగా రచింపబడిన ఈ సృష్టి ఎవరిచేత ధరింపబడిందో, ఎవరిచేత ధరింపబడలేదో, ఎవరు ఈ సృష్టికి అధ్యక్షులో, సృష్టిని పూర్తిగా అధిగమించినవారో, ఆ పరమేశ్వరునికి తప్ప ఇతరులెవరికీ తెలియదని, ఒకవేళ తెలుసుకున్నా వారికి సంపూర్ణంగా తెలియదని’ వివరిస్తుంది ఈ సూక్తం. మొత్తం మీద సృష్టికంటే ముందు ప్రకృతి అవ్యక్తంగా ఉన్నప్పటికీ కారణరూప ప్రకృతిలో కార్యరూప జగత్తు ఉందనిగాని, లేదనిగాని చెప్పలేమని ‘నాసదీయ సూక్తం’ తేల్చింది. ‘నాసదీయం’ అంటే ఇదే అర్థం.
ఆచార్య
మసన చెన్నప్ప
98856 54381