అయి గిరినందిని నందిత మేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే
భగవతి హే శితి కంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే.
కర్మబంధనాలవల్ల సమస్యలను మనమే కొనితెచ్చుకుంటాం. అనుభవించే ప్రతి లోపమూ, గుణమూ మనం గతంలో చేసిన పుణ్య పాపకర్మలకు ప్రతీకగానే ఉంటుంది. పుణ్యకర్మలకు సాధుజీవితం, ఆనందం, ఆరోగ్యం, సంతాన, వైవాహిక, కుటుంబ సంతృప్తులు, ప్రశాంతత, ఆర్థిక పురోగతి వంటి ఆనందమయ వ్యవహారాలు ఫలితాలు. కాగా, పాపకర్మలకు వ్యతిరేకతలు, చికాకులు, ఇబ్బందులు, ఆరోగ్య, వైవాహిక, సంతాన, ఆర్థికాది సమస్యలు, లోపాలు, అడ్డంకులు ఫలితాలుగా మారుతాయి. దైవమంత్రాలలోని శక్తి మనలను కాపాడుతుంది. దైవాన్ని శరణు కోరడం తప్పనిసరి.
అమ్మవారి శక్తులన్నీ సూర్యునినుండి భూమికి చేరేవే. సూర్యోదయ కాలశక్తి బాలాత్రిపుర సుందరి అయితే తర్వాతి వరుస కిరణాలలో అదే శక్తి గాయత్రిగా, అన్నపూర్ణగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా విరాజిల్లుతుంది. సూర్యకాంతి నడినెత్తి మీదికి వస్తున్న సందర్భంలో అది దుర్గగా, మహిషాసుర మర్దినిగా, రాజరాజేశ్వరిగా విరాజిల్లుతుంది. ఇటువంటి మూలశక్తిని మనం ఆరాధిస్తే తీవ్రమైన కిరణాలతో కూడుకున్న మహిషాసుర మర్దిని మనలను ఆరోగ్యపరంగానూ, వ్యతిరేకతలను నివారించడంలోనూ రక్షిస్తుంది. ప్రస్తుత కాలంలోని సూక్ష్మజీవి కొమ్ములతో సమాజాన్ని ఎలా భయభ్రాంతులను చేస్తున్నదో అటువంటి సూక్ష్మజీవి వంటివాడే మహిషాసురుడు. ఆ సూక్ష్మశక్తిని మూలాలతో సహా తీసివేసి ఒకానొక ‘ప్రకృతి శక్తి’ విజయం సాధించింది. ఆమె పేరే ‘మహిషాసుర మర్దిని’.
ఆ శక్తిని ఉపాసిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనవసరమైన అంటువ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఇతరుల వ్యతిరేక దృష్టులు, వ్యతిరేక భావనలు మనలను అంటుకునే అవకాశం ఏ రూపంలోనూ ఉండదు. సమస్యలూ, రోగాలూ, వ్యతిరేకతలూ మనలను అంటుకోకుండా, మనం ప్రశాంతంగా, ధైర్యంగా బతకాలంటే మహిషాసుర మర్దినిని ప్రార్థించాల్సిందే. శక్తి బీజాక్షరంతో కూడుకున్న ఈ అమ్మవారి నామం జపించినా, హోమం చేసినా అధికమైన పుణ్యఫలం వస్తుంది. కరోనా విపత్తును అధిగమించాలంటే ఈ నామ పారాయణం ద్వారా తప్పనిసరిగా విజయం సాధించవచ్చు. ‘వ్యాధి సోకుతుందేమో’ అన్న భయమూ తొలగుతుంది. ‘ఓం హ్రీం మహా మహిషమర్దినీ స్వాహా’ అనే జపాన్ని ప్రతి రోజూ కనీసం 1 గంటపాటు చేద్దాం. దోషం ఏ రూపంలో ఉన్నా అలాంటివారు మరింత ఎక్కువగా జపించాలి. వేర్వేరు రూపాల్లో సామాజిక వ్యతిరేకతలు ఉన్నవారు కూడా బాగా జపించడం మంచిది.
సాగి ,కమలాకరశర్మ