భౌతికవాదులకు కేవలం భౌతిక పదార్థమే కానీ, తద్భిన్నమైన పదార్థం ఒకటుందనే విశ్వాసం లేదు. వారు తరుచుగా ‘మరణానంతర జీవితం’ అనేది ఉండదనే భావిస్తారు. వారి దృష్టిలో ప్రతి అణువూ జీవకణమే. ‘అది అనుక్షణం పుడుతుంది, చస్తుంది’ అనేది వారి వాదం. భౌతికవాదులు భౌతిక పదార్థాన్ని, అణువును ఒప్పుకుంటారు. అణువులకంటే సూక్ష్మమైనవి పరమాణువులు. అవి ఉన్నవా? లేనివా? ఒకవేళ ఉంటే అవి శాశ్వతమైనవి కావా? ఈ జడ ప్రపంచానికి మూలకారణమైన పరమాణువులు శూన్యంలోనుంచి అంటే ఏమీ లేని దానినుంచి వచ్చినవా? ఏదీ శూన్యం నుంచి రాదు కనుక, పరమాణువులు మొదటినుంచి ఉన్నాయనే అభిప్రాయానికి బలం కలుగుతుంది.
పరమాణువులకే ఏ రూపాన్నైనా ధరించగలిగిన శక్తి ఉందని భౌతికవాదుల మూఢనమ్మకం. వారు పరమాణువులనే జీవకణాలుగా లెక్కించి, మన శరీరంలో కోట్లకొలది జీవకణాలున్నాయని, అవి పుడతాయని, నశిస్తాయని ఒకసారి చచ్చి, ఆ తర్వాత మళ్లీ ప్రభవించవని’ భౌతికవాదులు తలాతోక లేని వాదాన్ని వినిపిస్తుంటారు. ఒక చెట్టు ఉందనుకోండి. దానికి ఫలానా పూలు పూస్తున్నాయని తెలియదు. ఫలానా పండ్లిస్తున్నాననీ తెలియదు. అసలా చెట్టు జ్ఞానరహితమైన జడపదార్థం. చెట్టుకు విత్తనం మూలం. ఆ విత్తనం ఫలానా చెట్టునవుతానని ఎవరికీ చెప్పదు. తనకు తెలిస్తే కదా! కుండను తయారు చేసేవానికి కుండను గురించి పరిజ్ఞానం ఉన్నట్లే, విత్తనంలో చెట్టు రచన చేసిన వానికే చెట్టు పరిజ్ఞానం ఉంటుంది. ఏయే పూలు పూయించాలో, ఏయే పండ్లను అందించాలో, వాటివల్ల మానవాళికి (జ్ఞానం కలిగిన వారికి) ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో తెలిసిన వానికే (పరమేశ్వరునికే) విత్తనాన్ని సృజించి, అందులో చెట్టు రచన చేయగలిగిన సామర్థ్యం ఉంటుంది.
‘ఋతంచ సత్యంచ అభీద్ధాత్త పసః అధ్యాజాయత’
(ఋగ్వేదం 10-190-1). పరమేశ్వరుడు తన అనంత జ్ఞానమయ సామర్థ్యం చేతనే వేదశాస్ర్తాలను ప్రకాశింపజేశాడు. దానికే ‘ఋతం’ అని పేరు. సత్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాత్మకమైన, అవ్యక్తమైన ప్రకృతి ‘సత్తు’. ప్రకృతికూడా ఉనికి కలిగింది కనుక, అది సత్యమే. దీనికే ప్రధానమని కూడా పేరు. ఇది సూక్ష్మరూపంలో ఉంటుంది కనుక కనిపించదు. కానీ, ఇదే స్థూలరూప జగత్తుకు కారణభూతమవుతుంది. ఈ ‘ప్రకృతి’ని ద్రవ్యంగా చేసుకుని, వేదాలలో వర్ణితమైనట్లుగా పరమేశ్వరుడు తన అనంతమైన సామర్థ్యంతో జగత్తును నిర్మించాడన్నది పై మంత్రార్థం. ‘ఈ ప్రపంచం స్థూలమైంది. ఈ కార్యరూప ప్రపంచానికి కారణమైన ప్రకృతి సూక్ష్మమైంది. ఇది లేనిది కాదు’. అందుకే, భగవద్గీతకూడా ఈ విషయాన్ని నొక్కి చెప్తుంది. ‘నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః’ (2-16). ‘లేని దానికి ఉనికి లేదు. ఉన్నదానికి నాశం లేదు’ అని దీని భావం. అంటే, ‘లేని దాన్నుంచి ఉన్నది రాదు, ఉన్నది లేకుండా పోదు’ అని అర్థం.
ఏదీ శూన్యం నుంచి రాదని తెలుసుకోవడమే విజ్ఞుల ధర్మం. ‘భగవద్గీత’లోని ‘కర్మయోగం’ జడప్రపంచమే పరిణామం చెందుతుందని స్పష్టం చేస్తుంది. కానీ, అది లేని దానినుంచి వచ్చిందని చెప్పదు. స్వయంగా పరిణామం చెందుతుందనీ చెప్పదు. ప్రాణుల శరీరాలన్నీ అన్నం నుంచే ఉద్భవిస్తాయి. అన్నం వర్షం కారణంగా ఉత్పత్తి అవుతుంది. వర్షం యజ్ఞం వల్ల కురుస్తుంది. యజ్ఞం కర్మ (కర్తవ్య కర్మ) వల్ల ఏర్పడుతుంది. ‘విహిత కర్మ’ అనేది వేదం వల్ల తెలుస్తుంది. వేదం అనేది సృష్టికర్త అయిన పరమేశ్వరునివల్ల ప్రకటితమవుతుంది. ఇదీ వరుస. ఒక దానికొకటి ప్రపంచ పదార్థాలు ‘కార్యకారణ సంబంధం’ వల్ల ఉన్నట్లు గీత ప్రబోధిస్తున్నది. వేదం పరమేశ్వరుని జ్ఞానం. అది ‘మన పనులు ఇలావుంటే బావుంటుంది’ అని ప్రబోధించింది. ఆ ప్రకారం ఏర్పడిందే యజ్ఞం. యజ్ఞం వర్షానికి కారణభూతమవుతుంది. వర్షం కారణంగా విత్తనాలు మొలకెత్తి మన ఆహారానికి కారణమవుతున్నాయి. సృష్టిలో ఇదంతా దానంతటదే జరుగుతుందనే భ్రమలో ఉంటారు కేవల భౌతికవాదులు. కానీ, మన ఆహారోత్పత్తికి మూలకారణం వేదజ్ఞానమనే విషయాన్ని వారు పట్టించుకోరు. వేద పురుషుని జ్ఞానం వల్లనే యజ్ఞం గాని, వర్షం గాని, విత్తనం గాని, చెట్టుగాని, ఆహారం గాని, ప్రాణుల శరీరాలు కాని ఏర్పడుతున్నాయన్నది స్పష్టం.
‘జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః
ఆచార్య
మసన చెన్నప్ప
98856 54381