మాంసాహారానికి అలవాటు పడ్డ మనిషి రాన్రాను మరింత క్రూరంగా ‘తోటి మనిషినే చంపేసేలా’ తయారవుతున్నాడు. అసలు మన సనాతన ధర్మం జీవహింస గురించి ఏం చెప్పింది?
ఆర్.సూర్యతేజ, రాయలాపూర్
‘సాత్విక జీవనానికి’ ఈ మాంసాహారం అడ్డు వస్తున్న మాట నిజం. ‘అహింసా పరమో ధర్మః’ అన్న సూక్తి జగద్విదితం. ‘హింసద్వారా హింసమాత్రమే పుడుతుంది. అహింసను ఆధారంగా చేసుకొని ప్రపంచంలోని ఏ క్రూరశక్తినైనా జయించవచ్చు’ అని మహాత్మాగాంధీ ఎలుగెత్తి చాటాడు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు పత్రీజీ భారతీయ సనాతన ధర్మాన్ని కాచి వడపోసి ప్రధానంగా ప్రబోధించింది ఇదే. ‘జంతుమాంస భక్షణే సకల రోగాలకు మూలకారణం’ అన్న ఆయన మాటల్లోని అంతస్సారాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.
మనిషికి ఆధ్యాత్మిక ఉన్నతినిచ్చి భగవంతునికి సన్నిహితంగా కొనిపోగలిగింది ‘సత్త’గుణమే. దీనిని ఎదుగనీయక, ‘రజస్తమో’ గుణాలను ప్రకోపింపజేయడమేగాక వాటిల్లో మానవుణ్ణి చిక్కుపడేట్టు చేసేది మాంసాహారం. ఫలితంగా భగవంతునికి దూరమైపోవడం తద్వార జనన మరణ చక్రంలో మరింతగా కూరుకుపోవడం జరుగుతుంది. ‘అష్టాంగ యోగం’గా ప్రసిద్ధినొందిన యమనియమాదులలో ‘యమం’ కింద ‘అహింసా సత్య మస్తేయం బ్రహ్మచర్య మపరిగ్రహమ్’ అని అయిదింటిని పేర్కొంటారు. ‘అహింస’ను మొట్టమొదటే పేర్కొన్నాడు పతంజలి మహర్షి. కాబట్టి, ‘సాతిక’ జీవనానికి ‘మాంసాహార భక్షణ’ను ప్రధాన అవరోధంగా గుర్తించాలి. మాంసాహారులే ‘బలవంతులను’కోవడం కూడా వట్టి అపోహ. ఆకలి గొన్న ఇద్దరిలో ఒకరికి మాంసాహారం, మరొకరికి శాకాహారం వడ్డిస్తే, ఇద్దరికీ ఆకలి తీరడం లేదా? ప్రయోజనం సిద్ధించినట్టే కదా!
డా॥ వెలుదండ సత్యనారాయణ
94411 62863