వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో పరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ॥
భౌతికమైన స్థూల శరీర తత్త్వం అందరికీ తెలుసు. కానీ, సూక్ష్మ శరీర, ఆత్మపదార్థ తత్తాలు కేవలం యోగులకే ఎరుక. దేహంలో ఉన్నప్పుడు ఆత్మ పదార్థాన్ని ‘దేహి’ అంటాం. దేహం నుంచి బయటకు వచ్చేస్తే అది ‘విదేహి’. మనసు, సంకల్ప వికల్పాలతో ‘నేను, నాది’ అనే తత్త్వాలు, మంచిచెడులతో కూడుకున్నప్పుడు ఇదే ఆత్మను ‘జీవాత్మ’గా వ్యవహరిస్తాం. అంటే, మనబోటి వారన్నమాట. ‘జీవాత్మ’లో ఎప్పుడైతే ‘మంచి, చెడు’ అనే భావన నశిస్తుందో, ఎప్పుడైతే ‘నువ్వు, నేను’ అనే భావన పోతుందో, ఎప్పుడైతే ‘అహం’ నశిస్తుందో, ‘ఉన్నది ఒకటే ఆత్మ రెండవ పదార్థమే లేదు’ అన్న జ్ఞానాన్ని పొందుతుందో, ఆ జీవాత్మ ‘విముక్తాత్మ’ అవుతుంది. జన్మపరంపరలో ప్రతి జీవాత్మా ‘విముక్తాత్మ’గా పరిణమించవలసిందే. అలా కాలేకపోతే, కల్పాంతంలో పరమ దయాళువైన పరమాత్మే మనలను తనలో తానే కలిపేసుకుంటాడు. ఈ కలియుగంలో శ్రీహరికి ప్రత్యేకమైన అవతారాలు లేవు. అవధూతలు, యోగులు, సద్గురువులే శ్రీహరి అవతార ప్రతీకలు. సద్గురువులు విముక్తాత్మలు. వారు అందరినీ విముక్త స్థితికి తీసుకెళ్లడానికి సహకరిస్తారు. సందేహాలు, సమస్యలతో ఉన్న మనలాంటివారిని అర్జునుడిలా ‘జీవాత్మ’గా పిలుస్తారు. సద్గురువులు, శ్రీకృష్ణుడు సాక్షాత్ ‘పరమాత్మ’ ప్రతిరూపాలు. ‘గురుస్సాక్షాత్ పరబ్రహ్మ’. ‘పరమాత్మ’ అంటే సర్వం తానే అయిన నిత్యసత్య, సచ్చిదానంద స్వరూపం.
‘జీవాత్మ’ తొలి దఫా జన్మలలో ‘సాధారణ ఆత్మ’గానే ఉంటుంది. దుష్ట సాంగత్యాలు, దుర్జన ప్రభావాలు, లౌకిక కోర్కెలు, వాటికోసం చేసే దుష్కర్మల వల్ల ‘దుష్టాత్మ’గా మారుతుంది. సజ్జన సాంగత్యం, పరోపకార పరాయణత్వం వంటి సేవాభావాల వల్ల ‘శుద్ధాత్మ’గా వికసిస్తుంది. తత్త్వచింతన కలిగి, ధ్యానసాధనతో ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తే ‘విముక్తాత్మ’గా పరిణమిస్తుంది. ఇన్ని దశలను పూర్తిచేసి ‘పరమాత్మ’గా మారకపోతే, ఆ జీవాత్మ పూర్ణ వికాసం చెందినట్లు కాదు. అప్పటివరకు మనం మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాం. ‘పునరపి జననం- పునరపి మరణం’. ఇదెంతవరకు? ఈ జగన్నాటకం అంతమయ్యేంత దాక అంటే పరమాత్మలో లీనమయ్యేంత వరకు. స్వస్తి.
లంక శివరామకృష్ణ శాస్త్రి