‘గోమాత రక్షణ, సేవ, పూజ అత్యంత పుణ్యప్రదమని’ భారతీయ పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఆవులో సకల దేవతలూ కొలువై ఉంటారు. గోమాత మహిమ ఇంతా అంతా కాదు. ‘రామాయణం’లో కామధేనువును విశ్వామిత్రుడు బలవంతంగా వశిష్ట మహర్షినుండి తీసుకుపోవటం, తత్పర్యవసానాలు, ‘భాగవతం’లో శ్రీకృష్ణుడు గోవులపట్ల ప్రకటించిన అవ్యాజమైన ప్రేమ.. వంటివెన్నో ఇందుకు తార్కాణాలు. నేటికీ వివాహ తంతులో భాగంగా కన్యాదానంతోపాటు గోదానమూ ప్రశస్తమని పురాణాలు పలుకుతున్నాయి. జనన మరణాలు, పట్టాభిషేకాలు, ఉత్సవాల వేళల్లో ‘గోదానం’ ఒక గొప్ప సందేశం. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో దేవతలకు అభిషేకం చేయడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఎన్నో ఔషధగుణాలతో సంపూర్ణ ఆరోగ్యానికి పుష్టినిచ్చేవిగాను పలు పరిశోధనల్లో ఇవి విశేషమైన గుర్తింపును పొందాయి. గోవు ఉత్పత్తులన్నీ అత్యంత విలువైనవి, పవిత్రమైనవి. మనిషి తెలిసీ తెలియక చేసిన పాపాలకు పరిహారంగా అంత్యక్రియల వేళ నరక ప్రయాణంలో ‘వైతరిణీ నది’ (చీము, నెత్తుటితో కూడిన) దాటడానికి ‘గోదానం’ శ్రేష్టమని ‘గరుడ పురాణం’ చెబుతున్నది.
క్షీరసాగర మథనంలో చంద్రుడు, లక్ష్మీదేవి, అమృతం, విషం, కల్పవృక్షంతో పాటు కామధేనువూ పుట్టింది. సమస్త వస్తువులనూ సృష్టించగల దేవతా వరప్రసాదం ఆమె. నంది, భద్ర, సుశీల, సురభీ పేర్లతో గోవులు గౌరవాన్ని పొందుతున్నాయి. ‘రామాయణం’ బాలకాండ ప్రకారం, కామధేనువు వశిష్ట మహర్షి ఆశ్రమంలో ఉండగా, శిష్యగణానికి, వచ్చీపోయే అతిథులకు కోరినన్ని అన్నపానీయాలిస్తూ రాజర్షి విశ్వామిత్రుని దృష్టిలో పడటం, తత్పర్యవసానాలన్నీ విదితమే. అనంతుని ‘భోజరాజీయం’లో చెప్పినట్లు, ‘సత్యానికి, సాధుసత్వానికి ప్రతీకగా గోవు జంతుజాతికే ప్రతినిధి’గా పూజలందుకుంటున్నది. ‘గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు’ అని ఉపనిషత్తులూ పేర్కొన్నాయి. గోవు తనువులో 14 లోకాలు, 33 కోట్ల దేవతలు ఆవాహనమై ఉంటారు. కొమ్ములు, మూలంలో బ్రహ్మ విష్ణువులు, చివరలో నదులు, తీర్థాలు, తలపై గణపతి, రుద్రగణాలు, మెడడోలులో నాగదేవతలు, చెవుల్లో అశ్వినీ దేవతలు, కండ్లలో సూర్యచంద్రులు, హుంకారంలో సరస్వతీ జ్ఞానదేవతలు, మూత్రంలో గంగానదీమ తల్లి కొలువై ఉంటారు. గోవర్ధనగిరిని ఎత్తి మరీ గోపాలకృష్ణుడు గోవులను కాపాడాడు. ‘భాగవతం’ నిండా ఇలాంటి కథలెన్నో. రాజులు, దేవతలు పలు ఉత్సవాల్లో లక్షలాది గోదానాలు చేయడం పురాణ కథల్లో చదివాం. కన్యాదానంలో భాగంగా రుద్రధేనువు, కామధేనువు, మోక్షధేనువు, వైతరిణీ గోవు పేరిట సందర్భోచిత దానాలు చేయటం ఇప్పటికీ కొనసాగుతున్నది. పితృదేవతల తృప్తికోసం గోదానం చేయాలని ‘గరుడ పురాణం’ (11వ అధ్యాయం) తెలిపింది. ‘గోహత్య మహాపాపమని’ సర్వశాస్ర్తాలూ ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి.
రాముని పెండ్లికి ముందురోజు స్నాతకం వేళ దశరథ మహారాజు లక్ష గోవులను దానం చేసినట్లు ‘రామాయణం’ వివరిస్తున్నది. జనక మహారాజు రాముడికి గోదానాలు చేశాడు. పంచగవ్యాలైన గోక్షీరం, దధి, ఘృతం, మూత్రం, మయం ప్రాశన చేయడం వల్ల దేహంలోని, మనసులోని దోషాలన్నీ అగ్నిశుద్ధివలె దహించుకుపోతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఇంతేకాదు, ప్రకృతిలోని కాలుష్యాల్ని తగ్గించేందుకు గోఘృతంతో చేసే యజ్ఞాలు ఎంతో శ్రేష్ఠమని నిరూపణలు వున్నాయి. గోసంపద రక్షణ, పోషణలపట్ల చైతన్యం ఇటీవలి కాలంలో కనిపిస్తున్నా అది చాలినంతగా లేదు. ఇందుకోసం సనాతన ధర్మపరులంతా నడుం బిగించాలి. గోశాలల నిర్వాహకులు, రైతులు, పోషకులకు తగు ప్రోత్సాహం, చేయూతను ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి పౌరుడూ తీసుకోవాలి. వాటిని పెంచి పోషించే శక్తియుక్తులు, సమయం, ఓపిక లేకున్నా కనీసం గడ్డి, ఆహారం అందించడమూ కొంతవరకు పుణ్యప్రదమే. ప్రత్యామ్నాయం పేరుతో లోహవిగ్రహాలను ప్రోత్సహించడం భావ్యం కాదు. భారతీయులతోసహా సమస్త మానవజాతీ గోవులను కాపాడటానికి యథోచిత కృషి చేయాలని మన సనాతన ధర్మం ప్రబోధిస్తున్నది. దీనిని ప్రతీ ఒక్కరం బాధ్యతగా గుర్తిద్దాం.
మాడుగుల
నారాయణమూర్తి
94411 39106