సంసారాన్ని ‘సాగరం’ అనడంలోని ఉద్దేశం ఏమంటే ‘ఆద్యంతాలు మన జీవితం దుఃఖ భరితం కావడమే’. ‘ఇంత మానవజన్మ ఎత్తింది దుఃఖాలు అనుభవించడానికేనా?’ అనే సందేహం చాలామందికి కలుగుతుంది. దీనికి సమాధానం ఒక్కటే, జన్మ ఏదైనా అది దుఃఖ దాయకం కాకుండా ఉండదు. దుఃఖం జన్మను ఆశ్రయించి ఉంటుంది. జన్మ ప్రవృత్తులను, ప్రవృత్తులు రాగద్వేషాలను, అవివేకాన్ని ఆశ్రయించి ఉంటాయని దార్శనికుల వివేచన. మొత్తం మీద మన అవివేకం వల్లే జన్మ కలుగుతుంది. జన్మవల్ల దుఃఖం. ఈ దుఃఖాన్ని పోగొట్టడానికే ఒక ‘మహామంత్రం’ వ్యాప్తిలో ఉంది. దాన్ని మనం స్మరిస్తే, అర్థయుక్తంగా భావిస్తే మన దుఃఖం పోతుందని వేదఋషుల అభిమతం. అందుకే, వారు ఏ కార్యక్రమాన్ని మంత్రపూర్వకంగా నిర్వహించినా, తప్పక వారినోట ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అనే వాక్కులు తప్పక వెలువడతాయి.
ప్రసిద్ధ తత్తవేత్త రస్సెల్ ప్రపంచ దుఃఖాలను పరిశోధించాడు. సుమారు 40 ఏండ్ల పాటు పరిశోధించినా అతనికి దుఃఖమే కలిగింది కానీ, దాని స్వరూపం, దాన్ని తొలగించుకునే మార్గమైతే తెలియరాలేదు. దీనికోసమే ఆయన భారతదేశానికి వచ్చాడు. ఒక సాధువును కలుసుకొని తన సందేహం అడిగాడు. సుఖానికి ‘ఇష్టం’ కారణమైనట్లే, దుఃఖానికి ‘ఇష్టం కానిదేదో ప్రాప్తించడమే కారణమని’ సాధువు చెప్పాడు. తరచుగా మానవజన్మ దుఃఖానికి లోనవుతుంది. ఇష్టానిష్టాలతో మానవుడు తన జీవనయాత్ర కొనసాగిస్తాడు. ప్రయత్నశీలుడై దుఃఖాన్ని అధిగమిస్తాడు. ‘ఈ దుఃఖం ఎన్ని రకాలు?’ అని రస్సెల్ ప్రశ్నించగా, సాధువు ‘మూడు రకాలు’ అన్నాడు. ‘ఒకటి, శరీరగతమైన దుఃఖం. దీన్నే ‘ఆధ్యాత్మికం’ అంటారు. రెండు, తోటి ప్రాణికోటి వల్ల కలిగే దుఃఖం. ఇది ‘ఆధిభౌతికం’. మూడు, ప్రకృతి వల్ల సంక్రమించే దుఃఖం. ఎండ, వాన, భూకంపాలు, సుడిగుండాలు, వరదలు, ఆకస్మిక విపత్తులు వంటివేవైనా కావచ్చు. ఇవన్నీ మానవుని దుఃఖానికి కారణమవుతాయి. దీన్నే ‘ఆధిదైవికం’ అన్నారు. ఈ మూడింటిలోనే సమస్త దుఃఖాలూ అంతర్గతమై ఉంటాయి’ అని సాధువు చెప్పిన మాటలు రస్సెల్ మహాశయున్ని ఆలోచింపజేశాయి.
ఆశ్చర్యచకితుడైన రస్సెల్తో సాధువు సానునయంగా ఎంతోసేపు ముచ్చటించాడు. ‘ఈ మూడు దుఃఖాలను లేకుండా చేసుకోవడానికి మానవుడు ఎల్లవేళలా ప్రయత్నించాలి. ఔషధ సేవ నంచే శరీరదుఃఖం పోతుంది. సమభావన వల్ల తోటిప్రాణుల వల్ల కలిగే దుఃఖం దూరమవుతుంది. ప్రాకృతిక దుఃఖం మనకు తెలియకుండానే ఆవరిస్తుంది. ఎప్పుడో చేసిన కర్మల వల్ల ఏర్పడిన దుఃఖరూపమే ఆధిదైవికం. దీన్నే ‘ప్రారబ్ద దుఃఖం’ అంటారు. ఇది అనుభవిస్తేనే పోతుంది. ఏ దుఃఖమైనా మనిషి అనుభవించవలసిందే. ‘ఎంతకాలం అనుభవిస్తుండాలి? దీనికి అంతం లేదా?’ అనే ప్రశ్నలకు సాధువు చెప్పిన సమాధానమే శాంతిమంత్రం.. ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’. ఓంకార సంయుక్తమైన శాంతి శబ్దం మూడుసార్లు ఉచ్ఛరింపబడటానికి కారణం మూడు దుఃఖాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికే!
సుఖం గాని, దుఃఖం గాని మనకు జన్మతోపాటు సంక్రమిస్తాయి. నిజానికి సుఖదుఃఖాలను పరమేశ్వరుడు వట్టిగా మనకివ్వడు. మనం చేసిన కర్మలను సుఖదుఃఖ రూపంలో అనుభవింపవలసి వస్తుంది. అనుభవింపజేసేది పరమేశ్వరుడైనా అనుభవించవలసింది మనమే. ఓంకార వాచ్యుడైన పరమేశ్వరుడు మనల్ని దుఃఖ విముక్తులను చేయడానికి సర్వసమర్థుడు. కనుక అతనినే మనం స్మరించవలసి ఉన్నది, ధ్యానించవలసి ఉన్నది, ఉపాసించవలసి ఉన్నది. ఈ ఉపాసనలో భాగమే ‘శాంతిమంత్రం’. మూడు దుఃఖాలలో ఏదీ మనకు చెప్పి రాకపోవచ్చు. అయినా, మనం దుఃఖ విముక్తి కోసం పరమాత్మను ధ్యానించాల్సిందే. అందుకే, యోగులు ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని ఉచ్చరిస్తుంటారు. కష్టకాలంలో మనం ఈ మూడురకాల దుఃఖాల నుంచీ బయటపడవలసి ఉంటుంది. అందుకుగాను మనమంతా ఉచ్చరింపవలసిన శాంతిమంత్రం ఇదే.
ఆచార్య ,మసన చెన్నప్ప
98856 54381