భగవద్గీత (9-26) ‘అన్నీ తానై ఉండి, అన్నీ తానే ఇవ్వగల పరమాత్మకు మనం ఏమిస్తే సంతోషం కలుగుతుంది?’ అని ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన సమాధానం ‘భగవద్గీత’లోని పై శ్లోకంలో ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన విషయం ఇది. ‘ఆకు గాని- పువ్వు గాని, పండు గాని- కాసిన్ని నీళ్లు గానీ ఎవరైతే నాకు భక్తిపూర్వకంగా సమర్పిస్తారో ఆ పత్రి పుష్పాదులను నేను పరమ ప్రీతితో స్వీకరిస్తాను’. నమ్మశక్యం కానప్పటికీ ఇది నిజం. భక్తుని పరిశుద్ధమైన మనస్సును, ఆర్తితో కూడిన అర్పణను మాత్రమే పరమాత్మ ప్రేమతో అంగీకరిస్తాడు. శబరి తపనతో అర్పించిన అడవి పండ్లను శ్రీరామచంద్రుడు ఎంతో ప్రేమగా ఆరగించాడు. రంతీదేవుడు తన భార్యాపిల్లలతో సహా ఎన్నో రోజులుగా నిట్టు పవాసం ఉండి కూడా ప్రాణం నిలుపుకోవడానికి ఆఖరికి తనవద్ద మిగిలి ఉన్న గుక్కెడు మంచినీళ్లను సైతం అతిథి దేవతలకు ధారపోసి వారిని సంతృప్తి పరిచాడు. ఇలాంటి నిర్వ్యాజ భక్తికే, త్యాగనిష్ఠకే భగవంతుడు పరితపిస్తాడు. బాల్యస్నేహితుడైన కుచేలుడు ఇచ్చిన పిడికెడు అటుకులనే ఎంతో ప్రీతిగా ఆరగించిన శ్రీకృష్ణ పరమాత్మ అతనికి కోరకుండానే ఐష్టెశ్వర్యాలూ ఇచ్చాడు. భక్తుని భక్తి, హృదయ పవిత్రతలే స్వామికి ప్రధానం తప్ప, వారు ఇచ్చే వస్తువులు ముఖ్యం కాదు. ‘మహాభారతం’లో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో కూడా ఇదే స్పష్టమైంది. పాండవుల రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు, ఎంత ప్రాధేయపడినా దుర్యోధనాదుల ఆతిథ్యం స్వీకరించలేదు. పరమభక్తుడు, నిర్మల హృదయుడు, ధర్మాత్ముడైన విదురుని ఇంటికే అతిథిగా వెళ్లాడు. నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి పత్తిరిసుమంత నెవ్వండు పారవైచు కామధేనువు వానింటి గాడి పసర మల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు.
మాదయగారి మల్లన (రాజశేఖర చరిత్ర) ‘కాసిన్ని నీళ్లో, కొన్ని పత్రిదళాలో సమర్పించినంతనే శివుడు పొంగిపోతాడు. ఆ కాస్తా దానికే కామధేనువును, కల్పవృక్షాన్ని భక్తుని సొంతం చేస్తానంటాడు’. తిన్నడనే గిరిజనుడు పెట్టిన నంజుడు (మాంసం)ను సైతం ఈశ్వరుడు తిన్నాడు. సాలీడు, పాము, ఏనుగు ఇచ్చిన కానుకలూ స్వీకరించాడు. భగవంతుడు తన భక్తుల ‘అంతఃకరణ శుద్ధి’నే చూస్తాడు కానీ, ఇచ్చే వస్తువులు, వాటి విలువ చూడడని ఎన్నో పురాణేతిహాసాలు చెప్తున్నాయి. ‘నా పట్ల తప్ప, మరే ఇతర విషయాలపైనా చింతన లేకుండా (అనన్యా శ్చింతయంన్తమాం) అత్యంత పరిపూర్ణ భక్తితో సమర్పించిన వారి యోగక్షేమాలు తానే చూసుకుంటానని’ గీతాచార్యుడు అభయమిచ్చాడు. త్రిమూర్తులతో సహా దేవతలందరూ హవిర్భోక్తలు. అంటే, మనం చేసే యజ్ఞాల ద్వారా నేతితో అగ్నిలో సమర్పించే హోమ ద్రవ్యాలనే మంత్రపూర్వకంగా సంకల్పించిన ఆయా దేవతలు ఆహారంగా స్వీకరిస్తారు. అలాంటిది యజ్ఞాలు, తపస్సుల ఫలాన్ని అనుభవించే సర్వ లోకాలకు మహేశ్వరుడైన యజ్ఞభోక్త, బాలగోపాలునిగా అవతరించి వెన్న మీగడ లారగించడమూ ఒక లీల. సంగడీల నడుమ జక్కన గూర్చుండి నర్మభాషణముల నగవు నెఱపి యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద శైశవము మెఱసి చల్దిగుడిచె.
పోతనామాత్యుడు (శ్రీమద్భాగవతం, దశమస్కంధం) ‘తామరపువ్వు మధ్యలో కర్ణికలాగా కృష్ణుడు కూర్చొని ఉంటాడు. పూరేకుల లాగా చుట్టూ కూర్చున్న గోపబాలకులతో సరసాలాడుతూ చల్దులారగించిన తీరు’ను మహాకవి మనోజ్ఞంగా వర్ణించడం ఈ పద్యంలో చూస్తాం. యాగభోక్త కృష్ణుడు బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యపడేలా తోటి గోపాలకులతో కలిసి వినోదిస్తూ చల్దులు తిన్నాడు. నిష్కపటమైన సఖ్యభక్తికి ఇదే నిదర్శనం. మంచి మనసుతో మనకున్న దానిలో ఏది సమర్పించినా భగవంతుడు సంతోషంగా స్వీకరించి మనలను నిండుగా కనికరిస్తాడు.