నామ చింతామణిః కృష్ణశ్చైతన్య రసవిగ్రహ
పూర్ణః శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వాన్నామ నామినోః
‘శ్రీకృష్ణుని పవిత్రనామం దివ్యానందభరితమైంది. కృష్ణనామమంటే సాక్షాత్తు ఆనందనిలయుడైన శ్రీకృష్ణుడే. కనుక అది సమస్త ఆధ్యాత్మిక సంపదలను ప్రసాదించే వరప్రదాయిని. కృష్ణనామం సంపూర్ణమైంది. కృష్ణరూపం రస విగ్రహ స్వరూపం. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణనామం భౌతికపరమైంది కాజాలదు. అది సాక్షాత్తు శ్రీకృష్ణుని కన్నా శక్తిలో ఏ మాత్రం అల్పమైందీ కాదు. కృష్ణనామం ప్రాపంచిక గుణాలచే మలినమైంది కాదు. కనుక, మాయచే ప్రభావితమయ్యే ప్రశ్నే తలెత్తదు. నిత్యముక్తమైన కృష్ణనామం దివ్యమైంది. కృష్ణనామం, కృష్ణుడు అభిన్నం. కనుక, ప్రకృతి నియమాలచే శ్రీకృష్ణనామం ఎన్నటికీ బద్ధం కానిది’ (పద్మ పురాణం).
‘చింతామణి’ అంటే అది స్పృశించిన ప్రతి వస్తువునూ బంగారంగా మార్చే ఒక దివ్యమైన రాయి. భగవద్ధామంలో చింతామణులతో నిర్మితమైన అనేక గృహాలు ఉన్నట్లు ‘బ్రహ్మసంహిత’ పేర్కొన్నది. అది కేవలం ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే లభిస్తుంది. అత్యంత కారుణ్యమూర్తియైన శ్రీకృష్ణుడు ఈ లోకంలో నామరూపంలో చింతామణియై అవతరించాడు. ‘లోకంలో ధర్మం క్షీణించి అధర్మం ప్రబలినప్పుడల్లా తాను అవతరిస్తానని’ శ్రీకృష్ణుడు‘భగవద్గీత’లో వాగ్దానం చేశాడు. ప్రస్తుత కలియుగంలో ధార్మికవేత్తలమని చెప్పుకుంటూ ధర్మం పేరుతో కొందరు ఎన్నో అధార్మిక మార్గాలను ప్రబలింపజేయడం మనం చూస్తున్నదే. ‘కలికాలే నామరూప కృష్ణావతార్’ (చైతన్య చరితామృతము) అంటే, ‘శ్రీకృష్ణుడు కలియుగంలో పవిత్రనామ రూపంలో అవతరిస్తాడు’. ‘భగవన్నామం’ సమాజంలోని దుష్టశక్తులను తగ్గించటంలో ఎలా సహాయపడగలదన్నది కొందరి సందేహం.
‘భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడైతే తాను సుదర్శన చక్రం మొదలైన ఆయుధాలతో దుష్టులను సంహరించేవాడు. మరిప్పుడెలా దుష్టసంహారం జరుగుతుందని’ వారు ప్రశ్నిస్తుంటారు. గత యుగాలలో రాక్షసులు, భక్తుల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలుండేవి. వారు వివిధ శరీరాకృతులను కలిగి ఉండేవారు. ఈ యుగంలో మాత్రం వారిరువురూ ఒకేవిధమైన ఆకృతులతో ఉన్న శరీరాలనే కలిగి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తుల అసంబద్ధ ప్రవర్తనను చూసి అందరూ ఆశ్చర్యపడటం చూస్తుంటాం. అందువల్లే భగవంతుడు కలియుగంలో భౌతిక సంహారాన్ని చేపట్టడు. కనీసం ఏ ఆయుధాన్నీ చేతబట్టడు. దుష్టసంహారానికి గల ఏకైక ఆయుధం ‘భగవన్నామ’ మొక్కటే. పరమ పవిత్రమైన కృష్ణనామాలను ఎవరైతే జపిస్తారో, వారు భవబంధకారకమైన అసుర లక్షణాల నుంచి విముక్తిని పొందగలరు.
‘పద్మ పురాణం’ శ్రీ కృష్ణనామాన్ని ‘చింతామణి’తో పోలుస్తూ కొనియాడింది. ఈ చింతామణిని తాకినవారు భగవద్భక్తులై సత్ప్రవర్తనతో మెలగుతారు. కేవలం భగవన్నామాలను ప్రతిరోజూ జపించడం వల్ల సాధకునిలో దైవీగుణాలు పెంపొందుతాయి. కృష్ణనామమంటే సాక్షాత్తు శ్రీ కృష్ణుడే. కనుకే, అది సకల శుభప్రదమైన ఆధ్యాత్మిక సంపత్తిని ఇస్తుంది. శ్రీల ప్రభుపాదులవారు వివరించినట్టు, ‘భగవన్నామాన్ని జపించడం ప్రారంభించగానే మనసులోని అసుర లక్షణాలన్నీ తొలగుతాయి. మనసు పవిత్రతను సంతరించుకుంటుంది. శాంతి, ఆనందాలు అనుభూతిలోకి వస్తాయి. దానిని అలా కొనసాగిస్తూపోతే కొన్నాళ్లకు ఆధ్యాత్మిక విజ్ఞానంలోని సమస్త గుహ్యతమమైన అంశాలన్నీ సాధకునికి వ్యక్తమై అతిత్వరలోనే ఆనందసాగరాన్ని చేరగలడు.
‘భగవన్నామ’మంటేనే చైతన్యరస విగ్రహం. సుమారు 5 వేల ఏండ్ల కిందట శ్రీకృష్ణుడిగా ఆయన ఈ లోకంలో అవతరించినపుడు పాండవులు, యాదవులు, వ్రజవాసులు మొదలైన ఎందరో భక్తులు వారి లీలల్లో పాలు పంచుకొని ఆనందానుభూతి చెందారు. ఈ అవకాశం ప్రస్తుతం మనకూ ఉంది. అదే ప్రతి ఒక్కరూ ‘హరే కృష్ణ’ మహా మంత్రాన్ని జపించడం. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరం కృష్ణనామ లీలల్లో పాలు పంచుకొని అద్భుతమైన ఆ ఆనందానుభూతిని పొందుదాం. హరే కృష్ణ!
శ్రీమాన్ సత్యగౌర
చంద్రదాస ప్రభూజి
93969 56984