నవనాథుల్లో ‘చౌరంగీనాథుడు’ అనే గురువు కథ ‘సారంగధరుడు’ అనే పేరుతో ప్రచారంలో ఉంది. చౌరంగీనాథుడు రాజరాజ నరేంద్రుని కుమారుడని, సవతి తల్లి అతన్ని చంపించిందని, తర్వాత అతడు ఒక సన్యాసి చేత బతికి తత్తబోధలు చేస్తూ నవనాథుల్లో ఒకడు అయ్యాడంటారు. కాని నిజానికి చౌరంగనాథునికి ఆంధ్రదేశంతో ఎటువంటి సంబంధం లేదు.
నాథ సంప్రదాయంలో యోగానికి, యోగీశ్వరుడైన శివునికి ప్రాధాన్యం. తీర్థయాత్రలు చేయటం, పాపాలు పోవటానికి నదుల్లో మునగ డాన్ని, విగ్రహపూజలను, అంధవిశ్వాసాలను ఈ సాంప్రదాయం నిరసించింది. నాథ సంప్రదాయ ప్రభావం ఆ తర్వాత కబీర్ వంటి భక్త కవుల మీద పడింది. తెలుగులో వేమన మీద నాథ సంప్రదాయ ప్రభావం కనిపిస్తుంది. సిక్కుల సంప్రదాయం, అచల సిద్ధాంతం లాంటివన్నీ కూడా నాథ సంప్రదాయ ప్రభావంతో కూడినవే.
గౌరన నవనాథుల కథను చక్కని కథా కౌశలంతో రచిం చాడు. ఆయన రెండవ కావ్యం ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ కూడా ద్విపదలోనే ఉంది. దేశీఛందస్సు, ద్విపద సోమనాథుని తర్వాత గౌరన వల్లనే కావ్యగౌరవాన్ని పొందాయి. ఈ కావ్యంలో హరిశ్చంద్రుని కథ ఉంది. ‘మార్కండేయ స్కంద పురాణం’లో హరిశ్చంద్రుని కథ కనిపిస్తుంది. కాని గౌరన స్వంత కల్పనలను చేర్చి చదివిం చే కావ్యంగా రచించాడు. మంగళ సూత్రాన్ని చూసి చంద్రమతి తన భార్య అని హరిశ్చంద్రుడు గుర్తించటం, చంద్రమతి మీద శిషుహత్య నింద పడ టం, దానితో రాజదండనం, హరిశ్చంద్రుడు రాజాజ్ఞను నిర్వహించడానికి పూనుకోవ టం.. మొదలైన వృత్తాంతాలు, వర్ణనలలో గౌరన చేసిన కల్పనలు ఎన్నో ఉన్నాయి. సంస్కృతంలో క్షేమేశ్వరుడు (క్రీ.శ. 900) ‘చండకౌశికం’ అనే నాటకాన్ని హరిశ్చంద్రుని కథతోనే రచించాడు. ఆ నాటకంలో క్షేమేశ్వరుడు నక్షత్రక పాత్రను సృష్టించి ప్రవేశపెట్టాడు.
గౌరన తన కావ్యంలో కూడా నక్షత్రకుడి పాత్రను చేర్చాడు. పాత్ర చిత్రణ, సంభాషణలు, సన్నివేశాలు వీటన్నింటిచేత గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం నాటకీయతతో సాగింది. గౌరన సరళమైన శైలిలో దేశీయమైన భాషను ప్రయోగిస్తూ రచించాడు. పాత్రలను ఒక్కొక్క వ్యక్తిత్వంతో సహజంగా చిత్రించాడు.
గౌరన ఈ కావ్యాన్ని ఎక్కడా విసుగు పుట్టించకుండా వైవిధ్యంతో నడిపాడు. ఆధునిక కాలంలోనూ హరిశ్చంద్రుని కథ నాటకంగా వేదికలమీద ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆదరణను పొందింది. గౌరన ‘లక్షణ దీపిక’ అనే ప్రామాణికమైన ఛందోగ్రంథాన్ని రచించాడు.
కొఱవి గోపరాజు రేచర్ల రాజుల కాలం వాడు. క్రీ.శ.15వ శతాబ్దం వాడు. ఇతని పెద్దతండ్రి కొడుకులు ఇద్దరూ బాచన, సింగనలు రాచకొండ రాజు రేచర్ల సింగమనాయకుని మంత్రులు. కొఱవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’ అనే కథా కావ్యాన్ని రచించాడు. దీన్ని హరిహర నాథునికి అంకితం ఇచ్చాడు. దీనిలో 12 ఆశ్వాసాలున్నాయి. ‘ద్వాత్రింశిక’ అంటే 32 అని అర్థం. ఒక రైతు చెలకలో పాతిపెట్టిన సింహాసనం భోజరాజుకు దొరుకుతుంది. ఆ సింహాసనాన్ని తెచ్చి మంచి రోజు చూసి దాన్ని అధిష్టించబోతాడు. ఆ సింహాసనానాకి 32 మెట్లు ఉంటాయి. ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క బొమ్మ ఉంటుంది. భోజరాజు సింహాసనం మెట్లు ఎక్కుతుండగా ఒక్కొక్క రోజు ఒక బొమ్మ.. ‘నీకు విక్రమాదిత్యుని సాహస, ఔదార్య గుణాలు ఉంటేనే ఈ సింహాసనం ఎక్క’మని అంటుంది.
–ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606