మానవుల స్వభావాలనుబట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులనుబట్టి, తమ బలాబలా లనుబట్టి, పొందిన అనుభవాలనుబట్టి వారివారి వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుం టాయి. ఆయా వ్యక్తిత్వాలనుబట్టి ఆయా వాదాలను ఆశ్రయిస్తారు వారు. దృక్పథాల దృష్ట్యా మానవులను స్థూలంగా ‘ఆశావాదులు’గా, ‘నిరాశావా దులు’గా విభజిస్తాం. అపాయంలోనూ అవకాశాలు వెతుకుతూ ఆశావాది గరిష్ఠాన్ని ఆశిస్తే, నిరాశావాది అవకాశంలో అపాయాన్ని చూస్తూ కనిష్ఠాన్ని ఆశిస్తాడు. ఆశావాదులు స్వప్నిస్తూ సమస్యలలో పరిష్కారాలను చూస్తే, నిరాశావాదులు యథార్థంలో కూరుకొని సమస్యలనే చూస్తారు. ఆశావాదులకు గమ్యప్రాప్తిపై దృష్టి ఎక్కువ. నిరాశావాదులకు వాస్తవస్థితుల పరిమితిపై దృష్టి ఎక్కువ. ఆశావాదం పగలైతే, నిరాశావాదం రాత్రిలాంటిదంటారు. పగలు స్తబ్ధత నుంచి వెలికి తీసేదైతే, రాత్రి స్తబ్ధతలోకి పడదోసేదన్న అర్థంలో.. పగలు రాత్రులు రెండూ నిజమే, అవసరమే అయినా జాగ్రదావస్థకు, క్రియాత్మక జీవనానికి పగలే ఆధారం. అలాగే, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్ప టికీ జాగ్రత్తగా, సబలంగా సంతోషాన్ని పండించుకుంటూ, పంచుతూ జీవన కర్మలను నిర్వహించడానికి ఎప్పుడూ కావలసింది ఆశావాదమే. స్వంతబలమూ, పరిస్థితుల అనుకూలత ఎంత ఎక్కువగా ఉంటే అంత సహజం గా ఆశావాద దృక్పథం కలుగుతుంది. అవి లేనప్పుడు మాత్రం ఆశావాదం కల్పించుకొని, పెంచుకొని పురోగమించవలసి ఉంటుంది. పరిస్థితులు ఎట్లున్నా, దిశ మంచిదైనా, చెడుదైనా ఆశావాదం వల్లనే కర్మల జోరుతో పురోగతి జరిగేది.
నిరాశావాదం రెండు పరిస్థితుల్లో కలుగుతుంది. ఒకటి: తను బలహీనుడై, పరిస్థితులు ప్రతికూలమైనపుడు. రెండు: సమాజంలో కర్తవ్యనిష్ఠకు, నాణ్యతకు విలువ తరిగి, తగు ఫలాలనివ్వగలిగిన న్యాయబలం సన్నగిల్లినప్పుడు. నిరాశా దృక్పథం సమర్థనీయం కాకపోయినా అది జాగ్రత్తను పెంచుతుంది. సరళతను సహజం చేస్తుంది. ఉత్సాహపు ఊపులోకి తోయక కొంత భయాన్ని, జాలినీ కలిగిస్తుంది. హానికి పూనుకోదు. నిరాశావాదం అతిగా పెరిగితే ఒత్తిడికి, న్యూనతకు, నిష్క్రియా పరత్వానికి, ఆత్మఘాతానికి దారితీస్తుంది. నిజానికి వాస్తవ పరిస్థితులకు పరిమితమైన నిరాశావాదపు ఒత్తిడిలోంచే ప్రతిఘటనలు, తిరుగుబాట్లు, విప్లవాలు పుట్టుకొస్తాయి. అయితే, ఆరోగ్యకర సమాజం ఎక్కువగా ఆశావాదానికి ప్రాణం పోసేదిగానే ఉంటుంది. ఆశావాదం ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా, భీకర యుద్ధంలోనైనా, ఉత్సాహంతో కర్తవ్యనిష్ఠ తో గమ్యం వైపు నడిపిస్తుంది. దానికి మంచిచెడుల పట్టింపు తక్కువ. గమ్యప్రాప్తియే ప్రధానం. అయితే, ఆశావాదం అతిగా మారితే, ఆధ్యాత్మికతతో సంస్కారవంతం కాకుంటే, దుస్సాహసంగా, అవకాశవాదంగా మారుతుంది. వినియోగ మోహంగా, సంపాదనా దాహంగా పరిణమిస్తుంది. అహంకార మదంగా, ఆక్రమణ రోగంగా రూపొందుతుంది. అటువంటి అసుర ఆశావాదం నుంచే నాటి పురాణాలలోని దేవదానవ యుద్ధాలు కానీ, నేటి దేశాలమధ్య యుద్ధాలు కానీ పుట్టేది. నేడు సుమారుగా ప్రతి రంగంలో కనబడే ధర్మభ్రష్టతకు కూడా కారణం ఇదే. అందుకే, ఎప్పటికైనా కావలసింది ఇటు ఆశావాదాన్నీ, అటు నిరాశావాదాన్నీ నియంత్రించే ఆధ్యాత్మిక వాదమే.
ఆధ్యాత్మికత సృష్టికి కారణమైన మూల శివసత్యాన్ని అంగీకరించి, కృతజ్ఞతను పెంచుతుంది. భౌతికసుఖాల అశాశ్వతత్వాన్ని తెలిపి, అసత్యంలోకి దిగజార కుండా రక్షిస్తుంది. సరళతతో, సహజతతో, ఆత్మబలంతో జీవించడం నేర్పుతుం ది. నిరాశావాదాన్ని, ప్రతికూలతలను లెక్కచేయని వీరంగా మారుస్తుంది. ఆశావాదాన్ని వినయాన్నిచ్చే, ప్రేమను పెంచే విజయగంధంగా విస్తరింపజేస్తుం ది. అటువంటి హృదయ స్థితే ఘోషిస్తుంది.. ‘సర్వేజనా సుఖినోభవంతు! లోకాస్సమస్తా సుఖినోభవంతు!’ అని.
-యముగంటి ప్రభాకర్
94401 52258